ఐఐఎస్‌ఆర్‌ శాస్త్రవేత్తల తయారీ.. హెక్టారుకు 41 టన్నుల దిగుబడి
భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ(ఐఐఎస్‌ఆర్‌) లేత వర్ణం పసుపు రకం ‘సూర్య’ను రూపొందించి బుధవారం విడుదల చేసింది. దేశంలో అధిక పసుపు పండించే రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ, ఒడిశా, ఝార్ఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ లకు ఇది అనుకూలమని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో దీనిని ప్రయోగాత్మకంగా సాగు చేసి విజయవంతం కావడంతో తాజాగా విడుదల చేశారు. భారత్‌లో పండించే పసుపు దేశ, విదేశాల్లో విస్తృతంగా వినియోగంలో ఉంది. ప్రస్తుతం పండే పసుపును వంటలు, తినుబండారాలు, ఔషధ, రసాయనాలు, సౌందర్యసాధనాలకు వాడుతున్నారు. చిక్కటి రంగు కనిపించవద్దనే ఉద్దేశంతో దానిని వాడే సమయంలో ఇతర పదార్థాలను కలుపుతున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొని శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి లేత రంగు పసుపును తయారు చేసి దానికి సూర్య అని పేరు పెట్టారు. పసుపు జెర్మ్‌ ప్లాజమ్‌ కన్జర్వేటరీల నుంచి క్లోనల్‌ ఎంపిక ద్వారా అభివృద్ధి చేశారు. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించారు. పసుపులోని నాణ్యతకు ప్రమాణంగా కొలిచే కుర్క్‌మిన్‌ 2 నుంచి మూడు శాతం ఎక్కువగా ఉంటుంది.

దిగుబడులు అధికం
ప్రస్తుతం సాధారణ రకం హెక్టార్‌కు 29 టన్నుల వరకు పండుతుండగా. సూర్య హెక్టారుకు 41 టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది. దీని పంటకాలం తొమ్మిది నెలలుగా నిర్ధారించారు. ఈ రకం సువాసన ఇవ్వడంతోపాటు మసాలా, పొడులు, ఔషధ, రసాయనాలు, ఫేస్‌ క్రీమ్‌లకు అనుకూలంగా ఉంటుందని, విదేశాలకు భారీగా ఎగుమతి చేసేందుకు అవకాశం ఉందని దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు డి.ప్రసాద్‌, ఆరతి, ఎన్‌.కె. లీల, ముకేశ్‌, శంకర్‌, శశికుమార్‌ తెలిపారు. ఆల్‌ ఇండియా కోఆర్డినేటెడ్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ ఆన్‌ స్పైసెస్‌ ద్వారా దీనిని త్వరలోనే తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు.