• చింతపల్లి పరిశోధన స్థానం ప్రయోగాత్మక సాగుతో గుర్తింపు
  • ఒకే మొక్కకు 330 కాయలు

రబీలో నీటి వసతి లేని ప్రాంతాల్లోనూ దేశవాళీ శనగ (కొమ్ముశనగ) మంచి దిగుబడి ఇస్తోందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సేద్య విభాగం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ బాలహుస్సేన్‌ రెడ్డి మంగళవారం తెలిపారు. ”రబీలో నీరులేక గిరిజన ప్రాంతాల్లో పొలాలను రైతులు ఖాళీగా వదిలేస్తారు. ఆ కాలంలో కేవలం పొగమంచుతో శనగ పండే అవకాశాలున్నట్లు గుర్తించాం. ప్రయోగాత్మకంగా పరిశోధన స్థానంలో, గూడెంకొత్తవీధి మండలం దామనాపల్లిలో కొందరు రైతుల పొలాల్లో దేశవాళీ (నంద్యాల బెంగాల్‌ గ్రామ్‌) విత్తనాలు వేసి, సేంద్రియంగా సాగు చేయించాం. సాధారణంగా ఒక మొక్క 100 నుంచి 120 కాయలు కాస్తుంది. తమ క్షేత్రంలో సాగుచేసిన మొక్క ఏకంగా 330 కాయలు కాసింది. తక్కువ పెట్టుబడి, నీటి వసతి అవసరం లేని పంటగా శనగను గుర్తించాం. రైతులూ సాగుచేసేలా ప్రోత్సహిస్తాం” అని బాలహుస్సేన్‌రెడ్డి తెలిపారు.