దేశంలో కెల్లా నంబర్‌ 1 స్థానంలో మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండాలి- తుమ్మల నాగేశ్వర రావు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని దేశంలో నెంబర్‌ 1 స్థానంలో నిలబెట్టడానికి అందరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రధానుల చేతుల మీదుగా 60 ఏళ్ల క్రితం ప్రారంభమైన విశ్వవిద్యాలయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. డిసెంబర్‌లో జరగనున్న విశ్వవిద్యాలయం వజ్రోత్సవ ఉత్సవాలు (డైమండ్‌ జూబ్లీ) ఫ్లయర్‌, లోగోలనీ మంత్రి ఈ ఉదయం సైఫాబాద్‌లో ఉన్న విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్‌ కళాశాలలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ యం. కోదండ రెడ్డి, తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ జి. చిన్నారెడ్డి, పిజెటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్థాస్‌ జానయ్య, విశ్వవిద్యాలయ అధికారులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. దేశంలోనే మన రాష్ట్రం వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉందనీ, అలాగే విశ్వవిద్యాలయాన్ని నెంబర్‌ 1 స్థానానికి తీసుకెళ్లాలని తుమ్మల సూచించారు. డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలని ఉపయోగించుకొని ఈ లక్ష్యాలని సాధించాలన్నారు. ముఖ్యమంత్రికి వ్యవసాయం అత్యంత ప్రాధాన్యత అంశం అని వివరించారు. అందుకే బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. ఈ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు విశ్వవిద్యాలయం భవిష్యత్తుని నిర్ణయించేలా ఉండాలన్నారు. 60 ఏళ్ల విజయాల గురించి సంతృప్తి చెందకుండా భవిష్యత్‌ ప్రణాళికల్ని రూపొందించాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి సలహాలు, ఆదేశాలు తీసుకొని ముందుకెళ్లాలన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లవేళలా తోడుంటుందని అన్నారు. అదేవిధంగా ఈనెల 30న మహబూబ్‌ నగర్‌ లో రైతు సదస్సు ఉండనుందని.. 28 నుంచే ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. రైతులకి ఆచరణలో ఉపయోగపడేలా ఈ ప్రదర్శనలు ఉండాలన్నారు. చిన్నారెడ్డి, కోదండ రెడ్డిలు నిరంతరము రైతులు, వ్యవసాయ రంగాల గురించే మాట్లాడుతారని వారి సేవలను వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
ఏడాదిగా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపడుతున్నదని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ యం. కోదండ రెడ్డి అన్నారు. ఈ సమయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు జరగడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా ఈ వేడుకల ద్వారా రాష్ట్ర వ్యవసాయరంగ భవిష్యత్‌కి సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయం మంచి సందేశం ఇవ్వాలని ఆయన సూచించారు. 1971-78 ల మధ్య తాను రాజేంద్రనగర్‌ క్యాంపస్‌ లోనే వ్యవసాయ విద్యన్ని అభ్యసించానని ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ చైర్మన్‌ జి. చిన్నారెడ్డి తెలిపారు. ఉత్సాహవంతులైన ఉపకులపతి నేతృత్వంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మించాలని సూచించారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమధ్య ప్రధాని విడుదల చేసిన వంగడాల్లో తెలంగాణవి లేకపోవడం ఆలోచించవలసిన విషయం అని చిన్నారెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1964 లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారని పిజెటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్థాస్‌ జానయ్య అన్నారు. 1964లో ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి విశ్వవిద్యాలయాన్ని, 1966 లో పరిపాలన భవనాన్ని ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారన్నారు. ఇన్నేళ్ళ విశ్వవిద్యాలయ విజయాలు, సేవల్ని స్మరించుకుంటూ వజ్రోత్సవాలని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా లోగో, ఫ్లయర్‌ లని విడుదల చేశామన్నారు. డిసెంబర్‌ 20, 21 తేదీల్లో ఉత్సవాల్ని నిర్వహించాలని నిర్ణయించామని, భవిష్యత్తులో తేదీలు మారవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, యుజిసి చైర్మన్‌, ఐసిఏఆర్‌ డీజీ, ఇక్రిశాట్‌ డీజీ ఇంకా అనేక మంది ప్రముఖులు, మాజీ ఉపకులపతులు, వ్యవసాయ మంత్రులని ఈ వేడుకలకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. మహబూబ్‌ నగర్‌ వాసి, విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) చైర్మన్‌ శ్రీనివాసులు శెట్టి కూడా ఈ వేడుకలకు హాజరవుతారని అన్నారు.
రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో వ్యవసాయ కళాశాలలను ప్రారంభించడానికి ముందే తమ ముందస్తు అనుమతి ఉండాలని ఐసిఏఆర్‌ ఈ మధ్య అన్ని రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీ లకి లేఖ రాసిందని జానయ్య తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈ విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. ప్రైవేట్‌ కళాశాలల ప్రలోభాలకు గురికావద్దని ఉపకులపతి సూచించారు.

Read More

మహబూబ్‌నగర్‌లో రైతు సదస్సు

ఈనెల 28, 29, 30 తేదీల్లో తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్వహించే రైతు పండుగ విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలసి పనిచేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, దామోదర్‌ రాజనర్సింహ లు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈనెల 28,29,30 తేదీలలో నిర్వహించే రైతు సదస్సు ఏర్పాట్లపై నేడు సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహా, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యకక్షులు డాక్టర్‌ చిన్నారెడ్డి, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌, కలెక్టర్లు, ఎస్‌.పి లు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మరే రంగానికి లేని విధంగా వ్యవసాయ రంగానికి అధిక మొత్తం నిధులు కేటాయించిందని, ముఖ్యంగా రైతు రుణమాఫీతో రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గంలో కనీసం 20 వేల మంది నుండి 30 వేల మంది రైతులకు లబ్ది చేకూరిందని గుర్తు చేశారు. రైతులకు పెద్ద ఎత్తున చేకూరిన ఈ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, ఆదర్శ రైతుల ప్రసంగాలు, ఈ రైతు సదస్సులో ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలిపారు. ఈనెల 28 న ఉదయం 10 గంటలకు ఈ రైతు సదస్సు ప్రారంభమవుతుందని, ఈ మొదటి రోజు సదస్సుకు ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన రైతులు హాజరవుతారని, ఈ ప్రారంభ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా తాను ప్రారంభిస్తానని, ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు హాజరవుతారని తుమ్మల చెప్పారు. రెండోరోజైన 29 న మహబూబ్‌ నగర్‌ జిల్లాయేతర ప్రాంతాలనుండి రైతులు హాజరవుతారని, 30న రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి కనీసం లక్ష మంది రైతులు ఈ రైతు సదస్సుకు హాజరవుతారని వివరించారు. మొదటి రెండు రోజులు ప్రతీ రోజు 5000 మంది రైతులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 30వ తేదీన సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
ఈ మూడు రోజులు రైతు సదస్సు వేదికపై ఆదర్శ రైతులచే ప్రసంగాలు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరణలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ మత్స్య తదితర రంగాలకు చెందిన ఆదర్శ రైతులచే ప్రసంగాలు, విజయగాధలపై వీడియో ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. ఒక్కొక్క పంటకు సంబంధించి ఒక్కొక్క ఆదర్శ రైతును గుర్తించి వారి అనుభవాలు ఈ సదస్సులో వివరిస్తారని మంత్రి తెలిపారు.
ఆధునిక వ్యవసాయ యంత్ర సామాగ్రి, వివిధ రకాల పంట రీతులు, హైబ్రిడ్‌ వంగడాలు, ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలపై ప్రదర్శన స్టాళ్ళను సంబంధిత శాఖలు ఏర్పాటు చేస్తాయని తెలిపారు. ఈ మూడురోజుల కార్యక్రమాలను రాష్ట్రంలోని 560 రైతు వేదికల ద్వారా లైవ్‌ ప్రసారం చేయాలని వ్యవసాయ శాఖా మంత్రి ఆదేశించారు. ఈ రాష్ట్ర స్థాయి సదస్సుకు వాహనాల పార్కింగ్‌, ట్రాఫిక్‌, స్టాళ్ళ ఏర్పాటు, రైతులకు అవగాహన తదితర కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.
ఈ సమీక్ష సమావేశానికి ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కె.దామోధర్‌ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు డా. శ్రీహరి, మేఘా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీ కృష్ణ, పర్ణీక రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, జిఏడీ కార్యదర్శి రఘునందన్‌, టిజిఎస్‌పిడిసిఎల్‌ సియండి ముషారఫ్‌ అలీ ఫరూఖీ, సమాచార శాఖ స్పెషల్‌ కమీషనర్‌ హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More