అధిక దిగుబడి, గింజ నాణ్యతకు సప్తధాన్యాంకుర ద్రావణం

సప్తధాన్యాలను పాత్రలో వేసి నానిన తర్వాత మొలక కట్టాలి (విడివిడిగా).

  1. 100 గ్రా. పెసలు (మొలకలు)
  2. 100 గ్రా. మినుములు (మొలకలు)
  3. 100 గ్రా. అలసందలు (మొలకలు)
  4. 100 గ్రా. శనగలు (మొలకలు)
  5. 100 గ్రా. నువ్వులు (మొలకలు)
  6. 100 గ్రా. ఉలవలు (మొలకలు)
  7. 100 గ్రా. గోధుమలు (మొలకలు)

తడిగుడ్డతో వేలాడకట్టి మొలక వచ్చాక అన్ని కలిపి రుబ్బి ఒక లీ. నీరు కలపాలి. 10 లీ. ఆవు మూత్రం కలపాలి. కర్రతో బాగా కలియ త్రిప్పాలి. 2 గంటలు అలాగే ఉంచితే ఘనపదార్థం అడుగుకి చేరుతుంది. ఆ కషాయం వడపోసి మొక్కలపై పిచికారి చేయాలి. ఇది 48 గంటలు నిలువ ఉంటుంది. పైరు పాలు పోసుకునేటప్పుడు అన్ని పంటలకు పిచికారి చేస్తే దిగుబడి, గింజ నాణ్యత పెరుగుతుంది.

Read More

దశపత్ర కషాయం తయారీ ఎలా?

కావలసిన ఆకులు, పదార్థాలు: పిచ్చి తులసి - 250 గ్రా., తులసి - 250 గ్రా., పాలకొడిశ - 250గ్రా., తుత్తురుబెండ - 250 గ్రా., పొగాకు- 250 గ్రా., కాగితంపూల ఆకులు - 250 గ్రా., వేపాకులు - 250 గ్రా. టేకుఆకులు - 250 గ్రా., కలబంద - 250 గ్రా., బొప్పాయి ఆకులు - 250 గ్రా.

పైన సూచించిన ఆకులను మెత్తగా నూరి ముద్ద చేయాలి. దీనిని ఒక పెద్ద కుండలోగానీ లేదా ప్లాస్టిక్ డ్రమ్ములో గానీ వేసి దానికి 5 లీ. ఆవుమూత్రాన్ని, 5 లీ. నీరు కలపాలి. ఈ ద్రావణం ఉంచిన కుండపై మూతపెట్టి 10 రోజుల పాటు ప్రతిరోజు ద్రావణాన్ని సవ్య, అపసవ్య దిశలలో బాగా కర్రతో కలుపుతూ ఉండాలి. తరువాత ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడపోయాలి. ఈ ద్రావణానికి 150 లీ. నీరు కలిపి ఒక ఎకరా పొలంలో సాయంత్రం వేళ పంటపై పిచికారీ చేయాలి.
Read More

భూమిలో సేంద్రియ కర్బనం పెంపుకు ‘రామబాణం’

విపరీతమైన రపాయనాల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం విపరీతంగా తగ్గిపోయింది. పత్తిపాటి రామయ్య బెంగుళూరు వైదిక విజ్ఞాన వర్సిటీలో పి.హెచ్.డి. చేసి “రామబాణం” అనే వ్యాసాన్ని ప్రచురించారు. అది 40 రోజుల ప్రోగ్రాం. చిత్తూరు జిల్లా రైతు మునిరత్నం నాయుడు రామబాణాన్ని తయారు చేసి తన భూమిలో వేసిన తర్వాత 0.5 ఉండే సేంద్రియ కర్బనం 0.75 కి పెరిగింది.

తయారు చేసే విధానం

  • మొదటి రోజు రెండున్నర కిలోల అల్లం, రెండున్నర లీటర్ల నీటితో కలిపి బాగా రుబ్బి ఒక కుండలో పోయాలి. పోసిన తరువాత గుడ్డతో కుండని కట్టాలి. కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి.
  • ఆరవ రోజు ఉదయం 4 కి. ఆవుపేడ, 4 లీ. నీటితో కలిపి కుండకి గుడ్డకట్టి గుంతలో పెట్టాలి.
  • మొదటి రోజు పూడ్చిన అల్లం ద్రావణం కుండను 6వ రోజు సాయంత్రం 4 గంటలకు గుంతనుండి బయటకు తీసి అల్లం ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 11వ రోజు సాయంత్రం 6వ రోజు గుంతలో ఉంచిన ఆవుపేడ ద్రావణాన్ని బయటకు తీసి 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 16వ రోజు 8 కి. బెల్లం 8 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి. అదే రోజు 3 లీ. ఆవుమూత్రాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 21వ రోజు 21/4 కి. ముడి ఇంగువ 21/4 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి. 16వ రోజు గుంతలో పెట్టిన బెల్లం ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 26 వ రోజు 4 కి. శనగపిండి 4 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పాతిపెట్టి మట్టి కప్పాలి. 21వ రోజు గుంతలో పెట్టిన ఇంగువ ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 31వ రోజు ఒకటిన్నర కిలోల ఆవుపెరుగు ఒకటిన్నర లీటర్ల నీటిలో కలిపి కుండను గుంతలో పాతి పెట్టి మట్టి కప్పాలి. 26వ రోజు పాతిపెట్టిన శనగ పిండిద్రావణాన్ని 200 లీ. నీటితో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 36వ రోజున 31వ రోజున కుండలో ఉంచిన ఆవు పెరుగు ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • అప్పటికి రామ బాణం ప్రయోగం పూర్తవుతుంది. తరువాత పొలాన్ని నాగలితో దున్నుకుని పైరు పెట్టుకుంటే సేంద్రియ కర్బనం 0.5 నుండి 0.75కి పెరిగి ఉంటుంది.
Read More

మొక్కకు పోషకాలనందించే సస్యామృతం

వివిధ రకాల ఔషధ మొక్కలు, ఆవు పేడ ఆవు మూత్రంలో పులియబెట్టడం ద్వారా దీనిని తయారు చేసుకోవచ్చు.

ప్రయోజనాలు : ఇది మొక్కకు పోషకాలను అందించడమే కాకుండా కీటకాలు, తెగుళ్ళను నివారిస్తుంది.

 తయారీకి కావలసిన పదార్థాలు : ఆవు పేడ - 30-40 కి.; ఆవు మూత్రం - 5 లీ.; పాలుకారే మొక్కల (పాలకొడిశ, జిల్లేడు, జట్రోఫా, బొప్పాయి మొదలైనవి) ఆకులు - 5 కి.; ఘాటైన వాసనగల మొక్కల (వయ్యారిభామ, అత్తాకోడలు, తంగేడు తదితరాలు) ఆకులు - 5 కి.; నూనె గింజల చెక్క (వేరుశనగ, ఆముదం, కానుగ, నువ్వులు, వేప) చెక్కలో ఏదైనా - 2 కి.; బెల్లం - 1కి.; నువ్వులు, కంది లేదా పొగాకు కట్టెలు కాల్చిన  బొగ్గు లేదా పిడకబూడిద; నీరు - 100 లీ.; పై పదార్థాలన్నీ పట్టే ప్లాస్టిక్ డ్రమ్ము లేదా తొట్టి. 

తయారీ విధానం :

  • ముందుగా సేకరించిన ఆకులను తరిగి పెట్టుకోవాలి.
  • వీటిని ఆవుపేడ, మూత్రాలతో కలిపి డ్రమ్ములో వేసుకోవాలి.
  • దీనికి నూనె చెక్క బూడిద, బెల్లం కలపాలి.
  • డ్రమ్ములో వేసిన ఈ పదార్థాలను రోజు కలుపుతూ ఉండాలి.
  • తొట్టి లేదా డ్రమ్ము పై గోనె పట్టా కప్పి వుంచాలి.
  • వారం రోజుల్లో పూర్తిగా పులిసిపోయిన తర్వాత తయారైన ద్రావణాన్ని వడపోయాలి. ఆకులు, ఇతర పదార్థాల పిప్పి ఏదైనా మిగిలి వుంటే మొక్కలకు మల్చింగ్గా ఉపయోగించాలి.
  • తయారైన ద్రావణాన్ని ఎకరాకు 200 లీటర్లు డ్రిప్పు ద్వారా లేదా కాలువ ద్వారా పారించాలి.
  • మొక్కల పూత, కాత, గింజకట్టే దశల్లో 5 శాతం ద్రావణాన్ని పిచికారి చేయాలి.
Read More