లాభదాయక పంట ఆయిల్పామ్
వరి, పత్తి రైతులతో పోలిస్తే ఆయిల్ పామ్ రైతులు ఎక్కువగా లబ్ది పొందుతున్నారని, దేశంలో ఇతర అన్ని పంటల కంటే ఆయిల్ పామ్ అత్యంత లాభదాయక పంట అని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అధ్యయనంలో వెల్లడయింది. దేశీయ అవసరాలకు వినియోగించే నూనెల్లో పామాయిల్ దిగుమతులు అత్యధికంగా 21 శాతంగా ఉన్నాయని, దాన్ని తగ్గించే దిశగా సాగు మరింత పెరగాలని, 2047 నాటికి 50% వరకు స్వయం సమృద్ధి సాధించాలని నిర్దేశించింది. దేశవ్యాప్తంగా ఆయిల్పామ్ సాగు, వినియోగం, ఇతర ప్రయోజనాలపై భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) నేతృత్వంలో కేంద్రం అధ్యయనం నిర్వహించి, ఆ నివేదిక-2025 ను తాజాగా విడుదల చేసింది. ముఖ్యాంశాలిలా ఉన్నాయి.
దేశంలో వంట నూనెల వార్షిక తలసరి వినియోగం 19.7 కిలోలుగా ఉంది. వినియోగంలో 16.9 మిలియన్ టన్నులు భారత్ దిగుమతి చేసు కుంటోంది. అందులో 56% పామాయిలే. ఇది ప్రపంచ పామాయిల్ దిగు మతులలో 21 శాతం. వినియోగం ఇదే స్థాయిలో ఉంటే 2047 నాటికి డిమాండ్ 66.8 మిలియన్ టన్నులకు చేరుతుంది.
లాభం-ఖర్చు నిష్పత్తి పామాయిల్ పంటకు అధికంగా ఉంది. ఆయిల్పామ్కు పెట్టిన రూ. 1 ఖర్చుకు రూ.1.49 లాభం వస్తోంది. వరిలో అయితే రూ.1 ఖర్చుకు.. లాభం రూ.1.03, పత్తిలో రూ.1 ఖర్చుకు లాభం 1.13 శాతంగా ఉంది.
అభివృద్ధికి సూచనలు
ఆయిల్పామ్ దిగుబడి హెక్టారుకు 2.4 మెట్రిక్ టన్నులుగా ఉంది. దాన్ని 4-5 మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా ప్రణాళిక అవసరం.
దేశంలో ప్రస్తుతం వరి, పత్తి తదితర పంటలు సాగయ్యే 1.6 కోట్ల ఎకరాలు ఆయిల్పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయి.
నర్సరీలు, శుద్ధి సామర్థ్యాలు పెంచేదిశగా పెట్టుబడులను ప్రోత్సహించాలి.
రైతులకు మార్కెటింగ్ వనరులను అందుబాటులోకి తేవాలి. చిన్న రైతులకు తేలికగా రుణ లభ్యత ఉండేలా చూడాలి.



