మన తెలంగాణ రాష్ట్రంలో పశువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ పాల ఉత్పత్తి తక్కువగా ఉండటానికి రెండు ముఖ్య కారణాలు కలవు. 1. నాశి రకము 2. పశు గ్రాసాల కొరత. మేలు జాతి పశువులకు సమృద్ధిగా పశుగ్రాసాలను ఇచ్చినపుడు వాటి ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. రాష్ట్రంలో పచ్చిమేతల కొరత తీవ్రంగా ఉంది. మొత్తం సాగు భూమిలో 8% పశుగ్రాసాల సాగుకు వినియోగించాలి.

పశువులకు కేవలం ఎండుగడ్డి దాణా ఇవ్వటం వలన వాటికి కావలసిన పోషక పదార్థాలు దొరకవు. పచ్చి మేతలో ఉండే విటమిన్లు ముఖ్యంగా విటమిన్‌-ఎ పశువుల పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, సక్రమంగా ఎదకు రావడానికి పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది. పచ్చిమేత తినని పశువులలో ఈ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తద్వారా ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది.

పచ్చిమేతలో రెండు రకాలు: 1. కాయజాతి 2. ధాన్యపు జాతి పశుగ్రాసాలు. 

చిరుధాన్యాలు, వివిధ పచ్చగడ్డి రకాలను ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటారు. ధాన్యపు జాతి మేతను పశవులకు ఎక్కువగాను, కాయజాతి మేతను తక్కువగాను మేపాలి. ఈ కాయజాతి, ధాన్యపుజాతి పశువుల మేతను 1:2 నిష్పత్తిలో మేపిన యెడల అవి పశువులకు సమీకృత ఆహారంగా ఉపయోగపడును. ధాన్యపు రకపు  మేతలు పశువులకు శక్తిని, కాయజాతి మేతలు మాంసకృత్తులు అందిస్తాయి. సాధారణంగా రోజుకు ఆవు / గెదెకు 35-45 కిలోల పచ్చిమేత అవసరం.

మంచి పశుగ్రాసము లక్షణాలు:

రుచిగా ఉండాలి. ఎక్కువ మాంసకృత్తులు కలిగి ఉండాలి. తక్కువ కాలంలో కోతకు రావాలి. ఎక్కువ దిగుబడి ఇవ్వాలి. నీటి ఎద్దడిని తట్టుకోవాలి. పంటను ఏ థలో కోసినా రుచిగా ఉండాలి, ఎటువంటి విష పదార్థాలు ఉండకూడదు. తెగుళ్లు తట్టుకొనే శక్తిని కలిగి ఉండాలి.

  • దాణాను రెండు సమభాగాలుగా చేసి ఉదయం, సాయంత్రం పాలు పితికే ముందు వేయాలి.
  • మనం రోజుకు ఇవ్వవలసిన గడ్డిలో సగభాగం ప్రొద్దున నీళ్లు త్రాగించిన తర్వాత మిగతా సగభాగం సాయంత్రం పాలు పితికిన తరువాత అందించవలెను. 

సాధారణ పశువులకు మేత: సాధారణంగా ఆవు / గేదెకి 35-45 కిలోల పచ్చిమేత, 6-7 కిలోల ఎండుగడ్డి 3 కిలోల దాణా అవసరము అవుతుంది.

సంకరజాతి పశువులకు మేత: సంకరజాతి పశువులకు – రోజుకు 6 నుండి 7 లీటర్ల పాలిచ్చే ఆవుకు పాలిచ్చే రోజుల్లో 20-25 కిలోల పచ్చిగడ్డి, 5-6 కిలోల ఎండుగడ్డి, 3-3.5 కిలోల దాణా అవసరం పడుతుంది.

పాడి పశువులకు పుష్కలంగా పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలి. ప్రతి పాడి పశువుకు రోజు 35-45 లీటర్ల నీరు త్రాగటానికి అవసరం అగును. 

పశుగ్రాసంలో ఏకవార్షిక పశుగ్రాసాలు: జొన్న, మొక్కజొన్న, సజ్జ, అలసంద, బర్సీం, లూసర్న్‌

బహువార్షిక పశుగ్రాసాలు: హైబ్రిడ్‌ నేపియర్‌, పారగడ్డి, గినిగడ్డి, అంజన్‌ గడ్డి, స్టైలో హెమాటా, స్టైలో స్కాబ్రా వంటి పశుగ్రాసాలను పచ్చిమేతగా ఉపయోగించవచ్చు.

పశువుల దాణా మిశ్రమం: 100 కిలోల దాణా మిశ్రమాన్ని తయారు చేయడానికి కావలసిన దానా దినుసులు: జొన్నలు, మొక్కజొన్నలు – 30 కిలోలు, గోధుమ పొట్టు లేదా తవుడు – 32 కిలోలు, గానుగ పిండి 25 కిలోలు, బెల్లం మడ్డి – 10 కిలోలు, లవణ మిశ్రమం – 2 కిలోలు అవసరం అవుతువంది.

దాణా మిశ్రమాన్ని రోజుకు 6 నుండి 7 లీటర్ల పాలిచ్చే ఆవుకు 3-3.5 కిలోలు.

రోజుకి 6 నుండి 10 లీటర్ల పాలిచ్చే ఆవుకు 4-4.5 కిలోల దాణాను అందించినట్లయితే పాల దిగుబడి పెరుగుతుంది.

డా. కె. చిరంజీవి, డా. మహమ్మద్‌ అలిబాబా, డా. ఎం. గోవర్థన్‌, అన్‌ ఫామ్‌ రీసెర్చ్‌ సెంటర్‌, రంగారెడ్డి, అఖిల భారత సమగ్ర వ్యవసాయ పద్ధతుల పరిశోధనా విభాగం, రాజేంద్రనగర్‌.