పెరటిలో పోషకాహార తోటలతో ఆరోగ్యం, ఆర్థిక పొదుపు – మహిళ సాధించిన విజయగాథ

మహిళా రైతు విజయ గాధ

వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రీమతి సి. విజయ కుమారి వైఎస్సార్ కడప జిల్లా, మైదుకూరు మండలం, పప్పనపల్లి వాసి. విజయ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం సామూహిక నిర్వహణ విభాగంలో మైదుకూరు మండలం పోషణ మరియు ఆరోగ్యం కార్యకర్తగా పనిచేస్తుంది. ఆమె గతంలో తన కుటుంబానికి అవసరమైన కూరగాయలను మార్కెట్ నుంచి కొనుగోలు చేసేది. పెరుగుతున్న కూరగాయల ధరలు, రసాయన అవశేషాలపై ఆందోళన, అలాగే కుటుంబ సభ్యులు తగినంత ఆకుకూరలు, కూరగాయలు తీసుకోకపోవడం వల్ల పోషకాహార లోపం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఆమె గమనించింది.

ఈ నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం (KVK), వొనిపెంట, ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటి పెరటిలో పోషకాహార తోటలు పెంపకం శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. శిక్షణలో సమతుల్య పోషకాహారం ప్రాముఖ్యత, ఇంటి పరిసరాల్లో శాస్త్రీయ పద్ధతిలో పోషకాహార తోటలు ఏర్పాటు, సీజన్కు అనుగుణంగా కూరగాయల ఎంపిక, వంటింటి వ్యర్థాలతో సేంద్రీయ ఎరువుల తయారీ, నీటి పొదుపు పద్ధతులు మరియు సహజ పురుగు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అంతేకాక కూరగాయలు, పండ్ల తోటల్లో వాడే వివిధ రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలు, వాటివల్ల పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి కలిగే నష్టాలను గూర్చి తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమం అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం (KVK), వొనిపెంట శాస్త్రవేత్తలు జాతీయ ఉద్యానవన పరిశోధన మరియు అభివృద్ధి ఫౌండేషన్ కూరగాయల విత్తనాల కిట్‌ను అందజేయటం జరిగింది. ఈ కిట్‌లో పాలకూర, మిరప, టమాటో, వంగ, బెండకాయ, నేతిబీర, సొరకాయ, ఉల్లి, అలసందలు, ముల్లంగి మరియు గోరు చిక్కుడు వంటి కూరగాయ విత్తనాలు ఉంటాయి

శిక్షణ ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి శ్రీమతి సి. విజయ కుమారి తన ఇంటి వెనుక ఖాళీ స్థలంలో టమాటా, బెండకాయ, వంకాయ, పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, కాకరకాయ, నేతిబీర, సొరకాయ, ఉల్లి, అలసందలు, ముల్లంగి, బీరకాయ తదితర కూరగాయలను సేంద్రీయ పద్ధతిలోఎటిఎం విధానంలో సాగు చేశారు. కొద్ది వారాల్లోనే కుటుంబ అవసరాలకు సరిపడా తాజా, పోషక విలువలు అధికంగా ఉన్న కూరగాయలు ఆమెకు అందుబాటులోకి వచ్చాయి.

దీని ఫలితంగా కుటుంబం మార్కెట్‌పై ఆధారపడటం గణనీయంగా తగ్గింది. కూరగాయల కొనుగోలు ఖర్చులో నెలకు సుమారు ₹1500–₹2,500 ల వరకు పొదుపు సాధించారు. కుటుంబ సభ్యుల ఆహారంలో ఆకుకూరలు, కూరగాయల వినియోగం పెరగడంతో వారి ఆరోగ్య పరిస్థితిలో సానుకూల మార్పులు కనిపించాయి. మిగులు ఉత్పత్తిని పొరుగువారికి విక్రయించడం ద్వారా ₹4,500 -5,000 లఅదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. అలాగే ఆమె తమ పెరటి తోటలో పండిన కాయగూరలను , ఆకుకూరలను దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో మరియు పాఠశాలలో పిల్లలు భోజనానికి అందించేది.

శ్రీమతి సి. విజయ కుమారి గారి న్యూట్రి గార్డెన్ విజయాన్ని చూసి గ్రామంలోని అనేక మంది తమ ఇళ్లలో కూడా పోషక తోటలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆ గ్రామంలో పోషకాహారం, సేంద్రీయ సాగు మరియు కుటుంబ ఆహార భద్రతపై అవగాహన కల్పించే ఆదర్శ మహిళగా ఆమె నిలిచారు.

విజయ అభిప్రాయం
కృషి విజ్ఞాన కేంద్రం అందించిన శిక్షణతో మా ఇంటి ఖాళీ స్థలం పోషకాహారాన్ని అందించే తోటగా మారింది. ఇప్పుడు మా కుటుంబానికి తాజా కూరగాయలు ఇంట్లోనే లభిస్తున్నాయి. డా॥బి. శ్రీ కాంతి శ్రీ, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త తనకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడం వల్లే నేను ఈ విజయం సాధించగలిగాను. ఇప్పుడు మా ఇంటికి కూరగాయల ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడింది. ప్రతి ఇంట్లో న్యూట్రి గార్డెన్ ఉంటే కుటుంబ ఆరోగ్యం, పోషకాహార భద్రత మరియు ఆర్థిక పొదుపు ఒకేసారి సాధ్యమవుతాయి.

సమాచారం కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 7032463875.

డా॥బి. శ్రీ కాంతి శ్రీ , డా ఎం. బాలకృష్ణ, డా ॥ఎన్ .శ్రీ విద్యారాణి, డా ॥టి. విజయ నిర్మల, డా ॥ఎస్ . ఫిరోజ్ హుస్సైన్, డా . బి. గోవిందరాజులు మరియు డా ॥ సి హెచ్ . రూత్, కృషి విజ్ఞాన కేంద్రం, ఒనిపెంట – డా॥వై. ఎస్. ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్న గూడెం. Ph: 9493993523

Read More

పంటకాలం పెరుగుదలకు ‘వండర్ ఆయిల్స్’

ప్రతి మొక్క దాని తరువాత తరం కోసం కావలసిన అన్ని పోషక పదార్థాలను గింజలలో దాచుకుంటుంది. ఆ గింజలో శక్తిని నూనెగా మార్చి అదే మొక్కకు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మెదక్ జిల్లా రైతు పొన్ను స్వామి చాలా ప్రయోగాలు చేశారు. తక్కువ ఖర్చుతో లభించే నూనెలను నీటిలో కరిగించి మొక్కలకు డ్రిప్ ద్వారా, పిచికారి ద్వారా అందించి ప్రత్తి, చెరకు, బొప్పాయి, అరటి, కూరగాయల పంటలలో అద్భుతమైన దిగుబడులు సాధించారు. ఉదాహరణకు ప్రత్తి పంటకు అర లీటరు ప్రత్తి నూనెలో 50 మి.లీ. ఎమల్షన్ కలిపి ఆ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి డ్రిప్ ద్వారా లేదా పిచికారి చేసి అందించారు. అపుడు నూనె నీటిలో కలిసిపోయి పాలలా తెల్లగా మారింది. దీనితోపాటు కానుగ నూనె, వేరుశనగ నూనె, ప్రొద్దు తిరుగుడు నూనె, వేప నూనె వంటి రకరకాల నూనెలను మార్చి మార్చి అందించడం వలన మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. ఇలా వారానికి ఒకసారి నూనెలను అందించడం వలన మొక్కలలో రోగ నిరోధకశక్తి పెరిగి చీడపీడలను తట్టుకుంటాయి. పంటకాలం పెరిగి రైతు అధిక దిగుబడులను పొందే అవకాశం కలుగుతుంది. అంటే 4 నెలలు దిగుబడి వచ్చే పంట 6 నెలల వరకు కూడా దిగుబడులనిస్తుంది. 

ఈ పద్ధతిని ఖమ్మం జిల్లా కోయచలకకు చెందిన రైతు రామారావు అనుసరించి తన కూరగాయల తోటలో రెట్టింపు దిగుబడులు పొందారు. రామారావు స్ఫూర్తితో సక్రూనాయక్, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ధర్మేందర్, చింతలలంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు వంటి రైతులు పుచ్చ, బంతి, బీర, బొప్పాయి పంటలలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

నూనెల మిశ్రమం : నూనెల మిశ్రమం తయారీకి ఎమల్సిఫయర్‌కు బదులు లీటరు నూనెను రెండు కోడిగుడ్ల సొన కలిపి మిక్సీలో వేసి 5 నుంచి 10 నిమిషాలు తిప్పాలి. దీంతో నూనె నీటిలో కరిగేవిధంగా తయారవుతుంది.

Read More

చేప వ్యర్థాలతో పోషక మిశ్రమం

వికె-నార్డెప్ స్థానికంగా లభించే వనరుల ద్వారా సేంద్రియ పద్ధతిలో పంటల పెరుగుదలకవసరమైన ముఖ్య పోషకాలన్నీ కలిగి ఉన్న పోషక మిశ్రమాన్ని చేప వ్యర్థాలనుపయోగించి చేసే కొత్త టెక్నాలజీని రూపొందించింది.

 తయారీ విధానం : దీని తయారీకి సుమారు 20 కి. చేపల వ్యర్థాలను సేకరించి 40 లీ. సామర్థ్యం ఉన్న ప్లాస్టిక్ క్యాన్‌లో నిల్వ ఉంచాలి. దీనికి 10 లీ. నీటిని, 20-30 మి.లీ. బొప్పాయి పాలను (పపైన్) కలపాలి. (ముదిరిన ఆకుపచ్ౘ్రంగు బొప్పాయి కాయపై బ్లేడుతో చిన్నగాట్లు చేసి పాలను సేకరించాలి).

చేప వ్యర్థాలను పపైన్‌తో బాగా కలిపి 5-8 గంటలుంచాలి. పాత్రను మూసి ఉంచి ప్రతి గంటలకు ఒకసారి కలియత్రిప్పాలి.

పులియ బెట్టడం
5-8 గంటల తర్వాత బెల్లం ద్రావణాన్ని (4 కి. బెల్లాన్ని 5 లీ. నీటిలో కలిపి) చేప వ్యర్థాలకు కలిపి బాగా కలియత్రిప్పాలి. ఈ మిశ్రమాన్ని 15-20 రోజులు బాగా పులియనివ్వాలి. ఈ సమయంలో చేప పొలుసులు, ఎముకలు బాగా క్షీణించి పోతాయి.
15-20 రోజులు పులిసిన తర్వాత పులిసిన పదార్థానికి 2 నుండి 5 రెట్లు నీరు కలిపి ద్రావణం తయారు చేయాలి. ఈ ద్రావణాన్ని వడపోసి మొక్కలపై పిచికారి చేయాలి. పూర్తిగా కరగని పదార్థమేదైనా ఉంటే దానిని భూమికి ఎరువుగా వేయాలి.
పంటపై పిచికారి చేయడానికి 250 నుండి 500 మి.లీ. ద్రావణాన్ని 10 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఈ ఫార్మ్యులేషన్‌ని అన్ని కూరగాయలు, పూల పంటల్లో ఉపయోగించవచ్చు. బెండ, తోటకూర, పాలకూర, వంగ, టమాట పంటలపై విస్తృత పరిశోధనలు జరిపి మంచి ఫలితాలను పొందారు.

రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం ’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల తయారీ, ప్రాముఖ్యత మరియు వినియోగం

ఉద్యానవనం (Horticulture) వ్యవసాయ రంగంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన విభాగం. కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మరియు సుగంధ మొక్కల సాగు ఉద్యాన పంటల పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం వినియోగదారులు ఆరోగ్యకరమైన, రసాయన అవశేషాలు లేని ఆహార ఉత్పత్తులను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సేంద్రియ ఉద్యానవనం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఉద్యాన పంటలు అధిక విలువ కలిగిన పంటలు కావడంతో వీటిలో నాణ్యత, రుచి, నిల్వ సామర్థ్యం మరియు మార్కెట్ విలువకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ద్వారా ఈ లక్ష్యాలను సాధించవచ్చు. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పంటల ఎదుగుదలను ప్రోత్సహించడం, దిగుబడిని పెంచడం మరియు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం వంటి అనేక ప్రయోజనాలను సేంద్రియ ఉత్పత్తులు అందిస్తాయి.

ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల అవసరం

ఉద్యాన పంటల సాగులో రసాయన ఎరువులు మరియు పురుగుమందుల అధిక వినియోగం వల్ల నేలలో సేంద్రియ పదార్థాల శాతం తగ్గిపోతుంది. ఫలితంగా నేల నిర్మాణం దెబ్బతిని, సూక్ష్మజీవుల కార్యకలాపాలు తగ్గి, మొక్కల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

సేంద్రియ ఉత్పత్తుల వినియోగం వల్ల:

  • నేల సారవంతత పెరుగుతుంది.
  • పండ్లు మరియు కూరగాయల నాణ్యత మెరుగుపడుతుంది.
  • నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
  • రసాయన అవశేషాలు తగ్గుతాయి.
  • ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధర లభిస్తుంది.
  1. జీవామృతం – ఉద్యాన పంటలకు జీవశక్తి
    జీవామృతం సహజ వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైన సేంద్రియ ద్రవ ఎరువు. ఇది కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులను కలిగి ఉండి నేల జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది.
    తయారీకి కావలసిన పదార్థాలు
  • దేశీయ ఆవు పేడ – 10 కిలోలు
  • ఆవు మూత్రం – 10 లీటర్లు
  • బెల్లం – 2 కిలోలు
  • శనగపిండి – 2 కిలోలు
  • పొలం మట్టి – 1 కిలో
  • నీరు – 200 లీటర్లు

ఉద్యాన పంటలలో ప్రయోజనాలు

  • టమోటా, వంకాయ, మిరప, బెండ వంటి కూరగాయలలో వేగవంతమైన పెరుగుదల.
  • మామిడి, జామ, బత్తాయి వంటి పండ్ల తోటలలో వేర్ల అభివృద్ధి.
  • పుష్ప పంటలలో అధిక పుష్పోత్పత్తి.
  • నేలలో పోషకాల లభ్యత పెరుగుదల.
  1. పంచగవ్య – సహజ వృద్ధి ప్రేరకం

పంచగవ్యలో మొక్కల పెరుగుదలకు అవసరమైన అనేక జీవక్రియాత్మక పదార్థాలు ఉంటాయి.
ఉద్యాన పంటలపై ప్రభావం
పుష్పించే శాతం పెరుగుతుంది.

  • పండ్ల పరిమాణం మరియు బరువు మెరుగుపడుతుంది.
  • పూల రంగు మరియు నాణ్యత పెరుగుతుంది.
  • కోత అనంతర నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది.
    ముఖ్యంగా మల్లె, చామంతి, గులాబీ వంటి పుష్ప పంటలలో పంచగవ్య వినియోగం మంచి ఫలితాలను ఇస్తుంది.
  1. వర్మికంపోస్ట్ – సేంద్రియ పోషకాల నిల్వ

వర్మికంపోస్ట్‌ను “బ్లాక్ గోల్డ్” అని కూడా పిలుస్తారు. ఇది మొక్కలకు అవసరమైన స్థూల మరియు సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది.
ఉద్యాన పంటలలో ప్రయోజనాలు

  • కూరగాయలలో అధిక దిగుబడి.
  • పండ్ల తోటలలో నేల ఆరోగ్యం మెరుగుదల.
  • పూల పంటలలో నాణ్యమైన పుష్పోత్పత్తి.
  • మొక్కల వేర్ల అభివృద్ధి.
  1. వర్మివాష్

వర్మివాష్‌లో వృద్ధి హార్మోన్లు, ఎంజైములు మరియు సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
వినియోగం
5–10 శాతం ద్రావణంగా ఆకులపై పిచికారీ.

  • నర్సరీ మొక్కల పెరుగుదలలో వినియోగం.
  • ఆకుల పచ్చదనం మరియు కిరణజన్య సంయోగక్రియ పెరుగుదల.
  1. బీజామృతం
    ఉద్యాన పంటల విత్తనాలు మరియు నారు శుద్ధి కోసం బీజామృతం ఉపయోగిస్తారు.
    ప్రయోజనాలు
  • విత్తన వ్యాధుల నివారణ.
  • మొలక శాతం పెరుగుదల.
  1. వేప ఆధారిత సేంద్రియ కీటకనాశకాలు
    ఉద్యాన పంటలలో వేపగింజల సారం (NSKE) విస్తృతంగా ఉపయోగించబడుతోంది.
    ప్రయోజనాలు
  • తెల్లదోమ, పేను, తామర పురుగుల నియంత్రణ.
  • పర్యావరణానికి హాని లేకపోవడం.
  • ప్రయోజనకర కీటకాలకు రక్షణ.
  1. అగ్నాస్త్రం
    అగ్నాస్త్రం అనేది ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల పురుగులను (ఆకుముడుచు పురుగు, కాండం తొలిచే పురుగు, మొదలైనవి) నివారించడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన జీవ కీటకనాశిని.
    పదార్థాలు:
    • నాటు ఆవు మూత్రం: 10 – 15 లీటర్లు
    • వేపాకు పేస్ట్: 5 కిలోలు
    • పచ్చిమిర్చి పేస్ట్: 500 గ్రాములు
    • వెల్లుల్లి పేస్ట్: 250 – 500 గ్రాములు
    • పొగాకు: 500 గ్రాములు లేదా 1 కిలో

తయారీ విధానం:

  1. ఒక మట్టి కుండలో ఆవు మూత్రం పోసి, పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ కలపాలి.
  2. ఈ మిశ్రమాన్ని 5 సార్లు బాగా మరిగించాలి (ఉడకబెట్టాలి).
  3. తర్వాత దీనిని 24 నుండి 48 గంటల పాటు పులియబెట్టాలి (ఫెర్మెంట్ చేయాలి).
  4. చివరిగా, ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడకట్టుకోవాలి.

ఉపయోగించేపద్ధతి:
ఒక లీటరు అగ్నాస్త్రం ద్రావణానికి 15 నుండి 20 లీటర్ల నీటిని కలిపి పంటలపై పిచికారీ చేసుకోవాలి.

  1. బ్రహ్మాస్త్రం.
    వ్యవసాయంలో పురుగులను నివారించడానికి ఉపయోగించే సేంద్రియ పురుగుమందు ‘బ్రహ్మాస్త్రం’.
    కావలసిన పదార్థాలు:
    • ఆవు మూత్రం: 20 లీటర్లు
    • ఆకులు (పేస్ట్): 2 కేజీలు (వేప, కానుగ, సీతాఫలం, బొప్పాయి, మరియు దానిమ్మ లేదా జామ ఆకులు)

తయారీ విధానం:

  1. ఒక పెద్ద ప్లాస్టిక్ లేదా మట్టి పాత్రలో 20 లీటర్ల ఆవు మూత్రాన్ని తీసుకోవాలి.
  2. పైన పేర్కొన్న ఆకులను మెత్తగా దంచి లేదా గ్రైండ్ చేసి ఈ మూత్రంలో కలపాలి.
  3. పాత్రను మూతతో గట్టిగా కప్పి, 24 నుండి 48 గంటల పాటు పులియనివ్వాలి.
  4. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ మిశ్రమాన్ని కర్రతో తిప్పాలి.
  5. 48 గంటల తర్వాత ఈ మిశ్రమాన్ని పలుచని గుడ్డతో వడకట్టుకోవాలి.

ఉపయోగించేపద్ధతి:
1 లీటర్ బ్రహ్మాస్త్ర ద్రావణానికి 10 లీటర్ల నీటిని కలిపి (1:10 నిష్పత్తిలో) పంటలపై పిచికారీ చేయాలి.
• ఇది లార్వాలు, గొంగళి పురుగులు మరియు రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. దీనిని 6 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు

  1. ఫిష్ అమైనో ఆసిడ్ : అనేది మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన సేంద్రీయ ద్రవ ఎరువు. దీనిని “మీనామృతం” అని కూడా పిలుస్తారు. ఇందులో నత్రజని (Nitrogen) మరియు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

కావలసిన పదార్థాలు
• చేపల వ్యర్థాలు : 1 కిలో (చేప తలలు, తోకలు, పేగులు)
• నల్ల బెల్లం : 1 కిలో (సమాన పద్ధతిలో 1:1 నిష్పత్తి)
• ప్లాస్టిక్ డబ్బా: గాలి చొరబడని మూత ఉన్నది

తయారీ విధానం

  1. చేపలను కోయడం: చేపల వ్యర్థాలను చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లాస్టిక్ డబ్బాలో వేయండి.
  2. బెల్లం కలపడం: బెల్లాన్ని పొడి చేసి, చేప ముక్కలతో బాగా కలపండి.
  3. మూత పెట్టడం: డబ్బా మూతను గాలి చొరబడకుండా గట్టిగా పెట్టండి.
  4. నిల్వ ఉంచడం: దీనిని 30 నుండి 40 రోజుల పాటు నీడలో ఉంచాలి.
  5. గ్యాస్ తీయడం: మొదటి 10 రోజులు రోజూ ఉదయం ఒకసారి మూత కొద్దిగా తీసి గ్యాస్ బయటకు పోయాక మళ్ళీ గట్టిగా పెట్టండి.
  6. వడకట్టడం: 40 రోజుల తర్వాత ముదురు గోధుమ రంగు ద్రవం తయారవుతుంది. దీనిని వడకట్టి గాజు లేదా ప్లాస్టిక్ సీసాలో నిల్వ చేసుకోండి.

ఉపయోగించేపద్ధతి:
స్ప్రే చేయడానికి: 1 లీటరు నీటికి 2 నుండి 3 ml ద్రావణం కలిపి మొక్కల ఆకులపై పిచికారీ చేయాలి.
• మొదళ్లలో పోయడానికి: 1 లీటరు నీటికి 5 ml కలిపి మొక్కల వేర్ల దగ్గర పోయవచ్చు.
• సమయం: ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే వాడాలి.

ఉపయోగాలు
• మొక్కలు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది.
• ఆకులు పచ్చగా, బలంగా మారుతాయి.
• పూత మరియు కాపు ఎక్కువగా వస్తుంది.
• నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది.

  1. మొక్కలు మరియు ఇంటి వ్యర్థాల నుండి సేంద్రీయ ఎరువు (Compost) తయారు చేయడం ద్వారా భూమి సారాన్ని అద్భుతంగా పెంచవచ్చు. ఇది మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది.

కావలసిన పదార్థాలు
• పచ్చి వ్యర్థాలు ( నత్రజని): 1 వంతు (పచ్చి ఆకులు, కూరగాయల తొక్కలు, పండ్ల వ్యర్థాలు, పశువుల పేడ).
• ఎండిన వ్యర్థాలు (కర్బనం): 2 నుండి 3 వంతులు (ఎండుటాకులు, వరి గడ్డి, పొట్టు, చెక్క పొట్టు, కట్ చేసిన పత్తి లేదా కంది కట్టెలు).
• త్వరగా కుళ్ళడానికి (Microbes): పశువుల పేడ నీళ్ళు (Cow dung slurry) లేదా పాత కంపోస్ట్ ఎరువు.
గుంత లేదా కుప్ప పద్ధతి

  1. స్థలాన్ని ఎంచుకోవడం: తోటలో నీడగా ఉండే, నీరు నిలవని ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోండి.
  2. మొదటి పొర (Base Layer): నేలపై 6 అంగుళాల మందంతో ఎండుటాకులు, చిన్న కొమ్మలు లేదా వరి గడ్డిని పరవండి. ఇది గాలి ప్రసరణకు సహాయపడుతుంది.
  3. రెండవ పొర (Green Layer): దీనిపై 6 అంగుళాల పచ్చి వ్యర్థాలు లేదా కూరగాయల తొక్కలను వేయండి.
  4. పేడ నీళ్ళు చల్లడం: దీనిపై పేడ నీళ్ళను చల్లి, కొద్దిగా పాత మట్టిని చల్లండి. ఇది కుళ్ళింపజేసే సూక్ష్మజీవులను పెంచుతుంది.
  5. పొరలు పునరావృతం చేయడం: డబ్బా లేదా కుప్ప 3 నుండి 4 అడుగుల ఎత్తు వచ్చే వరకు ఎండు వ్యర్థాలు, పచ్చి వ్యర్థాల పొరలను ఒకదానిపై ఒకటి మార్చి మార్చి వేయండి.
    • తేమ శాతం: కుప్పపై అప్పుడప్పుడు నీరు చల్లాలి. పిండిన స్పాంజ్ లాగా తేమ ఉండాలి, కానీ నీరు కారకూడదు.
    • కలపడం : ప్రతి 15 నుండి 20 రోజులకు ఒకసారి కుప్పను పారతో బాగా పైకి, కిందకి కలపాలి. దీనివల్ల వ్యర్థాలకు గాలి (ఆక్సిజన్) అంది త్వరగా కుళ్ళుతాయి.
    • వేడి: కుళ్ళే ప్రక్రియలో కుప్ప మధ్యలో వేడి పుడుతుంది. ఇది కలుపు మొక్కల విత్తనాలను, హానికరమైన బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది.

ఎరువు తయారీ సమయం
వాతావరణాన్ని బట్టి 2 నుండి 4 నెలల్లో నల్లటి, పొడి పొడిగా ఉండే వాసన లేని సేంద్రీయ ఎరువు తయారవుతుంది. దీనిని పంటలకు వాడుకోవచ్చు.
ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల పాత్ర

సేంద్రియ ఉత్పత్తులు కేవలం పోషకాలను అందించడమే కాకుండా మొత్తం పంట వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కూరగాయలలో నాణ్యత పెరగడం, పండ్లలో తీపి మరియు రుచి మెరుగుపడడం, పుష్ప పంటలలో ఎక్కువకాలం తాజాగా ఉండడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతం సేంద్రియ కూరగాయలు మరియు సేంద్రియ పండ్లు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. అందువల్ల ఉద్యాన రైతులు సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ద్వారా అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.

ముగింపు
ఉద్యాన పంటల స్థిరమైన అభివృద్ధికి సేంద్రియ ఉత్పత్తులు కీలకమైనవి. జీవామృతం, పంచగవ్య, వర్మికంపోస్ట్, వర్మివాష్ మరియు వేప ఆధారిత సేంద్రియ కీటకనాశకాలు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, నాణ్యమైన దిగుబడులను అందిస్తాయి. పెరుగుతున్న సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉద్యాన రైతులు సేంద్రియ పద్ధతులను విస్తృతంగా అవలంబించడం అవసరం. సేంద్రియ ఉద్యానవనం రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వినియోగదారులకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే మార్గంగా నిలుస్తుంది.

డాక్టర్.టి .తేజస్విని , డాక్టర్ . టీ .థామ్సన్ , డాక్టర్. ఎం.జి.బాల హుస్సేని
డాక్టర్ . వైస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం. Ph: 9494963291

Read More

కూరగాయల సాగులో కేరళ విధానం అమలు చేయాలి: కోదండరెడ్డి

కూరగాయల సాగు, మార్కెటింగ్‌లో కేరళ విధానం ఆదర్శంగా ఉందని, దానిని తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి సూచించారు. కూరగాయల సాగుపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ”రాష్ట్రంలో కూరగాయలు సాగు చేసే రైతులు అమ్ముకోడానికి ఇబ్బంది పడుతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో నిత్యం కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. ఇటీవల కేరళలో పర్యటించి అక్కడి విధానాన్ని అధ్యయనం చేశాం. ఆ మాదిరిగానే రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెరగాలి. మధ్య దళారీ వ్యవస్థను నివారించాలి. రాష్ట్ర వ్యవసాయ రంగంలో సంస్కరణలు రావాలి. దీనిపై నెలరోజుల్లో నిర్దిష్టమైన ఆలోచన చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం’ అని కోదండరెడ్డి పేర్కొన్నారు.

Read More

తెలంగాణ రాష్ట్రంలో రాయితీలతో ఉద్యాన పంటలకు ఊతం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాయి. మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌-ఆయిల్‌ పామ్‌, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన తదితర పథకాలను అమలు చేస్తూ రాయితీలను అందజేస్తున్నాయి.
సమీకృత ఉద్యాన అభివృద్ధి.. పథకం ద్వారా పండ్ల తోటలు, నీటి కుంటలు, కూరగాయల సాగును ప్రోత్సహిసున్నారు. రాయితీతో కూరగాయల నారును అందించడంతోపాటు, ప్రస్తుత సంవత్సరం డ్రాగన్‌ ఫ్రూట్‌, బొప్పాయి, మామిడి, జామ, కూరగాయలు, తదితర పంటల సాగుకు సైతం రాయితీని కల్పిస్తున్నారు.

ఆయిల్‌పామ్‌ సాగు
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది.ఈ సాగును పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతులకు బిందు, తుంపర సేద్యంపై రాయితీ ఇస్తున్నారు. ఎకరాకు రూ.4,200 ల చొప్పున నాలుగేళ్లపాటు రాయితీ అందుతుంది.

రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన
20 గుంటల విస్తీర్ణంలో పందిరి నిర్మాణానికి రూ.50 వేల సబ్సిడీ అందిస్తున్నారు. గరిష్టంగా 2.20 ఎకరాల వరకు రాయితీ అందుతుంది. సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా శాశ్వత పందిరి ఏర్పాటు చేసుకొని కూరగాయలు సాగు చేపట్టొచ్చు. రైతులకు అవగాహన కల్పిస్తూ వీటిపై మొగ్గు చూపేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

జాతీయ వెదురు పథకం
సాగుకు యోగ్యం కాని భూముల్లో, పొలం గట్లపైన, వెదురు మొక్కలు నాటే రైతులకు ప్రభుత్వం రెండేళ్ల వరకు నిర్వహణ ఖర్చు కింద మొదటి సంవత్సరం రూ. 75 రెండో సంవత్సరం రూ. 45 చొప్పున అందజేస్తారు.

బిందు సేద్యం
ఉద్యాన పంటలు సాగు చేయడానికి డ్రిప్‌, స్ప్రింకర్లను సబ్సిడీపై అందించనున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీతో పరికరాలను అందిస్తున్నారు. బీసీ రైతులకు 90 శాతం, అయిదెకరాల్లోపు ఉన్న ఓసీ రైతులకు 80 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. తుంపర సేద్యం పరికరాలకు అందరికీ 75 రాయితీని అందిస్తున్నారు.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, రాయితీలు పొందేందుకు రైతులు పట్టాదారు పాస్‌బుక్‌, బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, పాస్‌పోర్టు సైజు ఫొటోతో సంబంధిత ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు అందజేయాలి. గరిష్ఠంగా అయిదెకరాల భూమి కలిగిన రైతులు అర్హులు.
-కేఆర్‌ లత, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారిణి

Read More

తెలంగాణ సెక్రటేరియట్‌లో ఉద్యానశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల

  • జిల్లాల వారిగా ఉద్యానపంటల ప్రగతిని వివరించిన అధికారులు
  • రైతులకు బిల్లులు చెల్లింపులో ఆలస్యం కావద్దని ఆదేశించిన మంత్రి
  • హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలలో పెద్దఎత్తున కూరగాయల సాగును చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
  • డిసెంబర్‌ నెలాఖరు వరకు ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు
  • కమిషనరేట్‌ అధికారులు హైదరాబాద్‌ కే పరిమితం కాకుండా విస్తృతంగా పర్యటించాలని ఆదేశాలు జారీ చేశారు

తెలంగాణ రాష్ట్రంలో 12.96 లక్షలో ఎకరాలలో ఉద్యానపంటలు సాగులో ఉన్నాయని, 42.58 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి సాధించడం జరుగుతుందని ఉద్యానశాఖ డైరెక్టర్‌ మంత్రికి వివరించడం జరిగింది. ఉద్యానపంటలను ప్రొత్సహించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున తుంపర మరియు బిందు సేద్య పరికరాలపై రాయితీ ఇవ్వడం జరుగుతున్నదని, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీతో, చిన్న, సన్నకారు మరియు బిసి రైతులకు 90 శాతం రాయితీతో, ఇతరులకు 80 శాతం రాయితీతో బిందు సేద్య పరికరాలు మరియు అన్ని వర్గాల రైతులకు 70 శాతం తుంపర సేద్య పరికరాలను అందించడం జరుగుతున్నదని, కేంద్రం ఇచ్చే సబ్సీడి కన్నా అదనంగా 45 శాతం సబ్సిడీని ఎస్సీ, ఎస్టీ రైతులకు, 35 శాతం సబ్సిడీని చిన్న, సన్నకారు, బిసి రైతులు మరియు ఇతర రైతులకు ప్రభుత్వం అందచేయడం జరుగుతున్నదని మంత్రికి వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 29,821 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా 81,942 ఎకరాల విస్తీర్ణంలో బిందు మరియు తుంపర సేద్య పరికరాలను అందించడం జరిగిందని, 2025-26 సంవత్సరానికి 51,328 ఎకరాల విస్తీర్ణానికి పరిపాలన అనుమతులు తీసుకోవడం జరిగిందని, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 28,147 ఎకరాల విస్తీర్ణానికి బిందు మరియు తుంపర సేద్య పరికారాలు ఏర్పాటు చేయబడ్డాయి అని డైరెక్టర్‌ తెలిపారు. అదేవిధంగా 2024-25 సంవత్సరంలో 110.87 కోట్ల వ్యయంతో 12,054 మంది రైతులకు చెందిన 40,247 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టడం జరిగిందని, 2021-22 సంవత్సరంలో కొత్త జిల్లాలలో సాగులోకి తీసుకురాబడ్డ ఆయిల్‌ పామ్‌ తోటలు కాపుకు వచ్చాయని, ఆయా కంపెనీలు రైతుల వద్ద నుండి ఆయిల్‌ పామ్‌ గెలలను కొనుగోలు చేయడం జరుగుతున్నదని, ఆయిల్‌ పామ్‌ తోటల విస్తీర్ణానికి అనుగుణంగా ఆయిల్‌ పామ్‌ కర్మాగారాలను ఏర్పరచడం జరుగుతున్నదని తెలిపారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి 1,25,000 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ను లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, ఇప్పటికే 18 వేల మంది రైతులు 66 వేల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ నాటుటకు నమోదు చేసుకోవడం జరిగిందని, 26 వేల ఎకరాలకు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సంవత్సరంలో జూన్‌ నెల నాటికి 6750 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ ను పూర్తి చేసుకోవడం జరిగిందని డైరెక్టర్‌ మంత్రికి వివరించారు.
తుమ్మల మాట్లాడుతూ.. కూరగాయలు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నాయని, రాష్ట్రానికి అవసరమైన కూరగాయల ఉత్పత్తిని మన రాష్ట్రంలోనే పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని, అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్దం చేసి, డిప్యూటి డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులకు జిల్లాలు కేటాయించి, జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని, కూరగాయల సాగును పెంచేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాలు అయిన రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలలో పెద్ద ఎత్తున కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ద్వారా డిమాండుకు అనుకూలంగా కూరగాయల సాగును రైతులకు అందించాలని పేర్కొన్నారు. ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ పురోగతి చాలా మందకోడిగా నడుస్తున్నదని, వారంవారిగా లక్ష్యాన్ని నిర్ధేశించుకొని, జిల్లాలు, కంపెనీల వారిగా పురోగతిని సమీక్షించాలని డైరెక్టర్‌ని ఆదేశించారు. ప్రధాన కార్యాలయంలో ఉన్న జాయింట్‌ డైరెక్టర్లు ఒక్కొక్కరికి 5 జిల్లాలు కేటాయించాలని, వారంలో మూడు రోజులు వారు ఆయా జిల్లాలలో ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ పెంచడానికి, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయిల్‌ పామ్‌ నర్సరీలలో ఎట్టి పరిస్థితులలో కూడా కల్లింగ్‌ మొక్కలు ఉండకూడదని, ఆయిల్‌ పామ్‌ రైతులకు ఆరోగ్యకరమైన, మంచి మొక్కలను అందించాలని ఇదివరకే నాటిన ఆయిల్‌ పామ్‌ తోటల రైతులకు, పంట యాజమాన్యం విషయంలో ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి, ఆవగాహన కల్పించాలని తద్వారా అనుకున్న సమయానికి ఆయిల్‌ పామ్‌ గెలల దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని మంత్రిగారు తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్‌ నెలాఖరు కల్లా ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని, తదనుగుణంగా వారంవారిగా లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని, వ్యవసాయ మరియు ఉద్యానశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రిగారు ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్‌ రావు, ఉద్యానశాఖ సంచాలకులు శ్రీమతి యాస్మిన్‌ బాషా మరియు ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.

Read More