వ్యవసాయ పరిశోధనలు, ఆధునిక సాంకేతికతతో అన్నదాతలకు శారీరక శ్రమతో పాటు సాగు వ్యయం తగ్గుతుందని, ఆదాయం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్‌), కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయం సంయుక్తంగా గ్రామీణ సాంకేతికతపై నిర్వహించిన జాతీయ సదస్సులో శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు, ఆవిష్కర్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయం శాస్త్రవేత్త రాకేశ్‌ కౌర్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం విస్తరణ లక్ష్యంగా పరిశోధనలు జరగాలన్నారు. వ్యవసాయ సాంకేతికత, యంత్రాలు, పరికరాలు, మత్స్య, పశుసం వర్ధక రంగాల్లో ఆవిష్కరణలు విస్తరించాలని, గ్రామీణ సాంకేతికతకు పెద్దపీట వేయాలన్నారు. వ్యవసాయ అంకురాలను ప్రోత్సహించాలన్నారు. నార్మ్‌ డైరెక్టర్‌ గోపాల్‌ లాల్‌, ఎ- ఐడియా సీఈవో సెంథిల్‌ వినాయగం తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆధునిక యంత్ర పరికరాలను ప్రదర్శించారు.