జూన్ 12న తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం

దేశంలోనే రెండవ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 1964 జూన్ 12 వ తేదీన రాజేంద్రనగర్‌లో ఏర్పాటు అయింది. ప్రస్తుత వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిపాలనా భవనంతో పాటు ఇతర మౌలిక వసతుల సముదాయాన్ని ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జూన్, 1966 లో ప్రారంభించి రైతాంగానికి అంకితం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రముఖ తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయ శంకర్ గారి పేరుతో ఈ విశ్వవిద్యాలయం రైతాంగానికి సేవలు అందిస్తోంది. ఈ సందర్బంగా జూన్ 12 వ తేదీన నిర్వహించ తలపెట్టిన 62 వ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా భారత హరిత విప్లవ సాధనలో ఇందిరాగాంధీ విశేష సేవలు అన్న అంశంపై జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవ ప్రసంగాన్ని ప్రముఖ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఇవ్వనున్నారు. అదే విధంగా యం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ వ్యవసాయ ఆర్ధిక వేత్త ప్రొఫెసర్ మధురా స్వామినాథన్ ఈ జాతీయ సదస్సు అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. అలాగే ప్రముఖ పార్లమెంటేరియన్, విధాన విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని విశిష్ట ప్రసంగం చేయనున్నారు.

రాహుల్ గాంధీకి ఆహ్వానం
ఈ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం, ఇతర మౌలిక వసతులని ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించి 60 ఏళ్ళు అయిన సందర్బంగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకి ముఖ్య అతిధిగా రావాల్సిందిగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆహ్వానం అందించినట్లు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా విశ్వవిద్యాలయం కోరింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలని నిర్వహించనున్నట్లు అల్దాస్ జానయ్య తెలిపారు.1966-84 మధ్యలో హరిత విప్లవాన్ని విజయవంతంగా అమలు చేసి దేశానికి ఆహార భద్రతని అందించిన ఆనాటి ఇందిరాగాంధీ నాయకత్వాన్ని, ఆనాటి రైతు అనుకూల విధానాలని, వివిధ సంస్థలని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఉప కులపతి పేర్కొన్నారు. అందుకే ఈ 62 వ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్లు అల్దాస్ జానయ్య వివరించారు.

Read More

జై జవాన్‌ – జై కిసాన్‌

వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగే అవకాశం సైన్యం, నౌకా, వైమానిక దళాల్లో పనిచేస్తూ త్వరలో పదవీ విరమణ పొందనున్న అధికారులకు కల్పించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఏటా సైన్యంలో పదవీ విరమణ పొందే అధికారులు వివిధ వృత్తుల్లో స్థిరపడుతున్నారు. వ్యవసాయ రంగంలో అవకాశాలు మెండుగా ఉండటంతో దానిపై అవగాహన కల్పించి పరిశ్రమల స్థాపన దిశగా వారిని ప్రోత్సహించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ‘జైజవాన్‌ – జైకిసాన్‌’ పేరిట ఎంపిక చేసినవారికి నాలుగు నెలల పాటు శిక్షణ ఇవ్వనుంది. 43 మందితో కూడిన తొలి బృందానికి శిక్షణను బుధవారం హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ (మెనేజ్‌)లో సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ హనుమాన్‌ సింగ్‌, హైదరాబాద్‌ ఆర్టిలరీ సెంటర్‌ లెఫ్టినెంట్‌ కర్నల్‌ ఆకాశ్‌ గెరా ప్రారంభించారు. పంటల సాగు, ఉత్పత్తి, ఆహార శుద్ధి, మార్కెటింగ్‌లతో పాటు పరిశ్రమలు, వ్యాపార నిర్వహణ, వ్యవస్థాపకతపై వచ్చే డిసెంబరు 26 వరకు నిపుణులతో శిక్షణ ఇస్తామని హనుమాన్‌ సింగ్‌ తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలున్న సైనికాధికారులు శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా, నాయకులుగా ఎదగాలని కర్నల్‌ ఆకాశ్‌ గెరా ఆకాంక్షించారు.

Read More