ఉద్యాన, పశువైద్యశాఖలూ పాల్గొనాలని మంత్రి ఆదేశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఉద్యాన, పశువైద్యశాఖలు, విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు పాల్గొనకపోవడంపై వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయా శాఖలు సైతం పాల్గొనాలని ఆయన ఆదేశించారు. రైతులకు పంటలు, వాటి అనుబంధ రంగాలపై అవగాహన కల్పించేందుకు వీలుగా ఇటీవల ప్రభుత్వం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం చేపట్టింది. దీనిలో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య శాఖల అధికారులు, సిబ్బంది, ఆయా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు పాల్గొనాలంది. వ్యవసాయశాఖ అధికారులు, విశ్వవిద్యాలయం, పరిశోధనఃనా కేంద్రాలు, కృషివిజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు, కళాశాలలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులు పాల్గొంటున్నారు. ఉద్యానవనాలు, పాడి, చేపల పెంపకం, పశువైద్య సమస్యలపైనా శాస్త్రవేత్తలను రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయాధికారులు ఈ అంశాన్ని మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆయా శాఖల అధికారులను, విశ్వవిద్యాలయాల అధికారులను ప్రశ్నించారు. తమకు శాస్త్రవేత్తలు తక్కువగా ఉన్నారని వర్సిటీలు చెప్పగా… ఎంతమంది ఉన్నా హాజరు కావాల్సిందేనని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది.