పెరటిలో పోషకాహార తోటలతో ఆరోగ్యం, ఆర్థిక పొదుపు – మహిళ సాధించిన విజయగాథ
మహిళా రైతు విజయ గాధ
వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రీమతి సి. విజయ కుమారి వైఎస్సార్ కడప జిల్లా, మైదుకూరు మండలం, పప్పనపల్లి వాసి. విజయ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం సామూహిక నిర్వహణ విభాగంలో మైదుకూరు మండలం పోషణ మరియు ఆరోగ్యం కార్యకర్తగా పనిచేస్తుంది. ఆమె గతంలో తన కుటుంబానికి అవసరమైన కూరగాయలను మార్కెట్ నుంచి కొనుగోలు చేసేది. పెరుగుతున్న కూరగాయల ధరలు, రసాయన అవశేషాలపై ఆందోళన, అలాగే కుటుంబ సభ్యులు తగినంత ఆకుకూరలు, కూరగాయలు తీసుకోకపోవడం వల్ల పోషకాహార లోపం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఆమె గమనించింది.

ఈ నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం (KVK), వొనిపెంట, ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటి పెరటిలో పోషకాహార తోటలు పెంపకం శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. శిక్షణలో సమతుల్య పోషకాహారం ప్రాముఖ్యత, ఇంటి పరిసరాల్లో శాస్త్రీయ పద్ధతిలో పోషకాహార తోటలు ఏర్పాటు, సీజన్కు అనుగుణంగా కూరగాయల ఎంపిక, వంటింటి వ్యర్థాలతో సేంద్రీయ ఎరువుల తయారీ, నీటి పొదుపు పద్ధతులు మరియు సహజ పురుగు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అంతేకాక కూరగాయలు, పండ్ల తోటల్లో వాడే వివిధ రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలు, వాటివల్ల పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి కలిగే నష్టాలను గూర్చి తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమం అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం (KVK), వొనిపెంట శాస్త్రవేత్తలు జాతీయ ఉద్యానవన పరిశోధన మరియు అభివృద్ధి ఫౌండేషన్ కూరగాయల విత్తనాల కిట్ను అందజేయటం జరిగింది. ఈ కిట్లో పాలకూర, మిరప, టమాటో, వంగ, బెండకాయ, నేతిబీర, సొరకాయ, ఉల్లి, అలసందలు, ముల్లంగి మరియు గోరు చిక్కుడు వంటి కూరగాయ విత్తనాలు ఉంటాయి

శిక్షణ ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి శ్రీమతి సి. విజయ కుమారి తన ఇంటి వెనుక ఖాళీ స్థలంలో టమాటా, బెండకాయ, వంకాయ, పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, కాకరకాయ, నేతిబీర, సొరకాయ, ఉల్లి, అలసందలు, ముల్లంగి, బీరకాయ తదితర కూరగాయలను సేంద్రీయ పద్ధతిలోఎటిఎం విధానంలో సాగు చేశారు. కొద్ది వారాల్లోనే కుటుంబ అవసరాలకు సరిపడా తాజా, పోషక విలువలు అధికంగా ఉన్న కూరగాయలు ఆమెకు అందుబాటులోకి వచ్చాయి.

దీని ఫలితంగా కుటుంబం మార్కెట్పై ఆధారపడటం గణనీయంగా తగ్గింది. కూరగాయల కొనుగోలు ఖర్చులో నెలకు సుమారు ₹1500–₹2,500 ల వరకు పొదుపు సాధించారు. కుటుంబ సభ్యుల ఆహారంలో ఆకుకూరలు, కూరగాయల వినియోగం పెరగడంతో వారి ఆరోగ్య పరిస్థితిలో సానుకూల మార్పులు కనిపించాయి. మిగులు ఉత్పత్తిని పొరుగువారికి విక్రయించడం ద్వారా ₹4,500 -5,000 లఅదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. అలాగే ఆమె తమ పెరటి తోటలో పండిన కాయగూరలను , ఆకుకూరలను దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో మరియు పాఠశాలలో పిల్లలు భోజనానికి అందించేది.

శ్రీమతి సి. విజయ కుమారి గారి న్యూట్రి గార్డెన్ విజయాన్ని చూసి గ్రామంలోని అనేక మంది తమ ఇళ్లలో కూడా పోషక తోటలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆ గ్రామంలో పోషకాహారం, సేంద్రీయ సాగు మరియు కుటుంబ ఆహార భద్రతపై అవగాహన కల్పించే ఆదర్శ మహిళగా ఆమె నిలిచారు.
విజయ అభిప్రాయం
కృషి విజ్ఞాన కేంద్రం అందించిన శిక్షణతో మా ఇంటి ఖాళీ స్థలం పోషకాహారాన్ని అందించే తోటగా మారింది. ఇప్పుడు మా కుటుంబానికి తాజా కూరగాయలు ఇంట్లోనే లభిస్తున్నాయి. డా॥బి. శ్రీ కాంతి శ్రీ, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త తనకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడం వల్లే నేను ఈ విజయం సాధించగలిగాను. ఇప్పుడు మా ఇంటికి కూరగాయల ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడింది. ప్రతి ఇంట్లో న్యూట్రి గార్డెన్ ఉంటే కుటుంబ ఆరోగ్యం, పోషకాహార భద్రత మరియు ఆర్థిక పొదుపు ఒకేసారి సాధ్యమవుతాయి.
సమాచారం కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 7032463875.
డా॥బి. శ్రీ కాంతి శ్రీ , డా ఎం. బాలకృష్ణ, డా ॥ఎన్ .శ్రీ విద్యారాణి, డా ॥టి. విజయ నిర్మల, డా ॥ఎస్ . ఫిరోజ్ హుస్సైన్, డా . బి. గోవిందరాజులు మరియు డా ॥ సి హెచ్ . రూత్, కృషి విజ్ఞాన కేంద్రం, ఒనిపెంట – డా॥వై. ఎస్. ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్న గూడెం. Ph: 9493993523

