వడగాల్పుల ప్రభావంతో నష్టపోయిన పౌల్ట్రీ రైతులను ఆదుకుంటాం

యూరియా లభ్యత, మొక్క జొన్న ధరలు, రొయ్యల మార్కెట్ పరిస్థితులు, కొబ్బరి రైతుల సమస్యలు, అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి తదితర అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖల సంచాలకులతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌల్ట్రీ, ఉద్యాన, ఆక్వా రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వడగాడ్పుల ప్రభావంతో రాష్ట్రంలో సుమారు 5.5 కోట్ల కమర్షియల్ లేయర్ కోళ్లలో 2.5% నుంచి 3.5% వరకు మరణాలు నమోదైనట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని ఆయన తెలిపారు. నష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పౌల్ట్రీ రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు.

Read More

ఎల్‌నినో ప్రభావం ఉన్న చోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా పశుగ్రాసానికి కొరత రావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టంచేశారు. ఎల్‌నినో ప్రభావంపై చర్చ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ పశుగ్రాస కొరత రాకుండా జాగ్రత్తలను ప్రస్తావించారు. ఉపాది హామీ పథకం కింద ప్రైవేటు భూముల్లోనూ పశుగ్రాసం సాగుకు అనుమతించామని పీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెప్పారు. ‘ఇప్పటివరకు 3,458 ఎకరాలను ఉపాది హామీ పథకం కిందకు తెచ్చి, అక్కడ గ్రాసం సాగుకు విత్తనాలు అందించాం. అనంతపురం జిల్లాలో చెరువు భూముల్లోనూ సాగు కోసం పశు గ్రాసం విత్తనాలను ఉచితంగా ఇస్తున్నామ’ని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదరాయుడు తెలిపారు. పలు సందేహాలు లేవనెత్తిన సీఎం.. గ్రాసం సాగుకు ఎంత బడ్జెట్ కావాలని ప్రశ్నించారు. రూ.700 కోట్ల అవసరమని డైరెక్టర్ చెప్పగా, ‘రూ.1,000 కోట్ల వరకైనా పర్లేదు. ఎల్‌నినో ప్రభావం ఉన్నచోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు చేపట్టండి. కలెక్టర్లు వెంటనే ఈ సాగు మొదలు పెట్టించాలి’ అని ఆదేశించారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన కౌలు ధరలు

ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఏడాది రబీ ఇంకా పూర్తిగా ముగియక ముందే పొలాలు కౌలుకు తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. సాగునీటి వసతి ఉన్న పొలాలైతే ఎకరాకు రూ.40 వేలు చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. మిరప సాగు అనుకూలించడమే దీనికి కారణం. ఈ ఏడాది వాతావరణంలో మార్పు కారణంగా జనవరి నుంచి మిరపలో నల్లతామర ప్రభావం తగ్గింది. తోటలు ఏపుగా పెరిగాయి. సగటున ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి లభిస్తోంది. అక్కడక్కడా ఎకరాకు 40-50 క్వింటాళ్లు వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. మిరప ధరలు క్రమంగా పెరుగుతూ సగటున క్వింటాలు రూ.20 వేలకు చేరాయి. పెట్టుబడులు పోగా కొంతైనా మిగులుతుందని, అప్పుల నుంచి ఎంతోకొంత బయటపడతామనే ఆశ రైతుల్లో ఉంది. విత్తన మొక్కజొన్న రైతులకూ అధిక దిగుబడులే వచ్చాయి. అందుకే వచ్చే ఖరీఫ్, రబీల్లో ఈ రెండు పంటల సాగుకు రైతులు మొగ్గు చూపిస్తున్నారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా పల్నాడు జిల్లాలో ఈ ఏడాది 1.10 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. వచ్చే ఏడాది కూడా మిరప సాగు పెరుగుతుందని అంచనా. గురజాల, పెదకూరపాడు, మాచర్ల, చిలకలూరిపేటతో పాటు గుంటూరు జిల్లా తాడికొండ తదితర నియోజకవర్గాల్లో సాగు అధికం. గురజాల నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు ముందే చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం ప్రాంతంలో బోర్ల కింద ఉన్న భూములకు ఎకరా రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకు పలుకుతోంది.
“ఉమ్మడి అనంతపురం జిల్లాలో మిరప సాగు కొన్నేళ్లుగా పెరిగింది. హంద్రీ-నీవా, తుంగభద్ర హైలెవల్ కెనాల్ పరిధిలో మిరప విస్తృతంగా పండిస్తున్నారు. వచ్చే ఏడాది మళ్లీ మిరప వేసేందుకు పొలాలను కౌలుకు తీసుకుంటున్నారు. ఎకరాకు రూ. 40వేల నుంచి రూ.45వేల మధ్య చెల్లించేలా కౌలుకు తీసుకుంటున్నారు.

Read More

ప్రధానమంత్రి ధనధాన్యయోజన కింద ఏపీ నుంచి అల్లూరిసీతారామరాజు, శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల ఎంపిక

వ్యవసాయపరంగా తక్కువ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఎంపికచేసి అక్కడ ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జులై 16న ప్రకటించిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి అల్లూరిసీతారామరాజు (ఏఎస్‌ఆర్‌), శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలను ఎంపిక చేశారు. వీటికి నోడల్‌ అధికారులుగా నలుగురు ఐఏఎస్‌ అధికారులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో ఏఎస్‌ఆర్‌ జిల్లాకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి అమిత్‌సింగ్లా (ఏజీఎంయూటీ కేడర్‌), శ్రీసత్యసాయి జిల్లాకు సహకారశాఖ సంయుక్త కార్యదర్శి సిద్ధార్థ్‌ జైన్‌, అనంతపురం జిల్లాకు పెట్రోలియం సహజవాయువుల శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతశర్మ (ఇద్దరూ ఏపీకేడర్‌), అన్నమయ్య జిల్లాకు కార్పొరేట్‌ వ్యవహారాలశాఖ సంయుక్త కార్యదర్శి బాలమురుగన్‌ (బిహార్‌ కేడర్‌) నియమితులయ్యారు. ఈ పథకం కింద పంట మార్పిడిని ప్రోత్సహిస్తారు. సాగునీటి సౌకర్యం, పంటల సామర్థ్యం మెరుగుపరుస్తారు. రైతులకు రుణాలు అందిస్తారు. మొత్తం ఆరేళ్లకాలంలో అమలుచేస్తున్న ఈ పథకం కింద రూ.24 వేల కోట్లు ఖర్చుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రంలోని 11 మంత్రిత్వశాఖల పరిధిలో ఉన్న 36 పథకాలను సమ్మిళితంచేసి దీని కింద అమలుచేస్తారు. తద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నది అంచనా. ఈ పథకం కింద ఎంపికచేసిన జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, నీతిఆయోగ్‌ సాయంతో కలెక్టర్లు జిల్లాస్థాయి ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తారు. దీని అమలుతీరు పర్యవేక్షణకోసం డిజిటల్‌ డ్యాష్‌ బోర్డు, రైతులకోసం యాప్‌, జిల్లా ర్యాంకింగ్‌ వ్యవస్థను అమల్లోకి తెస్తారు.

Read More