ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకీ మామిడి పండ్లను మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా భోసీ గ్రామానికి చెందిన సుమన్‌బాయి గైక్వాడ్‌ అనే మహిళా రైతు పండించారు. ఇటీవల నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో ఒక్కో మామిడి పండును ఆమె రూ. 10,000/- లకు అమ్మారు. సుమన్‌బాయి కుమారుడు నంద కిశోర్‌ గైక్వాడ్‌ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే ఈ మామిడిపండ్ల సాగు. యూపీఎస్సీ పరీక్షల కోసం పుణెలోని కోచింగ్‌ సెంటర్‌లో చేరిన ఆయన.. కరోనా కారణంగా అది మూతపడటంతో ఇంటికి తిరిగివచ్చారు. ఇంట్లోనే ఉండి పరీక్షలకు సిద్ధమవుతూ.. ఆన్‌లైన్‌లో జపనీస్‌ రకానికి చెందిన మియాజాకీ మామిడి పండ్ల గురించి తెలుసుకున్నారు. అనంతరం తల్లిని ఆ సాగువైపు ప్రోత్సహించారు. ఒక్కొక్క దానికి రూ.6,500/-లు చొప్పున చెల్లించి ఫిలిప్పీన్స్‌ నుంచి 10 మొక్కలను తెప్పించారు. రెండేళ్ల కిందట వాటిని నాటగా ఈ ఏడాది ఒక్కో చెట్టుకు 11 నుంచి 12 కాయలు వచ్చాయి. ఆ పండ్లను వ్యవసాయ ప్రదర్శనలో విక్రయించారు.