రైతు ఆదాయ పెంపు, విలువ జోడింపు లక్ష్యంగా వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పులు చేపడుతున్నట్లు, వచ్చే మూడేళ్లలో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని అదనంగా ఉద్యాన పంటల సాగులోకి తీసుకురానున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వివరించారు. మంగళగిరిలోని వ్యవసాయశాఖ డైరెక్టరేట్‌లో బుధవారం ‘కృషి రోడ్ మ్యాప్’ పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ అగర్వాల్, ఐకార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఉద్యాన) డాక్టర్ సంజయ్ కుమార్ సింగ్, వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సమూన్, పలువురు కేంద్ర, రాష్ట్ర అధికారులు దీనికి హాజరయ్యారు. స్థూల విలువ జోడింపులో 15శాతం వృద్ధి సాధన లక్ష్యంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్ని రాజశేఖర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్ర అధికారులకు వివరించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా కృషి రోడ్ మ్యాప్‌ను రూపొందించామన్నారు. ఏపీకి కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం అందుతుందని.. విలువ ఆధారిత పంటల సాగుతోపాటు కేంద్ర, రాష్ట్రాల సమన్వయం ఎంతో కీలకమని సంజయ్‌కుమార్ అగర్వాల్ ఈ సందర్భంగా చెప్పారు.