సీఐఐ వ్యవసాయ సదస్సులో ఎన్‌ఆర్‌ఎస్‌ఏ డైరెక్టర్‌ వేమూరి చౌదరి

డిజిటల్‌ సాంకేతికత, కృత్రిమ మేధల సమ్మిళితంగా వ్యవసాయ రంగంలో 4.0 దశ ప్రారంభం కావాల్సిన అవసరం ఉందని ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఎఆర్‌ఎస్‌ఏ) అగ్రి సైన్సెస్‌ అధ్యయనాల విభాగం డైరెక్టర్‌ వేమూరి చౌదరి అభిప్రాయపడ్డారు. అధునాతన విధానాలతో భవిష్యత్తులో దేశంలో సేద్యం ఉజ్వలంగా మారుతుందని చెప్పారు. ‘డిజిటల్‌ వ్యవసాయంతో ఉత్పాదకత పెంపు, స్థిరత్వం’ అనే అంశంపై భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ”డిజిటల్‌ సాంకేతికత పంటల సాగు ఖర్చును తగ్గించడంతోపాటు దిగుబడులను పెంచడానికి ఇది దోహదపడుతుంది. ఉపగ్రహాల ద్వారా పంటల పర్యవేక్షణ, దిగుబడి అంచనాలను ముందే వెల్లడిస్తూ రైతులకు లాభం చేకూరుస్తుంది” అని అన్నారు. కొండాలక్ష్మణ్‌ ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి మాట్లాడుతూ.. వర్సిటీలు, పరిశోధన సంస్థల్లో భారీ ఎత్తున పరిశోధనలు, ఆవిష్కరణలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అంకురాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అగ్రిహబ్‌ సీఈవో విజయ్‌ ఆకాంక్షించారు. సీఐఐ తెలంగాణ వ్యవసాయ, ఆహార శుద్ధి విభాగం సలహాదారు ప్రవీణ్‌ రావు, సీఐఐ తెలంగాణ విభాగం ఛైర్మన్‌ ఆర్‌ఎస్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యకక్షుడు ఎం. గౌతంరెడ్డి, సదరన్‌ రీజియన్‌ మాజీ ఛైర్మన్‌ అనిల్‌ కుమార్‌ తదితరులు ప్రసంగించారు. వ్యవసాయంలో సుస్థిరత సాధించే, ప్రపంచంతో పోటీ పడే వ్యూహాలను అన్వేషించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సదస్సులో నిపుణులు సుబ్బారెడ్డి, ఆదర్శ్‌ నూరి, ప్రేమకుమార్‌ అమిత్‌ వాత్సాయన్‌, ఎస్‌ బీ ఐ, నాబార్డు అధికారులు, కంపెనీల ప్రతినిధులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు పాల్గొన్నారు.