ముమ్మరంగా పొగాకు కొనుగోళ్లు
క్వింటా రూ.12 వేలకు తగ్గకుండా కొనాలని సీఎం ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా చొరవ తీసుకొని అధికారులు, కంపెనీల ప్రతినిధులకు ఆదేశాలివ్వడంతో రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హెచ్డీ బర్లే పొగాకు 75 మిలియన్ కిలోల దిగుబడి రాగా, ఇప్పటికే 21 మిలియన్ కిలోలు కొనుగోలు చేశారు. పొగాకు రైతుల సమస్యలపై ఈ నెల 16న సీఎం చంద్రబాబు.. అధికారులు, పలు పొగాకు కంపెనీల ప్రతినిధులతో సమీక్షించారు. రైతుల వద్ద 54 మిలియన్ కిలోల నిల్వలుండగా, 20 మిలియన్ కిలోలు కొనుగోలు చేస్తామని జీపీఐ, ఐటీసీ సంస్థలు తెలిపాయి. 30 మిలియన్ కిలోల మేర క్వింటాలుకు రూ.12 వేల ధర తగ్గకుండా వారంలో కొనుగోళ్లు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. దీనిపై ప్రతి రెండు రోజులకు తనకు నివేదిక ఇవ్వాలని సూచించడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రైతుల వద్ద ఉన్న నిల్వల వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకులు సర్వే చేసి, నమోదు చేసేందుకు వీలుగా ప్రభుత్వం యాప్ను రూపొందించింది. అమ్మకాలను సమీక్షించేందుకు పొగాకు బోర్డు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 0863-2358531 నంబరును అందుబాటులో ఉంచింది. ఈ చర్యలతో కొనుగోళ్లు వేగం అందుకున్నాయి.

