హరియాణాలోని బడియాల్‌ గ్రామానికి చెందిన వీరేంద్ర బజ్వాన్‌.. గనోడెర్మా పుట్టగొడుగులను శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. వీటి పెంపకంపై సోలన్‌లోని మష్రూమ్‌ రీసెర్చ్‌ డైరెక్టరేట్‌లో వీరేంద్ర శిక్షణ పొందారు. గనోడెర్మా పుట్ట గొడుగులకు ఉండే ఔషధ గుణాల వల్ల దీన్ని ‘మ్యాజికల్‌ మష్రూమ్‌’ అని పిలుస్తారు. ఈ పుట్టగొడుగు నుంచి తయారైన ఉత్పత్తులు షుగర్‌ నియంత్రణ, క్యాన్సర్‌, అల్సర్లు, చర్మ వ్యాధులను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. ‘వీఎండబ్ల్యూ న్యూట్రాస్యూటికల్స్‌’ అనే కంపెనీని స్థాపించిన వీరేంద్ర బజ్వాన్‌.. గనోడెర్మా, శిటాకే, కార్డి సెప్స్‌ వంటి హెర్బల్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తన ఉత్పత్తులను 28 దేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బజ్వాన్‌ తెలిపారు. కొన్నిదేశాలకు ఎగుమతి ప్రక్రియ ప్రారంభమైందని.. మరికొన్నింటిలో లైసెన్స్‌ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం గనోడెర్మా పౌడర్‌ను కిలో రూ.21,000లకు అమ్ముతున్నట్లు తెలిపారు. ఈ సాగులో మంచి ఫలితాలు సాధించిన వీరేంద్రను 2025 ఆగస్టు 21న హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ సత్కరించారు. హిస్సార్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ప్రగతిశీల రైతు అవార్డును పొందారు. అంతేకాదు పుట్టగొడుగుల ప్రచార కమిటీలో వీరేంద్రను సభ్యుడిగా నియమిస్తూ హరియాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి పెంపకంపై లక్ష మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ఆయనకు అప్పగించింది.