మన దేశ ఆహార వినియోగంలో 9% వాటా ఉంది. వరి, గోధుమల తర్వాత మొక్కజొన్న మూడో ఆహార పంట. అన్ని రాష్ట్రాల్లో కలిపి వానాకాలం సీజన్‌లలో 80%, యాసంగిలో 20% పండుతుంది. ఈ పంట దిగుబడులకు ఇథనాల్‌ పరిశ్రమలు పోటీపడి కొనడంతో డిమాండ్‌ విపరీతంగా ఏర్పడింది. 2024-25లో 70% మేరకు సరకును అవే తీసుకున్నాయి. ఈ ఏడాది కొనుగోళ్లు మరింత పెరుగుతాయని వ్యవసాయ, పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.

రొట్టెపిండి, బిస్కట్లు, పాప్‌కార్న్‌, ఔషధాలు, సౌందర్య సాధనాలు, ఫిల్మ్‌, వస్త్ర, జిగురు, ప్యాకింగ్‌, ఆల్కహాల్‌, కాగితం పరిశ్రమలు వంటి వాటికి మొక్కజొన్నలు ముడిసరకుగా ఉపయోగపడుతున్నాయి. పశువులు, కోళ్లకు దాణాగా, ఇతర పశుగ్రాస ఉత్పత్తులకు ముడిసరకుగా ఉంది. దేశంలో నాలుగేళ్లు నుంచి ఇథనాల్‌ పరిశ్రమలు రంగంలోకి దిగడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది.

ఇంధన దిగుమతులను తగ్గించడానికి పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ని కలపాలనే కేంద్ర నిర్ణయంతో ఇథనాల్‌ పరిశ్రమ యాజమాన్యాలు మొక్కజొన్నలను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. నూకలు, చెరకు పిప్పి తదితర ప్రత్యామ్నాయాలు ఉన్నా మక్కలపైనే దృష్టి నిలిపాయి. చెరకు, వరిని అధిగమించి 2023-24లో మొక్కజొన్న మొత్తం ఇథనాల్‌ ఉత్పత్తిలో 42.74% వాటాను పొందింది. 2024లో 7.5 మిలియన్‌ టన్నుల మక్కలను ఇథనాల్‌ కంపెనీలు కొనుగోలు చేశాయి. ఈ ఏడాది అది 13.3 టన్నులకు చేరనుంది. ఇది మొత్తం ఉత్పత్తిలో 70% కావడం గమనార్హం. ఇథనాల్‌ కంపెనీల పోటీతో మక్కలకు మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా…
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2025-26 వానా కాలం సీజన్లో 91.89 లక్షల హెక్టార్లలో మక్కలు వేశారు. నిరుడు ఇదే సమయానికి 83.15 లక్షల హెక్టార్లు ఉండగా… ఈ సీజన్‌ లో 10.5% పెరిగింది. గత ఐదేళ్ల సగటుతో పోలిస్తే ఈసారి పెరుగుదల 16.3% ఎక్కువగా ఉంది. మక్కల ఉత్పత్తిలో కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా… తెలంగాణ, ఏపీ 5, 7 స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది వానాకాలం సీజన్లో తెలంగాణలో 6,27,540 ఎకరాల్లో పంట వేశారు. ఇది సాగు లక్ష్యం కంటే 120% ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో 3.58 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. ఇది గత ఏడాది కంటే 139% ఎక్కువ. రెండు రాష్ట్రాల్లో మక్కల విత్తనోత్పత్తి కూడా పెరిగింది. 60 వేల ఎకరాల్లో విత్తనోత్పత్తికి కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకున్నాయి.

సాగు పెరగాలి
ఆది నుంచి కోళ్ల దాణాలో 50% మేరకు మొక్క జొన్నలను వాడుతున్నారు. ఇథనాల్‌ కంపెనీల కారణంగా పౌల్ట్రీ, ఇతర పరిశ్రమలకు కొరత ఏర్పడింది. మార్కెట్‌లో 30% మాత్రమే మక్కల లభ్యత ఉండటంతో వాటి ధరలు భారీగా పెరిగాయి. దీంతో సాగును భారీఎత్తున పెంచాలని ఆహార, పౌల్ట్రీ పరిశ్రమల నుంచి డిమాండ్‌ వస్తోంది.