తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌, పరిశోధన డైరెక్టర్‌, విస్తరణ సంచాలకుడు, వ్యవసాయ, విద్యార్థుల వ్యవహారాలు, ఇంజినీరింగ్‌, కమ్యూనిటీ సైన్స్లకు డీన్లు, గ్రంథపాలకుడు తదితర పోస్టుల్లో కొత్త అధికారుల నియామకానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. గురువారం ఉపకులపతి అల్దాస్‌ జానయ్య అధ్యక్షతన వర్సిటీలో మండలి సమావేశం జరిగింది. ఇప్పటి వరకు ఈ పోస్టుల్లో ఇన్‌ఛార్జ్‌లు ఉండగా.. ఇకపై మూడేళ్ల పదవీకాలంతో అధికారులను నియమించాలని మండలి నిర్ణయించింది. పాలకమండలి ఇదివరకే ఆమోదించిన అధికారుల జాబితాకు ప్రభుత్వ ఆమోదం తీసుకున్న అనంతరం వీసీ అల్దాస్‌ జానయ్య విడుదల చేశారు. రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ డా. జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌ గారిని నియమించారు.