వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయం

భారత్‌, శ్రీలంక మధ్య ఒప్పందం

వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయ విధానాల అమలుపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార పథకం (యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) ద్వారా భారతదేశం, శ్రీలంక మధ్య ఒప్పందం కుదిరింది. మంగళవారం అమరావతి సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ భారతదేశ ప్రతినిధి, సంచాలకులు ఎలిజబెత్‌ ఫౌర్‌ పాల్గొని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడులో ఐదేళ్లపాటు దీన్ని అమలు చేస్తారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌ జిల్లాలో వ్యవసాయ శాఖ, ప్రపంచ ఆహార పథకం ద్వారా రైతుసాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతారు. వాతావరణ మార్పులు, ప్రతికూల ప్రభావాల నుంచి సన్న, చిన్నకారు, మహిళా రైతుల జీవనోపాధిని సురక్షితం చేయడానికి ఈ పథకం దోహదపడుతుందని రాజశేఖర్‌ తెలిపారు.

Read More

అర్బన్‌ అగ్రికల్చర్‌ సుస్థిర అభివృద్ధికి దోహదం

ఈ నెల 22, 23 తేదీల్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కీలక శిఖరాగ్ర సభ ‘ఫూచర్‌ 2024’ జరగనుంది. ఈ నేపథ్యంలో అర్బన్‌ అగ్రికల్చర్‌ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ గ్రోనింగెన్‌ (నెదర్లాండ్స్‌)కు చెందిన డాక్టర్‌ ప్రజల్‌ ప్రధాన్‌ సారథ్యంలోని పరిశోధకుల బృందం ఒక అధ్యయనం నిర్వహించింది. నగరాలు, నగర పరిసర ప్రాంతాల్లో ఇళ్ళపైన, ఖాళీ స్థలాలలో చేపట్టే వ్యవసాయ కార్యకలాపాలనే అర్బన్‌ అగ్రికల్చర్‌గా చెప్పవచ్చు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఇంటి పంటలు, మిద్దె తోటలు, పెరటి తోటలు, పశుపోషణ, పాడి పరిశ్రమ, కోళ్ళు, చేపల పెంపకం.. వంటి కార్యకలాపాలన్నీ ఈ అర్బన్‌ అగ్రికల్చర్‌ కోవలోకే వస్తాయి. ‘అర్బన్‌ అగ్రికల్చర్‌’ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. కాని ప్రతికూల ప్రభావాన్ని బాగా తగ్గించే అర్బన్‌ అగ్రికల్చర్‌ పద్ధతులను పాటించగలిగినప్పుడే దాని ప్రయోజనాలు ఒనగూడతాయని డాక్టర్‌ ప్రజల్‌ ప్రధాన్‌ స్పష్టం చేశారు. అర్బన్‌ అగ్రికల్చర్‌ వల్ల ఆహారం, విద్య, సాంఘిక సదుపాయాలను కల్పించడంతో పాటు జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు సుస్థిరత ఎలా ఎలా చేకూరుతుందో శాస్త్రబద్ధంగా ఈ అధ్యయనం రుజువులు చూపించింది అని డాక్టర్‌ ప్రధాన్‌ వివరించారు.

Read More