ఆధునిక వ్యవసాయానికి మొబైల్ యాప్‌లు – రైతులకు డిజిటల్ మార్గదర్శి

“వ్యవసాయమే భారతదేశానికి వెన్నెముక” అనే మాట నేటికీ సత్యమే. అయితే నేటి రైతు వ్యవసాయం చేయడం అంత సులభం కాదు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, కొత్తరకం పురుగులు–తెగుళ్ల విజృంభణ, నేల సారం తగ్గుదల, పోషక లోపాలు, నీటి కొరత వంటి ఎన్నో సమస్యలు పంట దిగుబడిని, నాణ్యతను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన సమయంలో సరైన సమాచారం రైతుకు అందడం అత్యంత అవసరం. డిజిటల్ సాంకేతికత విస్తరించిన ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ రైతుకు మరో వ్యవసాయ పనిముట్టుగా మారింది. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా ఇప్పుడు రైతు తన పొలానికి సంబంధించిన అనేక విషయాలను క్షణాల్లో తెలుసుకునే అవకాశం కలిగింది. పురుగులు, తెగుళ్లను గుర్తించడం నుంచి వాతావరణ సూచనలు తెలుసుకోవడం వరకు, పంటల సాగు సలహాలు పొందడం నుంచి ఎరువులు, మందుల వినియోగంపై సూచనలు తెలుసుకోవడం వరకు అనేక సేవలు మొబైల్ యాప్‌ల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు మరియు వ్యవసాయ నిపుణుల నుంచి శాస్త్రీయ సలహాలను కూడా నేరుగా రైతుల చేతికి చేరవేస్తున్నాయి. దీనివల్ల రైతులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని నష్టాలను తగ్గించుకోవడంతో పాటు దిగుబడిని పెంచుకునే అవకాశం పొందుతున్నారు.

రైతులకు ఈ సేవలను మరింత చేరువ చేయడానికి భారత ప్రభుత్వంతో పాటు పలు వ్యవసాయ పరిశోధనా సంస్థలు అనేక మొబైల్ అప్లికేషన్లను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటిని గూగుల్ ప్లే స్టోర్ లేదా సంబంధిత అధికారిక వెబ్‌సైట్ల నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించవచ్చు. ఈ యాప్‌లు పరిశోధనలో రూపొందిన శాస్త్రీయ సాంకేతికతను నేరుగా రైతు పొలం వరకు తీసుకెళ్లే వారధిగా పనిచేస్తున్నాయి.

  1. Plantix (ప్లాంటిక్స్)
    ప్రపంచవ్యాప్తంగా రైతులు ఎక్కువగా ఉపయోగిస్తున్న వ్యవసాయ మొబైల్ అప్లికేషన్లలో ప్లాంటిక్స్ (Plantix) ఒకటి. రైతులు దీనిని “పంటల డాక్టర్” అని కూడా పిలుస్తుంటారు. పంటలో కనిపించే సమస్యలను వేగంగా గుర్తించి శాస్త్రీయ పరిష్కారాలను సూచించడం ఈ యాప్ ప్రత్యేకత. రైతులు పంట ఆకులు, కాండం, కాయలు లేదా ఇతర భాగాలపై కనిపించే లక్షణాలను మొబైల్‌తో ఫోటో తీసి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే, కేవలం కొన్ని సెకన్లలోనే సమస్యను విశ్లేషించి అది పురుగు ఉధృతా, తెగులా లేదా పోషక లోపమా అనే విషయాన్ని గుర్తించి తెలియజేస్తుంది. అంతేకాకుండా సమస్యకు కారణాలు, నివారణ చర్యలు, సిఫారసు చేసిన పురుగుమందులు లేదా శిలీంద్రనాశకాలు, పోషక నిర్వహణ పద్ధతులను కూడా సూచిస్తుంది.

ఈ యాప్‌లో 700 కంటే ఎక్కువ పంటల పురుగులు, తెగుళ్లు మరియు పోషక లోపాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. రైతులు ప్రపంచంలోని ఇతర రైతులతో తమ అనుభవాలను పంచుకునే అవకాశం కూడా ఇందులో కల్పించారు. అలాగే, GPS సాంకేతికత ఆధారంగా సమీప ప్రాంతాల్లో ఏవైనా పురుగులు లేదా తెగుళ్లు ఎక్కువగా వ్యాపిస్తున్నట్లయితే ముందుగానే హెచ్చరికలు అందిస్తుంది. స్థానిక వాతావరణ సమాచారాన్ని కూడా అందించడం వల్ల పిచికారీ, కలుపు నివారణ, నీటిపారుదల వంటి వ్యవసాయ పనులను సరైన సమయంలో చేపట్టేందుకు రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.

రైతులకు ఉపయోగాలు
పంటలో కనిపించే లక్షణాలు ఏ సమస్యకు సంబంధించినవో తెలియక రైతులు తరచూ అయోమయానికి గురవుతుంటారు. అలాంటి సందర్భాల్లో ప్లాంటిక్స్ యాప్ తక్షణమే సమస్యను గుర్తించి శాస్త్రీయ పరిష్కారాలను సూచించడం ద్వారా సరైన మందును, సరైన మోతాదులో, సరైన సమయంలో ఉపయోగించేందుకు దోహదపడుతుంది. దీంతో అనవసరంగా మందుల వినియోగం తగ్గి సాగు ఖర్చులు ఆదా కావడంతో పాటు పంటను నష్టాల నుంచి కాపాడుకోవచ్చు. రైతు చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను “వ్యవసాయ సలహాదారుగా” మార్చే యాప్‌లలో ప్లాంటిక్స్ ఒకటి.

  1. RiceXpert (రైస్ ఎక్స్‌పర్ట్)
    వరి రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఐసీఏఆర్–జాతీయ వరి పరిశోధన సంస్థ- కటక్ అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ రైస్ ఎక్స్‌పర్ట్ (RiceXpert). వరి సాగుకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని ఒకే వేదికపై రైతులకు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ యాప్, వరి రైతులకు డిజిటల్ వ్యవసాయ సహాయకుడిగా పనిచేస్తోంది.

పొలంలో కనిపించే పురుగులు, తెగుళ్లు, నులిపురుగులు (నెమటోడ్లు), కలుపు మొక్కలు, పోషక లోపాలు లేదా పోషకాల అధికత వంటి సమస్యలను రైతులు ఈ యాప్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. సమస్యకు సంబంధించిన ఫోటో, సందేశం లేదా వాయిస్ రికార్డును పంపితే నిపుణుల నుంచి శాస్త్రీయ సలహాలు అందుతాయి. అంతేకాకుండా, సమస్యకు అనుగుణంగా సిఫారసు చేసిన పురుగుమందు, దాని సరైన మోతాదు, ఎరువుల లెక్కింపు (Fertilizer Calculator) వంటి వివరాలను కూడా ఈ యాప్ అందిస్తుంది.

ఈ యాప్‌లో వివిధ వరి రకాలు, వ్యవసాయ యంత్రాలు, వాతావరణ సమాచారం, తాజా వ్యవసాయ వార్తలు, ఈ-సలహా (e-Advisory), ఈ-మార్కెటింగ్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. రైతులు తమ సందేహాలను నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలకు పంపి తక్షణ పరిష్కారం పొందవచ్చు. అలాగే వరి ఉత్పత్తులను కొనుగోలుదారులకు పరిచయం చేసే అవకాశాన్ని కూడా ఈ యాప్ కల్పిస్తుంది.

రైతులకు ఉపయోగాలు
వరి సాగులో ఎదురయ్యే సమస్యలను త్వరగా గుర్తించి, సరైన సమయంలో సరైన నివారణ చర్యలు చేపట్టేందుకు రైస్ ఎక్స్‌పర్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎరువులు, పురుగుమందులను ఖచ్చితమైన మోతాదులో వినియోగించడానికి మార్గనిర్దేశం చేయడం వల్ల సాగు ఖర్చులు తగ్గి, పంట దిగుబడి మరియు నాణ్యత మెరుగుపడతాయి. అంతేకాకుండా, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు నేరుగా రైతుల చేతికి చేరడం ద్వారా శాస్త్రీయ వరి సాగు మరింత సులభంగా మారుతుంది.

  1. Crop Doctor (క్రాప్ డాక్టర్)
    క్రాప్ డాక్టర్ (Crop Doctor) అనేది రైతులు తమ పంటల్లో వచ్చే సమస్యలను త్వరగా గుర్తించి, శాస్త్రీయ పరిష్కారాలను పొందేందుకు రూపొందించిన మొబైల్ అప్లికేషన్. దీనిని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం (IGKV), రాయ్‌పూర్ మరియు నేషనల్ ఇఇన్ఫర్ మాటిక్స్ సెంటర్ (NIC) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ యాప్ ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు కూడా సులభంగా ఉపయోగించుకునే విధంగా రూపొందించబడింది.

రైతులు పంటలో కనిపించే పురుగులు, తెగుళ్లు లేదా పోషక లోపాల లక్షణాలను మొబైల్‌తో ఫోటో తీసి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే, వాటిని విశ్లేషించి సంభావ్య సమస్యను గుర్తించి తగిన యాజమాన్య సూచనలను అందిస్తుంది. వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు వంటి ప్రధాన పంటలకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటి నివారణకు అవసరమైన శాస్త్రీయ సలహాలను అందించడం ఈ యాప్ ప్రత్యేకత. అదనంగా, ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సబ్సిడీలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, తాజా వ్యవసాయ సమాచారం వంటి ఉపయోగకరమైన వివరాలను కూడా రైతులకు చేరవేస్తుంది.

రైతులకు ఉపయోగాలు
పంటలో సమస్య కనిపించిన వెంటనే వ్యవసాయ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్మార్ట్‌ఫోన్ ద్వారానే ప్రాథమిక నిర్ధారణ చేసుకునే అవకాశం ఈ యాప్ కల్పిస్తుంది. సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల సరైన సమయంలో సరైన నివారణ చర్యలు చేపట్టవచ్చు. దీంతో పంట నష్టాన్ని తగ్గించడంతో పాటు, అనవసరంగా పురుగుమందులు లేదా ఎరువుల వినియోగాన్ని కూడా నివారించవచ్చు. రైతులకు శాస్త్రవేత్తల సలహాలను వేగంగా అందిస్తూ, పొలం మరియు వ్యవసాయ నిపుణుల మధ్య వారధిగా ఈ యాప్ సమర్థవంతంగా పనిచేస్తుంది.

  1. Kisan Suvidha (కిసాన్ సువిధా)
    రైతులకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని ఒకే వేదికపై అందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2016లో కిసాన్ సువిధా మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. రైతులు రోజువారీ వ్యవసాయ నిర్ణయాలను సులభంగా తీసుకునేందుకు అవసరమైన అనేక సేవలను ఈ యాప్ ఒకే చోట అందిస్తుంది. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు సులభంగా ఉపయోగించుకోవచ్చు.

ఈ యాప్ ద్వారా రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో పాటు ఐదు రోజుల వాతావరణ సూచనలను తెలుసుకోవచ్చు. దీనివల్ల పిచికారీ, కోత, నీటిపారుదల వంటి వ్యవసాయ పనులను వాతావరణానికి అనుగుణంగా ప్రణాళిక చేసుకోవచ్చు. అదనంగా, వివిధ పంటలకు సంబంధించిన స్థానిక మార్కెట్ ధరలు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, గోదాములు, కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.

పంటల్లో వచ్చే పురుగులు, తెగుళ్లను గుర్తించి వాటి నివారణకు అవసరమైన సమీకృత పురుగు యాజమాన్య సూచనలు కూడా ఈ యాప్ అందిస్తుంది. అంతేకాకుండా, రైతులు తమ సందేహాలను వ్యవసాయ నిపుణులకు పంపించి వ్యక్తిగత సలహాలు పొందే అవకాశం కూడా కల్పించబడింది. దీంతో శాస్త్రీయ పద్ధతులను అనుసరించి పంటలను సమర్థవంతంగా నిర్వహించడం సులభమవుతుంది.

రైతులకు ఉపయోగాలు
వ్యవసాయానికి సంబంధించిన అనేక సేవలను ఒకే యాప్‌లో అందించడం కిసాన్ సువిధా ప్రత్యేకత. వాతావరణ సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చు. మార్కెట్ ధరల ఆధారంగా సరైన సమయంలో పంటను విక్రయించి మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. అలాగే, శాస్త్రీయ సలహాలు, పురుగులు–తెగుళ్ల నివారణ పద్ధతులు, వ్యవసాయ పరికరాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట పొందడం వల్ల రైతులు సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు శాస్త్రీయంగా, లాభదాయకంగా వ్యవసాయం చేయడానికి ఈ యాప్ ఎంతో దోహదపడుతుంది.

  1. ANGRAU DAATTC App
    ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) ఆధ్వర్యంలోని జిల్లా వ్యవసాయ సలహా మరియు శిక్షణ కేంద్రాలు రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సమాచారాన్ని వేగంగా చేరవేయడానికి ANGRAU DAATTC Appను అభివృద్ధి చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ యాప్, వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు రైతుల మధ్య సమర్థవంతమైన సమాచార వారధిగా పనిచేస్తోంది.

ఈ యాప్ ద్వారా రైతులు పంటల వారీగా సాగు సిఫారసులు, మెరుగైన వంగడాల వివరాలు, పురుగులు–తెగుళ్ల గుర్తింపు మరియు యాజమాన్య పద్ధతులు, పోషక నిర్వహణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వంటి శాస్త్రీయ సమాచారాన్ని పొందవచ్చు. అదనంగా, రైతులకు క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలకు సంబంధించి వ్యవసాయ నిపుణుల సలహాలు, తాజా వ్యవసాయ సాంకేతికతలు, శిక్షణా కార్యక్రమాలు, క్షేత్ర ప్రదర్శనలు మరియు విశ్వవిద్యాలయం విడుదల చేసే తాజా సూచనలు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి.

ఈ యాప్‌లో రైతులు తమ పంటలో కనిపించే సమస్యలను ఫోటోల రూపంలో పంపించి శాస్త్రవేత్తల సలహాలు పొందే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా, జిల్లాల వారీగా రైతులకు అవసరమైన సాంకేతిక సమాచారం, హెచ్చరికలు మరియు అత్యవసర వ్యవసాయ సూచనలు సకాలంలో అందించడం ద్వారా పంట నష్టాలను తగ్గించేందుకు ఈ యాప్ దోహదపడుతోంది.

రైతులకు ఉపయోగాలు
ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ANGRAU DAATTC App ద్వారా స్థానిక పరిస్థితులకు అనుగుణమైన శాస్త్రీయ వ్యవసాయ సలహాలను సులభంగా పొందవచ్చు. పురుగులు, తెగుళ్లు, పోషక లోపాలు వంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చు. అలాగే, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పనులను ప్రణాళిక చేసుకోవడంతో పాటు, విశ్వవిద్యాలయం సిఫారసు చేసిన ఆధునిక సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవడం, సాగు వ్యయాన్ని తగ్గించడం మరియు లాభదాయకమైన వ్యవసాయాన్ని సాధించడం సాధ్యమవుతుంది.

  1. Kapas Kisan (కపాస్ కిసాన్)
    పత్తి రైతులు తమ పంటను కనీస మద్దతు ధర కింద సులభంగా విక్రయించేందుకు భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ కపాస్ కిసాన్. పత్తి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా మరియు రైతు స్నేహపూర్వకంగా మార్చేందుకు ఈ యాప్‌ను రూపొందించారు.

ఈ యాప్ ద్వారా రైతులు ఇంట్లో నుంచే స్వీయ నమోదు చేసుకోవచ్చు. అనంతరం సమీపంలోని CCI కొనుగోలు కేంద్రంలో పత్తిని విక్రయించేందుకు తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ముందుగానే ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. పత్తి నాణ్యత పరీక్ష, ఆమోదించిన పరిమాణం, చెల్లింపు ప్రక్రియ వంటి వివరాలను కూడా రైతులు తమ మొబైల్‌లోనే రియల్ టైమ్‌లో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, విక్రయించిన పత్తికి సంబంధించిన చెల్లింపు స్థితిని కూడా ఈ యాప్ ద్వారా సులభంగా పరిశీలించవచ్చు.

రైతులకు ఉపయోగాలు
కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ప్రభుత్వ MSP కొనుగోలు వ్యవస్థతో అనుసంధానమవుతారు. కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. మొత్తం కొనుగోలు ప్రక్రియ డిజిటల్ రూపంలో ఉండటంతో పారదర్శకత పెరిగి, చెల్లింపుల వివరాలు కూడా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో రైతులు కనీస మద్దతు ధరను సకాలంలో పొందడంతో పాటు, పత్తి విక్రయ ప్రక్రియను సులభంగా, వేగంగా పూర్తి చేసుకోవచ్చు.

  1. APAIMS 2.0
    ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరియు వ్యవసాయ శాఖకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేయడానికి రూపొందించిన సమగ్ర మొబైల్ అప్లికేషన్ APAIMS 2.0. కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్ (ML), ఉపగ్రహ సమాచారం, భౌగోళిక సాంకేతికతలను ఉపయోగించి రైతులకు వేగవంతమైన, పారదర్శకమైన మరియు శాస్త్రీయ సేవలను అందించడం ఈ యాప్ ప్రధాన లక్ష్యం.

ఈ యాప్ ద్వారా రైతులు ఈ-పంట నమోదు, భూమి వివరాలు, రైతు యూనిక్ ఐడీ, ప్రభుత్వ పథకాల అర్హత, విత్తనాలు, ఎరువుల పంపిణీ, సబ్సిడీలు, పంటల స్థితి, వాతావరణ సమాచారం వంటి అనేక సేవలను ఒకే వేదికపై పొందవచ్చు. అంతేకాకుండా, పొలం స్థాయిలో పురుగులు, తెగుళ్లపై ముందస్తు హెచ్చరికలు, పంటల ఆధారంగా వ్యక్తిగత వ్యవసాయ సూచనలు, సమస్యలను ఫోటోల ద్వారా అధికారులకు పంపే సౌకర్యం కూడా ఇందులో ఉంది. రైతు సేవా కేంద్రాలు (RSKs), వ్యవసాయ అధికారులు మరియు రైతులను ఒకే డిజిటల్ వేదికపై అనుసంధానించడం ద్వారా వ్యవసాయ సేవలను మరింత సమర్థవంతంగా అందించే ప్రయత్నం ఈ వ్యవస్థ చేస్తోంది.

రైతులకు ఉపయోగాలు
APAIMS 2.0 ద్వారా రైతులు ప్రభుత్వ వ్యవసాయ సేవలను కార్యాలయాల చుట్టూ తిరగకుండా మొబైల్‌లోనే పొందగలుగుతున్నారు. ఈ-పంట నమోదు, ప్రభుత్వ పథకాల లబ్ధి, విత్తనాలు మరియు ఎరువుల పంపిణీ వివరాలు, పంటలపై వ్యక్తిగత సలహాలు, వాతావరణ హెచ్చరికలు వంటి సేవలు ఒకే యాప్‌లో అందుబాటులో ఉండటం వల్ల సమయం, శ్రమ ఆదా అవుతాయి. అంతేకాకుండా, పొలం స్థాయిలో ముందస్తు పురుగు–తెగుళ్ల హెచ్చరికలు అందడం వల్ల రైతులు తక్షణ నివారణ చర్యలు చేపట్టి పంట నష్టాలను తగ్గించుకోవచ్చు. రాష్ట్రంలో డిజిటల్ వ్యవసాయానికి నాంది పలికిన సమగ్ర వ్యవసాయ వేదికగా APAIMS 2.0 రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతోంది.

ముగింపు
వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో మొబైల్ అప్లికేషన్లు రైతుకు కొత్త బలంగా మారాయి. పంట సాగు ప్రారంభం నుంచి కోత వరకు ప్రతి దశలో రైతుకు అవసరమైన సమాచారం, శాస్త్రీయ సలహాలు, వాతావరణ హెచ్చరికలు, పురుగులు–తెగుళ్ల యాజమాన్యం, పోషక నిర్వహణ, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల వివరాలను ఒకే వేదికపై అందిస్తూ వ్యవసాయాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. ప్లాంటిక్స్, రైస్ ఎక్స్‌పర్ట్, క్రాప్ డాక్టర్, కిసాన్ సువిధా, ఫార్మ్-ఓ-పీడియా, ఏఎన్‌జీఆర్‌ఏయూ డాట్టిక్, కపాస్ కిసాన్, ఏపీఏఐఎంఎస్ 2.0 వంటి మొబైల్ అప్లికేషన్లు రైతులకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. వీటి వినియోగం ద్వారా పురుగులు, తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా నివారించడంతో పాటు, ఎరువులు మరియు పురుగుమందులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించడం వల్ల సాగు వ్యయం తగ్గి పంట దిగుబడి, నాణ్యత, లాభదాయకత పెరుగుతాయి.
అయితే, ఈ మొబైల్ అప్లికేషన్లు రైతులకు సహాయక సాధనాలు మాత్రమే. వాటి ద్వారా అందిన సమాచారాన్ని స్థానిక పరిస్థితులు, నేల స్వభావం, వాతావరణం, పంట దశలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులు సూచించే సాంకేతిక సలహాలతో సమన్వయం చేసుకొని అమలు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. రానున్న రోజుల్లో కృత్రిమ మేధస్సు, ఉపగ్రహ సాంకేతికత, డ్రోన్లు, సెన్సార్ ఆధారిత వ్యవసాయం, ఖచ్చితత్వ వ్యవసాయం వంటి ఆధునిక సాంకేతికతలు ఈ మొబైల్ అప్లికేషన్లతో మరింతగా అనుసంధానమవుతాయి. దీంతో రైతులకు ప్రాంతాలకనుకూలంగా, పంటనిర్దిష్టంగా, సమయానుకూలంగా మరింత ఖచ్చితమైన సలహాలు అందుబాటులోకి వస్తాయి. ఇది వ్యవసాయాన్ని ఉత్పాదకంగా, లాభదాయకంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
డిజిటల్ వ్యవసాయం అనేది భవిష్యత్తు కాదు… అది ఇప్పటికే వర్తమానమైంది. ఈ సాంకేతిక అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించడమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాలు, పురుగులు–తెగుళ్ల వల్ల కలిగే నష్టాలను కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు. అందువల్ల ప్రతి రైతు కనీసం తన పంటకు ఉపయోగపడే ఒకటి లేదా రెండు విశ్వసనీయ వ్యవసాయ మొబైల్ అప్లికేషన్లను వినియోగించడం నేటి అవసరం.

డా. ఏం. ఉదయ్ భాస్కర్, డా. ఏం. ఉషా
వ్యవసాయ విస్తరణ విభాగం, ఆచార్య ఎన్. జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం, గుంటూరు
ఫోన్: 9494666359

Read More

వర్మి కంపోస్టు తయారీలో మెళకువలు

నేల నాణ్యతను, భూ ఫలదతను కాపాడటానికి, ప్రస్తుత విస్తృత వ్యవసాయ సాగు విధానంలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పునరుద్ధరించడం ఎంతో అవసరం. పశువుల గెత్తము లభ్యత నానాటికి తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, కొని వేసుకోవటం లాభదాయకం కాదు. కనుక, ప్రత్యామ్నాయంగా కంపోస్టు ఎరువులను సులభపద్ధతుల్లో తయారు చేసుకొని వేసుకోవటం ఎంతో అవసరం. దీని వల్ల వరిసరాల పరిశుభ్రత కూడా వస్తుంది. సాంప్రదాయ వ్యవసాయంలో ఒకప్పుడు నేలలో విరివిగా కనిపించే వానపాములు నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం వలన వానపాముల సంఖ్య గణనీయంగా తగ్గడం జరిగింది. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర వహిస్తాయని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ మొట్టమొదటిగా 1881లో ప్రపంచానికి తెలియజేశారు.

వర్మికంపోస్టుకు అనువైన వానపాములు – రకాలు
వానపాములు వెన్నెముక లేని జీవులు. ఇందులో 3600 రకాలు ఉన్నాయి. వీటిలో సగం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. వీటిని రెండు రకాలుగా విభజించడం జరిగింది.

  1. బొర్రోయింగ్ అనగా బొరియలు చేయు రకము నేలను గుల్లచేసి భూమి లోపలి పొరలలో ఉంటాయి. మన దేశంలో ఈ రకమే ఎక్కువగా ఉంది. నీటి ఎద్దడిని బాగా తట్టుకుని 90 శాతం మట్టిని 10 శాతం వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది. 8 నుండి 10 అంగుళాల పొడవు ఉండి సుమారు 15 సంవత్సరాలు జీవిస్తుంది. అయితే ఈ రకం వానపాము వర్మి కంపోస్ట్ తయారీకి అంతగా పనికి రాదు.

ఉదా: ఫెరిటిమా ఎలాంగేటా, ఫెరిటిమా ఏసియాటికా మొదలగునవి

  1. నాన్ బొర్రోయింగ్ అనగా బొరియలు చేయని రకము భూమి పై పొరలలో ఉంటూ బొరియలు చేయని రకము. ఇది వర్మి కంపోస్ట్ తయారీకి బాగా అనుకూలంగా వుండి మట్టిలో గల సేంద్రియ పదార్థాలను తునాతునకలు చేసి జీవన ఎరువును తయారు చేస్తాయి. ఇవి 90 శాతం వ్యర్థ పదార్థాలను 10 శాతం మట్టిని ఆహారంగా తీసుకొని నాణ్యమైన కంపోస్ట్ గా మారుస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ. కనుక రైతులు ఇటువంటి రకాలను ఎన్నుకోవడం మంచిది. వీటి జీవిత కాలము సుమారు రెండున్నర సంవత్సరాలు.
    ఉదా: ఐసీనియా ఫొటెడ, యుడ్రిలస్ యూజిని మొదలగునవి.

వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థ పదార్ధాల సద్వినియోగం: వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మి కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలను వర్మి క్యాస్టింగ్స్ అని, వీటి ద్వారా తయారయ్యే ఎరువును వర్మి కంపోస్ట్ అని అంటారు. మానవునికి ఉపయోగంలేక, వదలివేసిన కుళ్ళిన కూరగాయలు, పండ్లు, ఆకులు, చెత్తా చెదారం, కొబ్బరి పీచు, పశువుల పెంట మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్ధాలను తిని, కాలుష్య నివారణకు తోడ్పడటమేగాక విలువైన ఎరువును రైతుకు అందిస్తాయి. వానపాముల ఉనికి, కదలికల వల్ల నేల గుల్లబారుతుంది. ఫలితంగా నేలలో గాలి, నీరు చొరబడే శక్తి పెరుగుతుంది.

వర్మి కంపోస్టు తయారీ విధానం:
తొట్టి సైజు : షుమారు 15 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు.
తొట్టి తయారీ : సిమెంటు తొట్టిని 3 అడుగుల వెడల్పు x 1.5 అడుగుల ఎత్తులో వీలైనంత పొడవుగా తయారు చేసుకోవాలి. సిమెంటు వరలను కూడా ఇందుకు వాడుకోవచ్చు. ఈ సిమెంటు తొట్టి అడుగుభాగం నున్నగా, గట్టిగా ఉండేటట్లు ప్లాస్టరింగ్ చేయాలి. నీరు తొట్టిలో నిలబడకుండా, తొట్టికి ఒక వైపున చిన్న రంధ్రం ఏర్పాటు చేయాలి. సిమెంటు తొట్టికి ఎండ తగలకుండా, చల్లటి పందిరి నీడను కల్పించాలి. ముందుగా కంపోస్టు చేయవలసిన వ్యర్థపదార్థాలన్నిటినీ (చెత్త, ఆకులు, పంటకోసాక మిగిలిన పంట అవశేషాలు, పిచ్చిమొక్కలు మొదలైనవి) సుమారు ఒక నెల రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి, అవి ఒక మాదిరిగా కుళ్ళే వరకు కుళ్ళబెట్టాలి. ఆ తరువాత పాక్షికంగా కుళ్లిన ఈ వ్యర్ధపదార్ధాలను తెచ్చి, వర్మి కంపోస్టు తొట్టిలో వేసి కంపోస్టు చేసుకోవాలి. అయితే తొట్టిలో వీటిని వేయబోయే ముందు తొట్టి అడుగున బెడ్డింగ్ మెటీరియల్ సుమారు 15 సెం.మీ. మందాన తయారు చేసుకోవాలి, ముక్కిన కొబ్బరి పీచు లేదా కొద్దిగా ముక్కిన చెరకు పిప్పిని ముక్కలుగా కొట్టి, సమానంగా తొట్టి అంతా పలుచగా పరచి వెయ్యాలి. బెడ్డింగ్ మెటీరియల్ వేశాక, దాని మీద పాక్షికంగా కుళ్లబెట్టి ఉంచుకున్న వ్యర్థ పదార్ధాలను వెయ్యాలి. తరువాత పేడ నీళ్లు చిలకరించాలి. కొద్దిగా ముక్కిన పేడను (10 సెం.మీ. మందాన) ఈ వ్యర్థ పదార్థాలను వేసిన పొరపైన వెయ్యాలి. పచ్చిపేడను వెయ్యకూడదు. వానపాములను (చదరపు మీటరకు వెయ్యి/1 కిలో చొప్పున) వర్మీ కంపోస్టు తొట్టిలోకి వదలాలి. వర్మికంపోస్టుకు అనువయిన వానపాములు బరియలు చేయని రకాలు: ఐసీనియా ఫోటెడా, యూడ్రిలస్ యూజిని ముఖ్యమైనవి. పాత గోనె సంచులను గాని (లేదా) వరిగడ్డిని గాని తొట్టిపైన కప్పాలి. ప్రతి రోజు పల్చగా నీరు చిలకరిస్తూ ఉండాలి. నీళ్ళు ఎక్కువగా పోయకూడదు. రెండు-మూడు నెలల్లో మంచి, సస్య పోషణ గల వర్మీ కంపోస్టు తయారవుతుంది. సిమెంటు తొట్టి నుండి తయారైన వర్మీ కంపోస్టును తీయటానికి 4-5 రోజుల ముందు, తొట్టిలో నీరు చల్లరాదు. ఇలా చేయటం వల్ల, వానపాములు తేమను వెదుక్కుంటూ తొట్టి అడుగు భాగానికి చేరతాయి. కనుక తయారైన కంపోస్టును తీసుకోవచ్చు. తొట్టిలో నుండి కంపోస్టును బయటకు తీసి, శంఖాకారంగా గుట్టలు, గుట్టలుగా పోసి, ముతక జల్లెడతో జల్లించి, పంట పొలాలకు వేసుకోవాలి. బాగా తయారైన వర్మీ కంపోస్టు, పొడి పొడిలాడుతూ కాఫీ రంగులో ఉంటుంది. సంవత్సరానికి ఈవిధంగా ఒక తొట్టి నుండి 4 సార్లు కంపోస్టు చేసుకోవచ్చు. దీని వల్ల షుమారు 3 టన్నుల కంపోస్టు లభిస్తుంది.

వర్మీ కంపోస్ట్ ఉపయోగాలు :

  • నేల ఉత్పాదకతకు కావాల్సిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి.
  • వేసిన పైరుకే కాక తర్వాత 2-3 పైర్లపై దీని ప్రభావం ఉంటుంది.
  • మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పోషకాల సమతుల్యత ఉంటుంది.
  • వర్మీ కంపోస్ట్ తయారు చేయడం సులభం, ఖర్చు తక్కువ
  • రసాయన ఎరువులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి ఖర్చు ఆదా అవుతుంది.
  • పలు రకాల ఎంజైములు, హార్మోన్లు, అమైనోఆమ్లములు తయారై, మొక్కలు చురుకుగా పెరగడానికి తోడ్పడతాయి.
  • రోగ నిరోధక శక్తి పెంచే ఆక్సినోమైట్లు తయారవడం వల్ల పైరు ఆరోగ్యంగా ఉండి పురుగుమందులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి, లాభం చేకూరుతుంది.
  • భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. నేల సహజసిద్ధమైన ఆరోగ్యం కలిగి ఉంటుంది.
  • కూరగాయలు, పండ్లు, ఇతర ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. వాటికి మంచి రంగు, రుచీ, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం పెరుగుతుంది.
  • సేంద్రియ వ్యర్ధాలను వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగించడం వల్ల, మంచి ఎరువు లభ్యమవుతుంది. పరిసరాల కాలుష్య నివారణకు తోడ్పడుతుంది.
  • దిగుబడితో పాటు ఫలసాయం నాణ్యత పెరుగుతుంది.

వర్మీ కంపోస్టుకు ఉపయోగించిన వ్యర్థ పదార్ధాలను బట్టి, స్థానిక వాతావరణం పరిస్థితులను బట్టి, తయారైన కంపోస్టులోని పోషకాల శాతంలో కొద్దిపాటి తేడాలుండవచ్చు. నత్రజని 1.5 నుండి 2.0 శాతం, భాస్వరం 0.5 నుండి 1.5 శాతం, పొటాషియం 0.5 నుండి 1.00 శాతం ఉంటుంది. ఇవికాక కాల్షియం, మెగ్నీషియం, గంధకం, రాగి, ఇనుము, మాంగనీసు, జింకు, మాలిబ్డినం, బోరాన్ పోషకాలు కూడా లభిస్తాయి. సాధారణ పైర్లన్నింటికి ఎకరానికి 1.0 నుండి 1.5 టన్నుల చొప్పున వర్మీ కంపోస్టు వేయవచ్చు. కుండీలలోని మొక్కలకు 200 గ్రా. చొప్పున వేయవచ్చును.

వర్మీ వాష్: వానపాముల శరీర భాగాల నుండి అవి విసర్జించే వర్మి క్యాస్టింగ్స్ నుండి తయారయ్యే ద్రవాన్ని “వర్మీ వాష్” అంటారు. ఇందులో మొక్క పెరుగుదలకు దోహదపడే హార్మోన్లు, అమైనో అమ్లములు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

తయారీ విధానం: వానపాములు ఉండడానికి అనువుగా బెడ్ ఏర్పాటు చేయాలి. దీనికి ఒక పెద్ద సైజు మట్టి పాత్ర (కుండ) లేదా పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ము ఉపయోగించుకోవచ్చు. పాత్ర అడుగు భాగంలో ఒక రంధ్రం ఏర్పాటు చేసి, దానిని దూది సహాయంతో మూసి ఉంచాలి. పాత్ర అడుగు భాగాన్ని మొదటి 3-4 అంగుళాలు ఇసుకతో ఆపైన 3 అంగుళాలు చిన్న చిన్న ఇటుక ముక్కలు, రాళ్ళతో నింపాలి. దీనిమీద బాగా మాగిన సేంద్రియపదార్ధాన్ని పాత్రలో నాలుగింట మూడు వంతుల వరకు నింపాలి, ఇందులో వీలయినన్ని ఎక్కువ (150 నుండి 200) వానపాములు వదలాలి. పాత్రలో ఎల్లప్పుడు 50-60 శాతం తేమ ఉండేటట్లు ప్రతిరోజు నీటిని చిలకరిస్తూ ఉండాలి. వానపాముల విసర్జన పూర్తిగా తయారైన తర్వాత ఎక్కువ నీరు పోయాలి. పాత్ర అడుగు భాగంలోని రంధ్రం నుండి టీ డికాక్షన్ వంటి ద్రవం బొట్టు బొట్టుగా స్రవించడం మొదలవుతుంది. దీనిని సేకరించాలి. ఇలాగే మరో రెండు సార్లు నీరు పోసి వచ్చిన ద్రవాన్ని సేకరించాలి. దీనినే వర్మి వాష్ అంటారు. ఇది అత్యంత విలువైన సేంద్రియ ద్రవ ఎరువు. సేంద్రియ పదార్ధమంతా వర్మి క్యాస్టింగ్గా మారి పోయినప్పుడు, దానిని తీసివేసి కొత్తగా సేంద్రియ పదార్థాన్ని వేస్తే వానపాముల నుండి మరల క్యాస్టింగ్స్ తయారవడం ప్రారంభమవుతుంది. ఇదే పద్ధతి పలుమార్లు ఆచరించడం వల్ల అవసరమైనంత వర్మివాష్ లభిస్తుంది.

పోషక విలువలు: నత్రజని – 500 పి.పి.యం., భాస్వరం – 390 పి.పి.యం., పొటాషియం- 460 పి.పి.యం. కాల్షియం-540 పి.పి.యం.. మెగ్నీషియం-110 పి.పి.యం., ఇనుము-273 పి.పి.యం., మాంగనీసు- 180 పి.పి.యం., జింకు – 180 పి.పి.యం., రాగి-21 పి.పి.యం.

వెర్మి కల్చర్: వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మికల్చర్ అంటారు. వానపాములను ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చేయడానికి 1:1 నిష్పత్తిలో పేడ మరియు ఎండిన ఆకులను కలుపుకోవాలి. ఇలా కలుపుకొన్న, ప్రతీ 10 కిలోల వ్యర్థ పదార్ధాలకు 50 వానపాములు చొప్పున వదులుకుని, నీడలో పెట్టుకొని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పిస్తే (ఉష్ణోగ్రత 15-30° సెంటీగ్రేడ్, తేమ శాతం 70-80%) రెండు నెలల్లో వానపాముల సంఖ్య వంద రెట్లు పెరుగుతుంది.

డా.ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), డా.కె. లక్ష్మణ, ప్రధాన శాస్త్రవేత్త(విస్తరణ), డా.కే. తేజేశ్వర రావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ పరిశోధన స్థానం, విజయనగరం. మొబైల్ నెంబర్ : 9440123223

Read More

ఆయిల్‌పామ్‌లో 9–3 పద్ధతిలో ఆకుల నిర్వహణఅధిక దిగుబడులు, అధిక ఆదాయానికి శాస్త్రీయ మార్గం

ఆయిల్‌పామ్ పంటలో ఆశించిన స్థాయిలో నాణ్యమైన గెలలు మరియు అధిక దిగుబడి సాధించాలంటే సరైన పోషకాలు, నీటి యాజమాన్యంతో పాటు ఆకుల యాజమాన్యం (Frond Management) అత్యంత కీలకమైనది. తోటలోని చెట్లకు ఉండే ఆకుల సంఖ్య, వాటిని కత్తిరించే విధానం మరియు కత్తిరించిన ఆకులను సర్దే పద్ధతులపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ఆయిల్‌పామ్ రైతులకు ఉపయోగపడే పూర్తి స్థాయి ఆకుల యాజమాన్య పద్ధతులు మరియు అనుసరించే విధానం

  1. చెట్టుకు ఉండవలసిన ఆకుల సంఖ్య (Optimum Leaf Count)
    ఆయిల్‌పామ్ చెట్టు సూర్యరశ్మిని గ్రహించి పిండిపదార్థాలను తయారుచేసుకోవడానికి ఆకులు ఎంతో అవసరం. అవసరానికి మించి ఆకులను కత్తిరించడం (Over-pruning) వల్ల దిగుబడి క్రమంగా తగ్గుతుంది.
    చిన్న వయసు తోటలు (1-3 సంవత్సరాలు): చెట్టుకు ఉన్న అన్ని పచ్చని ఆకులను అలాగే ఉంచాలి. కేవలం ఎండిపోయిన ఆకులను మాత్రమే తీసివేయాలి.
    దిగుబడినిచ్చే తోటలు (4-10 సంవత్సరాలు): ప్రతి చెట్టుకు కనీసం 40 నుండి 48 పచ్చని ఆకులు ఉండేలా చూసుకోవాలి. అంటే గెల కింద కనీసం రెండు వరసల ఆకులు ఉంచాలి.
    • పెద్ద వయసు తోటలు (10 సంవత్సరాలు పైబడినవి): ప్రతి చెట్టుకు కనీసం 32 నుండి 40 ఆకులు ఉండాలి. గెల కింద ఒక వరస ఆకును తప్పనిసరిగా ఉంచాలి.
  2. ఆకులను కత్తిరించే సరైన పద్ధతి (Pruning Technique)
    ఆయిల్‌పామ్ తోటల్లో ఆకుల యాజమాన్యానికి సంబంధించి అంతర్జాతీయంగా మరియు శాస్త్రవేత్తలచే సిఫార్సు చేయబడిన ఒక అద్భుతమైన సూత్రం “9-3 క్లాక్ రూల్” (9-3 Clock Rule). సాధారణంగా రైతులు ఏ ఆకులను ఉంచాలి, వేటిని కత్తిరించాలి అనే విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. ఈ క్లాక్ రూల్ (గడియార నియమం) ద్వారా ఆకుల కత్తిరింపు చాలా సులువుగా నిర్వహించవచ్చు.

గడియార నియమం (9-3 Clock Rule) అంటే ఏమిటి?
మనం గడియారాన్ని చూసినప్పుడు 9 గంటల ముల్లు ఎడమవైపు సమాంతరంగా, 3 గంటల ముల్లు కుడివైపు సమాంతరంగా ఉంటాయి. ఆయిల్‌పామ్ చెట్టును కూడా ఒక పెద్ద గడియారంగా ఊహించుకుంటే, చెట్టు మధ్య భాగం నుండి సమాంతరంగా ఇరువైపులా విస్తరించి ఉండే ఆకులను ఈ సమయాలతో పోలుస్తారు.
నియమం యొక్క ముఖ్య ఉద్దేశం: చెట్టు కాండం నుండి భూమికి సమాంతరంగా (Horizontal) ఇరువైపులా ఉండే ఆకుల కంటే క్రింది భాగంలో ఉన్న ఆకులను మాత్రమే కత్తిరించాలి.
• 9 మరియు 3 గంటల స్థానం: గడియారంలో 9 నుండి 3 గంటల రేఖకు పైభాగంలో ఉండే ఆకులను ఎట్టిపరిస్థితుల్లోనూ కత్తిరించకూడదు.

ఈ నియమాన్ని ఎలా పాటించాలి?

  1. సమాంతర రేఖను గుర్తించడం: చెట్టు వద్ద నిలబడి, కంటిచూపు మేర సమాంతరంగా (horizontal) ఉండే ఆకులను (9 మరియు 3 గంటల స్థానాలు) గుర్తించండి.
  2. గెలల కింద ఆకులు: సాధారణంగా ఆయిల్‌పామ్ చెట్టులో గెలలు ఈ సమాంతర రేఖకు పైభాగంలో లేదా రేఖకు సరిగ్గా ఆనుకుని ఉంటాయి.
  3. కత్తిరింపు పరిమితి: కేవలం 9 గంటల మార్కు మరియు 3 గంటల మార్కు కంటే క్రిందికి వేలాడుతున్న, లేదా ఎండిపోయిన ఆకులను మాత్రమే నరకాలి.
  4. రెండు వరుసల సూత్రం: గెల బరువును మోయడానికి మరియు దానికి సరైన పోషకాలు అందడానికి, గెల ఉన్న మట్ట కింద కనీసం 1 నుండి 2 వరుసల పచ్చని ఆకులు (సమాంతర రేఖ పరిధిలో ఉన్నవి) ఖచ్చితంగా మిగిలి ఉండాలి.

9-3 క్లాక్ రూల్ పాటించడం వల్ల కలిగే లాభాలు
• అధిక దిగుబడి (High Yield): చెట్టుకు కావలసినన్ని పచ్చని ఆకులు (సుమారు 40-48) లభించడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి, గెలలు పెద్ద పరిమాణంలో ఊరుతాయి.
• ఆడ పూల సంఖ్య పెరుగుదల: అవసరానికి మించి ఆకులు కత్తిరిస్తే (Over-pruning) చెట్టు ఒత్తిడికి లోనై మగ పూలు ఎక్కువగా వస్తాయి. ఈ రూల్ పాటించడం వల్ల ఆడ పూల సంఖ్య పెరిగి దిగుబడి స్థిరంగా ఉంటుంది.
• గెలల రక్షణ: గెలల కింద ఉండే ఆకులు గెలలకు ఒక సపోర్టులా పనిచేస్తాయి. గెలలు కిందపడిపోకుండా లేదా కాండం నుండి విడిపోకుండా ఇవి కాపాడతాయి.
• సులువైన కోత: ఏ ఆకులను ఉంచాలో కార్మికులకు సులభంగా అర్థమవుతుంది. దీనివల్ల తోట పని వేగంగా జరుగుతుంది.

గెలలు కోసే సమయంలో మరియు ఆకులను కత్తిరించేటప్పుడు (Pruning) కొన్ని జాగ్రత్తలు పాటించాలి:
• మట్టను దగ్గరగా నరకడం: ఆకులను కత్తిరించేటప్పుడు కాండానికి వీలైనంత దగ్గరగా, నిలువుగా కాకుండా వాలుగా కత్తిరించాలి.
• పంగలు మిగల్చకూడదు: కాండంపై ఎక్కువ పొడవు మట్టలను (Frond butts) వదిలేయకూడదు. అలా వదిలేస్తే, ఆ పంగలలో వర్షపు నీరు చేరి కుళ్లిపోవడం లేదా ఎలుకలు, పురుగులు ఆశ్రయం పొందడం జరుగుతుంది.
• వ్యాధి సోకిన ఆకులు: పొడి తెగులు (Leaf blight) లేదా ఇతర వ్యాధులు సోకి పూర్తిగా ఎండిపోయిన ఆకులను వెంటనే తొలగించి తోట బయట పడేయాలి.

  1. కత్తిరించిన మట్టల పునరుద్ధరణ / సర్దడం
    కత్తిరించిన ఆయిల్‌పామ్ మట్టలను తోటలోనే సరైన పద్ధతిలో అమర్చడం ద్వారా భూమికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిని ఫ్రాండ్ స్టాకింగ్ అంటారు.
    ఎల్-షేప్ (L-Shape) లేదా యూ-షేప్ (U-Shape) పద్ధతి: రెండు చెట్ల మధ్య వరుసలలో లేదా చెట్ల చుట్టూ పాదులకు ఇబ్బంది లేకుండా మట్టలను ఒక పద్ధతి ప్రకారం అమర్చాలి.
    మల్చింగ్ (మట్టి తేమ సంరక్షణ): ఈ మట్టలను చెట్ల మధ్య వరుసల్లో వేయడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిపై పడక తేమ ఆవిరి కాకుండా ఉంటుంది.
    సేంద్రీయ ఎరువుగా మార్పిడి: కాలక్రమేణా ఈ ఆకులు కుళ్లిపోయి భూమికి అవసరమైన హ్యూమస్ (సేంద్రీయ కర్బనం) మరియు పొటాషియం వంటి పోషకాలను అందిస్తాయి. దీనివల్ల ఎరువుల ఖర్చు తగ్గుతుంది.
    • కలుపు నివారణ: మట్టలు పరిచిన చోట కలుపు మొక్కలు మొలకెత్తవు.

ముఖ్యమైన సూచనలు:

  1. వేసవి కాలంలో ఆకులను ఎక్కువగా కత్తిరించకూడదు. ఇది చెట్టుపై ఒత్తిడిని పెంచుతుంది.
  2. మట్టలు కత్తిరించడానికి ఉపయోగించే కత్తులు లేదా చిక్కం (Chisel/Sickle) బాగా పదునుగా ఉండాలి, తద్వారా కాండం దెబ్బతినకుండా ఉంటుంది.
  3. మట్టలను ఎట్టిపరిస్థితుల్లోనూ తోటలో పెట్టి తగులబెట్టకూడదు. దీనివల్ల మిత్రపురుగులు చనిపోవడమే కాకుండా చెట్లకు నష్టం జరుగుతుంది.

రైతులకు గమనిక: గెలలు కోయడం సులువుగా ఉంటుందని చాలామంది రైతులు ఆకులను ఎక్కువగా కత్తిరిస్తుంటారు. ఇది చాలా తప్పు. ఆకులు తగ్గితే చెట్టు తక్కువ ఆహారాన్ని తయారుచేసుకుని, మగ పూత ఎక్కువగా వచ్చి గెలల సంఖ్య తగ్గిపోతుంది.

డా. పి. నీలిమ, డా. డి. స్రవంతి, డా. బి. దీపక్ రెడ్డి, డా. ఎన్. జమీమా, డా. ఆర్. రమేష్, డా. ఐ. కృష్ణ తేజ, డా. ఐ. వి. శ్రీనివాస రెడ్డి మరియు డా. జె. హేమంత కుమార్, వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట, భ. కొత్తగూడెం జిల్లా- 507 301

Read More

విస్తరణ సేవలను పటిష్టం చేస్తున్న కోరమాండల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో గ్రోమోర్ గ్రామ్ పేరుతో వ్యవసాయ విస్తరణ సేవలను మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో, 12 రాష్ట్రాల్లోని 101 గ్రామాలను కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎంపిక చేసింది. ఈ మోడల్ గ్రామాల రైతులు సమతుల్య పోషక పద్ధతులను అవలంబించి, స్థిరమైన దిగుమతులు సాధించేలా వారిని సాధికారులను చేస్తామని కోరమాండల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాధబ్ అధికారి తెలిపారు. భూసారానికి అనుగుణంగా ఎరువులు వాడటం, ఆధునిక సాంకేతికతతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ, రైతులకు కొత్త సాగు పద్దతులపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం లాంటివి ఇందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నారు.

Read More

‘సైలో’ పద్ధతిలో పంట ఉత్పత్తులను రెండేళ్ళ వరకు నిల్వ చేయవచ్చు

‘సైలో’ పద్ధతిలో పంటలను రెండేళ్ల వరకు సురక్షతంగా నిల్వ చేసుకునే వీలుందని, తెలంగాణా రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వానికి రూ. వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమకుమార్‌ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌ లోని రాష్ట్ర సచివాలయంలో భారత ఆహార సంస్థ, రాష్ట్ర పౌర సరఫరాలశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇంటిగ్రేటెడ్‌ క్లీనర్లు, డ్రయర్ల సాయంతో మక్కలు, వరి, సోయాబీన్‌ లాంటి పంట ఉత్పత్తుల్లోని తేమను ఆధునిక పద్ధతిలో తొలగించడంతో ఎక్కువ కాలం నిల్వ చేసుకునే ఆస్కారం ఉంటుంది. రైతులకు భరోసా ఇచ్చేందుకు, ధాన్యాన్ని పరిరక్షంచేందుకు దీన్ని అమలు చేయనున్నాం. ఎక్కువ కాలం నిల్వ ఉన్న ధాన్యం, పాత బియ్యానికి మార్కెట్‌లో అధిక ధర లభిస్తుందని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Read More

వ్యవసాయ యంత్రపరికరాలపై 50% సబ్సిడీ

గతంలో ఆగిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.101.83 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. సన్నకారు, చిన్న, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతం సబ్సిడీతో 1,31,182 వ్యవసాయ పరికరాలు మంజూరు చేసేందుకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటికయ్యే ఖర్చులో కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించనున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ (సబ్‌ మిషన్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ మెకనైజేషన్‌-స్మామ్‌) పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధులకు తమ వాటా కలిపి పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రం సన్నద్ధమైంది.

మార్గదర్శకాలు…
పేరొందిన 16 కంపెనీలను గుర్తించి ఎంప్యానెల్‌లో చేర్చింది. వాటి నుంచి రైతులు స్వయంగా పరికరాలను కొనుగోలు చేయాలి. సబ్సిడీని కంపెనీలకు అందజేస్తారు. పంపిణీ చేసిన పరికరాల వినియోగాన్ని వ్యవసాయాధికారులు ఐదేళ్లపాటు పర్యవేక్షించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో రూ.లక్ష కంటే ఎక్కువ సబ్సిడీ పొందిన వారు ఆరేళ్లవరకు, రూ.3 వేల నుంచి రూ.లక్ష వరకు పొందిన వారు మూడేళ్ల వరకు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా ప్రకటించింది. రూ. లక్ష, అంత కంటే ఎక్కువ విలువైన యంత్రాలకు జియో ట్యాగింగ్‌ చేస్తారు. ట్రాక్టర్లు, ఇతర స్వయం చాలిత యంత్రాలకు ఏఐ-ఆధారిత టెలిమాటిక్స్‌ కిట్‌ అమరుస్తారు. దీంతో యంత్రం ఎక్కడ ఉందో, ఎంత పని చేసిందో ట్రాక్‌ చేయవచ్చు. యంత్రాలపై చెరిపివేసే వీలు లేకుండా లేజర్‌ కట్‌తో గుర్తింపు సంఖ్య ఉంటుంది.

సబ్సిడీపై అందుబాటులో ఉండే యంత్రాలు…
విత్తనాలు చల్లే యంత్రాలు, కోత యంత్రాలు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లతో నడిచే రొటోవేటర్లు, ప్లౌ, ట్రాలీ, సీడర్‌, కలుపు తీసే యంత్రాలు, పవర్‌ టిల్లర్లు, వీడర్లు, సీడ్‌ కమ్‌ ఫెర్టిలైజర్‌ డ్రిల్‌, స్ట్రాబాలర్లు, బండ్‌ ఫార్మర్‌ వంటి 15 రకాల యంత్రాలకు ఈ సబ్సిడీ వర్తింపజేస్తున్నారు. ప్రభుత్వం త్వరలో వీటిని పంపిణీ ప్రారంభించనుంది. ఈ పరికరాలతో పంటల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయ పనుల్లో సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయని అధికారులు అంటున్నారు.

Read More

జన్యువుల వృద్ధితో వేరుశనగ పంట దిగుబడి పెరిగింది

పంటలో జన్యువులు వృద్ధి కారణంగా వేరుశనగ దిగుబడిలో ప్రతి యేటా పెరుగుదల కనిపిస్తోందని అంతర్జాతీయ మెట్టప్రాంతాల పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్‌) అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌తోపాటు వివిధ ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని స్పానింగ్‌బంచ్‌, వర్జీనియాబంచ్‌ అనే రెండు ప్రధాన రకాలలో కాయ దిగుబడి, గింజ శాతం, గింజ బరువు ప్రాతిపదికన రెండేళ్లలో నాలుగు పంట సీజన్లలో విస్తృత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల బృందం ఈ విషయం తేల్చింది. మూడు నుంచి నాలుగు నెలల కాలంలో పండే పంటకు యేటా హెక్టారుకు సుమారు 27 కిలోలు.. ఆరు నెలల్లో కాతకొచ్చే రకాల్లో హెక్టారుకు 25 కిలోల దిగుబడి పెరుగుదలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్రిశాట్‌ గత 20 ఏళ్లలో 240 వేరుశనగ రకాలను అభివృద్ధి చేసింది. కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ, జన్యు ఎంపికల వంటి అధునాతన సాధనలతో పరిశోధనలు జరిపి, మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హిమాన్ష్‌ పాఠక్‌ తెలిపారు.

Read More

తెలంగాణలో ప్రతి జిల్లాలో రైతు విజ్ఞాన కేంద్రం!

పంటల సాగులో ఆధునిక సాంకేతికతను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రయోగాలు, ఆవిష్కరణల ఫలాలను తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు అందించేందుకు వీలుగా ప్రతి జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం (ఆర్‌వీకే) స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ మేరకు ఆర్‌వీకేలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9 ఏరువాక కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రా(కేవీకే)లు పనిచేస్తున్నాయి. ఇందులో కొద్దిమంది శాస్త్రవేత్తలే పని చేస్తున్నారు. ఏకంగా 15 జిల్లాల్లో శాస్త్రవేత్తలు లేరు. రైతులకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడం, పంటల మార్పిడి ఆవశ్యకతను వివరించడం, నేరుగా వరి విత్తనం వేయడం, పత్తిలో కలుపు మొక్కల నివారణ వంటి వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. డ్రోన్లు, యంత్రాల వినియోగం, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ వంటి ఆధునిక సాంకేతిక సేవలను అందించాలని యోచిస్తోంది. వీటన్నింటి అమలుకు ప్రత్యేకంగా రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని అగ్రివర్సిటీని ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 17 ఏరువాక, కేవీకేలను ఆర్‌వికెలుగా మారుస్తారు. మరో 15 జిల్లాల్లో కొత్త ఆర్‌వికెలను ఏర్పాటు చేస్తారు. అప్పుడు 32 జిల్లాల్లో విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి కేంద్రంలో ఆరుగురు చొప్పున శాస్త్రవేత్తలను నియమిస్తారు. ఇతర సహాయ సిబ్బంది ఉంటారు. వాటిలో ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారు. వాటికి అనుబంధంగా విత్తన, సాగు క్షేత్రాలు ఉంటాయి. వాటిలో డ్రోన్లు, యంత్రాలపై శిక్షణ ఇస్తారు. నిత్యం పరిశోధనలు, ప్రయోగాలకు, రైతు శిక్షణ కార్యక్రమాలకు అవకాశం కల్పిస్తారు. అంకుర సంస్థలకు సైతం స్థలాలను కేటాయిస్తారు.

Read More