దేశంలో పెరుగుతున్న జనాభాకు కావాల్సిన ఆహార భద్రతను కల్పిస్తూ… మారుతున్న వాతావరణాలకు అనుగుణంగా పరివర్తన చెందే సామర్థ్యాలను భారత్ వ్యవసాయ రంగం కలిగి ఉందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు సమున్నతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమున్నతి ఎఫ్పీఓ (రైతు ఉత్పత్తుల సంఘం)-2024 సదస్సును మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మన శీతోష్ణస్థితి మార్పులను తట్టుకోగలిగే సాగు కోసం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, సమగ్ర వ్యవసాయ రంగానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాబార్డ్ సీజీఎం భవాని శంకర్ మాట్లాడుతూ… దేశంలో సుస్థిర వ్యవసాయ విధానాలు పాటించేలా చేసేందుకు, భారతీయ వ్యవసాయ క్షేత్రాల నుంచి ప్రపంచ స్థాయి ఉత్పత్తులను విపణిలోకి తీసుకెళ్లడం, సుస్థిర, శీతోష్ణస్థితి అనుకూల ఎఫ్పీఓల నిబంధనలపై నాబార్డ్ పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎన్ఏఎఫ్పీఓ)తో కలిసి సమున్నతి ‘భారత్ ఎఫ్పీఓ ఫైండర్’…. జాతీయ వేదికను ప్రారంభించారు. భారత్ ఎఫ్పీఓ ఫైండర్ సుస్థిర వ్యవసాయానికి ఎంతో తోడ్పడుతుందని సమున్నతి వ్యవస్థాపకుడు, సీఈఓ అనిల్ కుమార్శర్మ, డైరెక్టర్ ప్రవేశ్ శర్మ చెప్పారు.

4 Sep, 2024
