ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతులు అడిగిందే తడవుగా సూక్ష్మ సేద్య పథకం మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు తన వాటా సొమ్మును చెల్లించిన వెంటనే రైతు పొలంలో సూక్ష్మసేద్య పరికరాలను బిగించేలా కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో సూక్ష్మసేద్య పథకంపై దృష్టి పెట్టింది. అవసరమున్న ప్రతి రైతుకూ ఈ పథకాన్ని వర్తింపచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 7 లక్షల 50 వేల ఎకరాలకు సూక్ష్మ సేద్య పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. సూక్ష్మసేద్య పరికరాలు సమకూర్చేందుకు 33 కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు ఇటీవల సమావేశమయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు.