సమీకృత సీతమ్మసాగర్‌, సీతారామ ఎత్తిపోతల పథకాలకు కేంద్ర జలసంఘం నుంచి సాంకేతిక అనుమతి లభించింది. ఫలితంగా గోదావరి జలాల సమర్థ వినియోగానికి నిర్మిస్తున్న ఈ పథకాలకు అడ్డంకులు తొలగడంతోపాటు వేగంగా పూర్తి చేయడానికి అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడానికి ముందడుగు పడింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన జలసంఘం సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) సమావేశంలో ఈ పథకాలకు ఆమోదముద్ర పడింది. ఈ భేటీలో కేంద్ర జలసంఘం చైర్మన్‌(సీడబ్ల్యూసీ) అధ్యకక్షుడు ముఖేష్‌ కుమార్‌ సినా, తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్సీ(జనరల్‌) అనిల్‌ కుమార్‌, కొత్తగూడెం ఎస్‌ఈ శ్రీనివాస రెడ్డి, అంతర్‌ రాష్ట్ర జలవనరుల విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్రమణ్య ప్రసాద్‌ పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన రాజీవ్‌, ఇందిరాసాగర్‌ ఎత్తిపోతల పథకాలను… తెలంగాణ ఏర్పడిన తర్వాత రద్దు చేసి, సీతారామ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. గోదావరిలోని 67.05 టీఎంసీల నీటి వినియోగంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త ఆయకట్టుకు నీరందించడంతోపాటు నాగార్జునసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణ కూడా లక్ష్యంగా చేసుకున్నారు. సీడబ్ల్యూసీ తాజాగా ఆమోదించిన ప్రకారం 7.87 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతోపాటు దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద 36.5 టీఎంసీల సామర్ధ్యంతో సీతమ్మసాగర్‌ ఆనకట్ట నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. దీని అనుమతుల సమయంలోనే సీతారామ ఎత్తిపోతల, సీతమ్మసాగర్‌ను కలిపి ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్టుగా డీపీఆర్‌ తయారుచేయాలని సీడబ్ల్యూసీ సూచించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ సిద్ధం చేసి, జలసంఘానికి పంపింది. దీన్ని సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు డీపీఆర్‌ను అధ్యయనం చేసి, అనుమానాలను లేవనెత్తగా… నీటిపారుదల శాఖ అధికారులు పరిష్కరిస్తూ వచ్చారు. అదేసమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జలశక్తి మంత్రిని కలిసి అనుమతుల కోసం వినతిపత్రం సమర్పించారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సైతం నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, సలహాదారు ఆదిత్యనాధ్‌ దాస్‌తో కలిసి పలుదఫాలు దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని, అధికారులతో పలుదఫాలు చర్చించారు. మార్చిలో జరిగిన టీఏసీ సమావేశంలోనే డీపీఆర్‌కు ఆమోదం లభించాల్సి ఉన్నా… మేడిగడ్డ బ్యారేజి సంఘటన నేపథ్యంలో సీతమ్మసాగర్‌ డిజైన్లను జలసంఘం పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామంటూ టీఏసీ చైర్మన్‌, జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ వాయిదా వేశారు. దాంతో కొత్తగూడెం చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీనివాసరెడ్డి, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) ఇంజినీర్లు దిల్లీకి వెళ్లి జలసంఘం ఇంజినీర్లు అడిగిన వివరాలను సమర్పించిన తర్వాత సీతమ్మసాగర్‌ డిజైన్‌కు ఆమోదం లభించింది. గురువారం జరిగిన సమావేశంలో దీనిపై చర్చించిన తర్వాత సాంకేతిక అనుమతి ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్లు కేంద్ర కార్యదర్శి ప్రకటించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి రావడంతోపాటు ఎన్జీటీలో ఉన్న కేసు కూడా పరిష్కారమైన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌కు వెళ్లనుంది. ఈ అనుమతి వస్తే కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందడానికి అవకాశం ఉంటుంది. సీతారామ, సీతమ్మసాగర్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్టుకు కేంద్రజల సంఘం టీఎసీ అనుమతి రావడంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతిలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతోషం వ్యక్తంచేశారు.