వ్యవసాయ యోగ్యంగా పోడు భూములు

తెలంగాణలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని రూపొందించింది. పోడు భూముల్లో సేద్యం చేస్తున్న రైతులందరికీ రానున్న ఐదేళ్లలో (2025-26 నుంచి 2029-30 వరకు) సోలార్‌ పంపు సెట్ల ద్వారా నీటివసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఒక్కో యూనిట్‌కు రూ. 6 లక్షల చొప్పున ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ. 12,600 కోట్లు ఖర్చు చేయనుంది. తొలి ఏడాది రూ.600 కోట్లు… తర్వాత ఒక్కో ఏడాదికి రూ.3,000 కోట్ల చొప్పున వ్యయం చేస్తుంది. ఈ నెల 18న నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మాచారంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఈనెల 18న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎ. శరత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

2025-26 కార్యాచరణ
మండలాల వారీగా ఈనెల 25 వరకు అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించాలి. జూన్‌ 10 వరకు క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన, భూగర్భ జలాల సర్వే, ఇతర అంచనాలు రూపొందించాలి. జిల్లా స్థాయిలో ఈ నెల 30 నాటికి సర్వే, ఇతర పనులకు టెండర్లు పిలిచి, ఖరారు చేయాలి. జూన్‌ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇన్‌ఛార్జ్‌ మంత్రి అనుమతితో పనులు అప్పగించాలి. జూన్‌ 26 నుంచి 2026 మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరుబావుల తవ్వకం, సోలార్‌ పంపుసెట్ల ఏర్పాటు, ఉద్యాన పంటల అభివృద్ధి పనులు చేసి, యూనిట్ల వినియోగపత్రాలను సమర్పించాలి.

రైతుల అర్హతలు: – అటవీ హక్కుల చట్టం (2006) కింద 6.69 లక్షల ఎకరాలపై 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడుపట్టాలు మంజూరయ్యాయి. 2.10 లక్షల మంది రైతుల అధీనంలోని 6 లక్షల ఎకరాల భూములకు విద్యుత్తు సౌకర్యం లేదు.. వీటికి పూర్తి రాయితీతో సోలార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేసి, నీటివసతి కల్పిస్తారు.

  • రైతుకు రెండున్నర ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్‌ యూనిట్‌గా పరిగణిస్తారు. అంతకు తక్కువుంటే పక్కనే ఉండే 2-5 మంది రైతులతో బోర్‌వెల్‌ యూజర్‌ గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. ఇది సాధ్యం కాకుంటే ఓపెన్‌ వెల్‌ గ్రూప్‌ ఏర్పాటు చేస్తారు. జిల్లాస్థాయిలో పథకం అమలు, కొనుగోళ్ల కమిటీ కలెక్టర్‌ చైర్మన్‌గా ఉంటారు.
  • అధిక విస్తీర్ణంలో పోడు భూములున్న భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, ఖమ్మం, ములుగు, నిర్మల్‌, కామారెడ్డి, నల్గొండ, వరంగల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, నాగర్‌కర్నూల్‌ను ప్రత్యేక జిల్లాలుగా గుర్తించారు. తక్కువ విస్తీర్ణంలో భూములున్న జిల్లాలను సమీపంలోని ఇతర జిల్లాలతో కలిపి 5 నోడల్‌ జిల్లాలుగా ప్రకటించారు.
Read More

రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ కంపెనీల పురోగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష

ఆయిల్‌ పామ్‌ సాగులో తెలంగాణా రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచాలని, పురోగతి చూపించని కంపెనీలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు.
తీరుమార్చుకొని కంపెనీల అనుమతులు రద్దు చేసి, టిజి ఆయిల్‌ ఫెడ్‌కు కేటాయిస్తామని, వచ్చే సంవత్సరం చివరికల్లా ప్రతి కంపెనీ వారికి కేటాయించిన జోన్లలో ప్రాసెసింగ్‌ కంపెనీలు ఏర్పాటు చేయాల్సిందే అని, ఆయిల్‌ పామ్‌ సాగును లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని, ఆయిల్‌ పామ్‌ సాగుకు కొత్త రైతులు ముందుకు రావాలని మంత్రి అన్నారు.
పలు జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన తుమ్మల పామాయిల్‌ రైతులకు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగును లాభసాటిగా చేయడమే ఈ ప్రభుత్వం లక్ష్యం అని తెలియజేశారు. 
ఇప్పటికే 64,040 హెక్టార్లలో ఆయిల్‌ పాం ప్లాంటేషన్‌ చేశామని, అలాగే ప్రతి సంవత్సరం 40000 హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగుచేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, దానిని సాధించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసి, ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా ప్రగతిని సమీక్షించాలని అధికారులకు సూచించారు.  
2024-25 సంవత్సరంలో 1,00,000 ఎకరాలకు ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోగా, ఇప్పటివరకు 25,470 ఎకరాలలో ప్లాంటేషన్‌ పూర్తిచేసుకున్నామన్నారు. ఈ సంవత్సరం కేటాయించిన లక్ష్యంలో  వాల్యూ ఆయిల్‌ కంపెనీ 36 %, పతాంజలి 33%, టిజి ఆయిల్‌ ఫెడ్‌ 31%, ఎకోపామ్‌ 28.5%, గోద్రెజ్‌ 26%, ప్రి యునిక్‌ 22%, మాట్రిక్స్‌ 21%, కె.ఎన్‌ బయో 19.72%, తిరుమల 16.4%, సువెన్‌ అగ్రో 16.2%, రాంచరణ్‌ 15.6%, లివ్‌ పామ్‌ 13%, విశ్వతేజ 11.5%, లోహియ 10.40 % ప్రగతిని సాధించాయని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి కల్లా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. 
ఆయిల్‌ పామ్‌ కంపెనీలు వారికి కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లలో ఆయిల్‌ పామ్‌ గెలల ప్రాసెసింగ్‌ కర్మాగారాల ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి ఆదేశించారు. వచ్చే సంవత్సరం చివరికల్లా ప్రతి కంపెనీ తమ యొక్క ఫ్యాక్టరీ జోన్లలో ఆయిల్‌ పామ్‌ గెలల ప్రాసెసింగ్‌ కర్మాగారాల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఆయిల్‌ పామ్‌ కంపెనీ నర్సరీని కలిగిఉండాలని, లక్ష్యానికి అనుగుణంగా నాణ్యమైన ఆయిల్‌ పామ్‌ మొక్కలు ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని, నర్సరీ స్థాయిలోనే జన్యుపరమైన సమస్యలు ఉన్న మొక్కలను తొలగించి, నాణ్యమైన మొక్కలు మాత్రమే రైతులకు సరఫరా చేయాలని ఆదేశించారు. అత్యధిక గెలల దిగుబడి మరియు నూనె శాతాన్ని ఇచ్చే వంగడాలను, గ్యానో డెర్మలాంటి వ్యాధులను తట్టుకొనే వంగడాలను, తక్కువ ఎత్తు పెరిగే పొట్టి రకాలకు సంబంధించిన నాణ్యమైన మొలకలను  తెప్పించుకొని నర్సరీలలో పెంచి రైతులకు సరఫరా చేయాలన్నారు. 
ఇదివరకే నాటిన తోటలలో మొదటినుంచే కాండంతడి తెగులు (గ్యానో డెర్మ) సోకకుండా, తెగుళ్ళ నివారణకు అవసరమైన సాంకేతికత శిక్షణను రైతులకు ఆయిల్‌ పామ్‌ కంపెనీలు అందించాలని ఆదేశించారు. 
రాష్ట్ర ప్రభుత్వ కృషి వలన ప్రస్తుతం ఆయిల్‌ పామ్‌ గెలల ధర టన్నుకు రూ. 19,144 కు పెరగడం జరిగిందని, ఈ సంవత్సర కాలంలోనే టన్నుకు పామ్‌ ఆయిల్‌ గెలల ధర రూ.6000 కు పైగా పెరిగిందని, త్వరలోనే టన్ను ధర రూ. 20,000 దాటే అవకాశం ఉందని మంత్రి తెలియజేశారు. ఆయిల్‌ పామ్‌ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయిల్‌ పామ్‌ గెలల ధర కనీసం టన్నుకు 20,000 కు తగ్గకుండా ఉండేలా ధరల స్థరీకరణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. 
ఈ సమీక్షాసమావేశంలో ఉద్యానశాఖ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ భాషా, ఐ.ఎ.ఎస్‌, మరియు ఆయిల్‌ ఫెడ్‌ అధికారులు పాల్గొన్నారు. 

*వరి కొనుగోలు కేంద్రాల తనిఖీ...*
నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి, జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను విధిగా సందర్శించాలన్నారు. రైతులు కూడా నాణ్యతా ప్రమాణాల ప్రకారం తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.
Read More