కోళ్ల పరిశ్రమను ఆదుకోండి.. వడ్డీ రాయితీలివ్వండి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పౌల్ట్రీ ఫెడరేషన్ వినతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. సమాఖ్య అధ్యకక్షుడు కె. సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి పడాల సుబ్బారెడ్డి, ఉపాధ్యకక్షుడు టి. కుటుంబరావు, సభ్యులు గంగాధర్రావు, సుబ్రమణ్యం తదితరులు మంగళవారం సచివాలయంలో సీఎంను కలిసి కోళ్ల పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందించారు. కోళ్ల దాణాకు ఉపయోగించే మొక్కజొన్న దిగుమతులపై దిగుమతి సుంకం పూర్తిగా మినహాయించాలని కోరారు. గుడ్డు ధరల సమస్య పరిష్కారానికి కోళ్ల రైతులు, వ్యాపారులు, మధ్యవర్తులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని.. కోళ్ల పరిశ్రమకు 2015-20 నాటి పాలసీని సమీక్షించి.. పునరుద్ధరించాలని వినతి పత్రంలో సూచించారు. 2018-19 నాటి వడ్డీ రాయితీ బకాయిలను చెల్లించాలని.. రాబోయే ఐదేళ్లకు 4.5శాతం చొప్పున వడ్డీ రాయితీ ఇవ్వాలని, కోళ్ల పరిశ్రమ తీసుకున్న రుణాల చెల్లింపులపై ఏడాదిపాటు మారటోరియం విధించాలని అభ్యర్థించారు. కోళ్ల పరిశ్రమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చంద్రబాబు తమకు హామీ ఇచ్చారని వారు వివరించారు.

