2021-22 సంవత్సరంలో భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 50 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటాయని అంచనాలు వెలువడుతున్నాయి. 2021 ఏప్రిల్‌ నుండి నవంబరు వరకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 31.05 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయనీ, గత సంవత్సరం ఇదే కాలంలో జరిగిన ఎగుమతులతో పోలిస్తే 23.21 శాతం ఎక్కువనీ అధికారికంగా ప్రకటించారు. మిగిలిన నాలుగు నెలల్లో మరో 19 బిలియన్‌ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు జరగవచ్చని ఆశిస్తున్నారు. 2020-21 సంవత్సరంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 41.25 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ సంవత్సరం చివరి వరకు 20 శాతం వృద్ధి కొనసాగితే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 50 బిలియన్‌ డాలర్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తున్నది. 2017-18, 2018-19 సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 38 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండగా, 2019-20లో అవి 35.16 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 2020-21 సంవత్సరంలో కరోనా ప్రభావం ఉన్నా వ్యవసాయ ఎగుమతులు 17.34 శాతం వృద్ధిని సాధించాయి. 2021-22లో వ్యవసాయ ఎగుమతుల వృద్ధి మరింత వేగం పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.


తొమ్మిదో స్థానంలో భారత్‌
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో 2019లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు 118.3 బిలియన్‌ డాలర్ల ఆర్జనతో అగ్రస్థానంలో నిలిచింది. పువ్వులు, మొక్కల వంటి అధిక విలువ కలిగిన ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆధిక్యం కలిగిన నెదర్లాండ్స్‌ 79 బిలియన్‌ డాలర్లు ఆర్జించి ద్వితీయ స్థానంలో ఉంది. జర్మనీ (70.8 బిలియన్‌ డాలర్లు), ఫ్రాన్స్‌ (68 బిలియన్‌ డాలర్లు), బ్రెజిల్‌ (55.4 బిలియన్‌ డాలర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చైనా, మెక్సికో, మలేషియాల తర్వాత భారత్‌ తొమ్మిదో స్థానంలో నిలిచినట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం భారత్‌ తన స్థానాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో యూరోపియన్‌ యూనియన్‌ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో 16.1 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, అమెరికా 13.8 శాతం వాటాతోనూ, బ్రెజిల్‌ 7.8 శాతం వాటాతోనూ, చైనా 5.4 శాతం వాటాతోనూ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.


2019లో భారతదేశపు వాటా 3.1 శాతంగా ఉంది. 2020-21లో అది 3.6 శాతానికి పెరిగినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడినప్పుడు భారతదేశపు వాటా 1.5 శాతం మాత్రమే. గత 25 సంవత్సరాల్లో ఈ వాటా రెట్టింపైంది. ప్రపంచ జనాభాలో ఆరవవంతు ప్రజలు కలిగి, వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయమైన వాటా కలిగిన భారతదేశపు వాటా మరింత పెరగాల్సిన అవసరం ఉంది. 2021-22 సంవత్సరంలో భారతదేశం 21 మిలియన్‌ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసి ప్రథమ స్థానంలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యలు, పీతలు వంటి ఉత్పత్తుల ఎగుమతులు 8 బిలియన్‌ డాలర్ల విలువను అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి. సోయాచిక్కుడు, మొక్కజొన్న, గోధుమల ఎగుమతుల్లో అమెరికాకు, పామాయిల్‌ ఎగుమతిలో ఇండోనేషియాకు అగ్రస్థానం ఉన్నట్లుగా బియ్యం ఎగుమతుల్లో ప్రథమ స్థానాన్ని, చేపల ఎగుమతిలో ద్వితీయ స్థానాన్ని, పత్తి ఎగుమతుల్లో మూడవ స్థానాన్ని సాధించటం గర్వకారణం. పశుమాంసం, పంచదార, నూనె తీసిన చెక్క, ఆముదం, వేరుశనగ, తాజాపండ్లు, తాజా కూరగాయలు, ప్రాసెస్‌ చేసిన పండ్ల రసాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారం మొదలైన ఇతర ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా ఉన్నాయి. వ్యవసాయ ఎగుమతుల్లాగానే వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల్లో కూడా మంచి వృద్ధి కనిపిస్తుంది. గత 15 సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు ఏడు రెట్లు పెరగ్గా, దిగుమతులు ఎనిమిదిరెట్లు పెరిగాయి. దిగుమతుల్లో వంటనూనెలు 54 శాతం ఆక్రమించగా, తాజా పండ్లు, అపరాలు, జీడిపప్పు, సుగంధ ద్రవ్యాలు కలిపి మరో 26 శాతం విలువ కలిగి ఉన్నాయి. అయినా 2019-20లో వ్యవసాయ ఎగుమతుల ద్వారా 2.52 లక్షల కోట్ల రూపాయలను ఆర్జించగా, దిగుమతుల ద్వారా 1.47 లక్షల కోట్లు ఖర్చయ్యాయి. 2019-20లో 1.05 లక్షల కోట్ల రూపాయల వ్యాపార మిగులుండగా, 2020-21లో అది 1.33 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. మొత్తం దేశంలో ఉత్పత్తయిన వ్యవసాయ ఉత్పత్తుల విలువలో ఎనిమిది శాతంగానూ, నికర వ్యాపార మిగులు నాలుగు శాతంగానూ ఉన్నాయి. వ్యవసాయ ఎగుమతులు దిగుమతులకన్నా ఎక్కువగా ఉండి, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ప్రతి సంవత్సరం వ్యాపార మిగులుని కలిగి ఉండటం అభినందనీయం.


మొత్తం ఎగుమతుల్లో తగ్గుతున్న వాటా
2000-01 సంవత్సరం నాటికి మొత్తం దేశపు ఎగుమతుల విలువలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 20 శాతంగా ఉండేది. 2019-20లో అది 11 శాతానికి తగ్గింది. మొత్తం దేశపు ఎగుమతులు 2019-20లో 313.3 బిలియన్‌ డాలర్లుండగా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 35.16 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అయితే కరోనా ప్రభావంతో దేశపు మొత్తం ఎగుమతుల విలువ 2020-21లో ఏడు శాతం తగ్గి, 291.8 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. కరోనా ప్రభావం వల్ల అనేక దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గి, కొరత ఏర్పడింది. కాని భారతదేశంలో కరోనా కాలంలో కూడా వ్యవసాయ ఉత్పత్తులు పెరగటం వల్ల ఎగుమతుల ద్వారా 41.25 బిలియన్‌ డాలర్లుని ఆర్జించగలిగాము. వ్యవసాయ ఉత్పత్తుల విలువ మొత్తం దేశపు ఎగుమతుల్లో 14 శాతంగా ఉంది. 2020-21లో మొత్తం వ్యాపారలోటు 72.01 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా తగ్గినా కూడా వ్యాపార లోటు దాదాపు 20 శాతంగా ఉంది. 2021-22 లో ముడి చమురు ధరలు భారీగా పెరగటం వల్ల ఈ సంవత్సరం వ్యాపారలోటు దాదాపు 35 శాతానికి చేరుకోవచ్చు. వ్యవసాయ వాణిజ్యంలో మిగులు పెరగటం వల్ల దేశపు వ్యాపారలోటుని కొంతవరకు పూడ్చగలుగుతున్నది.


భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రధాన మార్కెట్లుగా అమెరికా, చైనా, బంగ్లాదేశ్‌, యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌, వియత్నాం, సౌదీఅరేబియా, ఇండోనేషియా, నేపాల్‌, ఇరాన్‌, మలేషియాలు ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఇండోనేషియా మార్కెట్లో రెట్టింపయ్యాయి. బంగ్లాదేశ్‌కు జరిగిన ఎగుమతుల్లో 96 శాతం, నేపాల్‌కు జరిగిన ఎగుమతుల్లో 57 శాతం వృద్ధి నమోదైంది. సేంద్రియ ఆహార ఎగుమతులు 51 శాతం పెరిగి, 1.04 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. యూరోప్‌కు చేస్తున్న బాస్మతీ బియ్యం ఎగుమతులు మాత్రం పురుగుమందుల అవశేషాల కారణంగా దెబ్బతిన్నాయి. యూరోపియన్‌ దేశాలు పురుగుమందుల అవశేషాల విషయంలో కఠిన నిబంధనలను విధించడం వల్ల బాస్మతీ ఎగుమతిదారులు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇందుకోసం పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రసాయనిక పురుగు మందుల వాడకాన్ని నిషేధించింది. పురుగు మందులు, శిలీంద్రనాశకాల వాడకాన్ని తగ్గించగలిగితే మన వ్యవసాయ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది.


ఎగుమతి ప్రోత్సాహకాలు
భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరగటానికి భారత ప్రభుత్వం కొంతమేరకు ప్రోత్సాహకాలను అందిస్తున్నది. మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులను అనేక దేశాలకు ఎగుమతి చేయడానికి, అధిక విలువ కలిగిన, విలువ జోడించిన ఉత్పత్తుల వాణిజ్యానికి ప్రాధాన్యమిస్తున్నది. ప్రపంచవాణిజ్యంలో భారత వాటాను రెట్టింపు చేయాలనే దీర్ఘకాల లక్ష్యంతో ఎగుమతిదారులు ఎదుర్కుంటున్న వ్యాపార అడ్డంకులను అధిగమించటానికి, వివిధ దేశాలు పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలను చేరుకోవటానికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నది. కొత్తగా ఎగుమతి కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఎగుమతిదారులకు అవసరమైన ధృవపత్రాలను ఆన్‌-లైన్‌ పద్ధతిలో అందించటం, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించటానికి కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేయడం, ధృవపత్రాల కాలపరిమితి ముగుస్తున్నప్పుడు వాటిని పునరుద్ధరించడం వంటి చర్యలు ఎగుమతిదారులకు సాయపడుతున్నాయి. అనేక వ్యవసాయ ఉత్పత్తులకు, ముఖ్యంగా త్వరగా పాడయ్యే ఉత్పత్తులకు రవాణా సబ్సిడీని, మార్కెటింగ్‌ సహకారాన్ని అందిస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, ప్రాసెసింగ్‌ అభివృద్ధి అథారిటీ (ఏపిఇడిఏ), సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (ఎంపిఇడిఏ), టొబాకో బోర్డు, కాఫీ బోర్డు, టీ బోర్డు, సుగంధద్రవ్యాల బోర్డు, రబ్బర్‌ బోర్డు వంటి సంస్థల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి, ఎగుమతులకు ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ట్రిబ్యునళ్ళు, కోర్టుల్లో భారత్‌కు వ్యతిరేకంగా ఇతర దేశాలు పలు ఫిర్యాదులు చేస్తున్నాయి. పంచదార ఎగుమతులకు భారత ప్రభుత్వం సబ్సిడీలను ఇస్తున్నదనే ఫిర్యాదుపై ఇటీవల భారత్‌కు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ కోర్టు ఆదేశాలనిచ్చింది. దానిపై మనదేశం వేసిన అప్పీలు విచారణలో ఉన్నది. ఇలాగే ఇతర దేశాలు అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన పలు ఫిర్యాదులు విచారణలో ఉన్నాయి. వ్యాపార పరంగా ఉన్న చిక్కులు కారణంగా 1994 తర్వాత మరో వ్యాపార ఒప్పందానికి ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాల ఆమోదాన్ని సంపాదించలేకపోతున్నది.


దేశంలో పెరుగుతున్న వైరుధ్యాలు
దేశంలో ధనికులు, పేదల మధ్య ఆదాయ పరంగానూ, సంపద పరంగానూ వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. 1991లో ప్రారంభమైన ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలు ఈ వ్యత్యాసాలు పెరగటానికి కారణమయ్యాయి. గత రెండేళ్ళుగా కరోనా ప్రభావంతో అధిక సంఖ్యాకులు ఉపాధిని, జీవనాధారాన్ని కోల్పోగా, ధనికుల సంపద మాత్రం విపరీతంగా పెరిగింది. వరుసగా మూడేళ్ళపాటు వాతావరణం అనుకూలించడంతో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. ఆ ప్రభావం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై కూడా పడింది. కాని వ్యవసాయదారుల ఆదాయాలు పెరగలేదు. వ్యవసాయరంగానికీ, ఇతర రంగాలకు మధ్య వ్యాపార తులనాత్మకత దెబ్బతిన్నది. ధరల వ్యవస్థ రైతులకు వ్యతిరేకంగా మారి, అధికోత్పత్తి, ఎగుమతుల పెరుగుదల వల్ల కలిగే ప్రయోజనాలు దోపిడీకి గురయ్యాయి. ఒకవైపు ఆహార భద్రతా సూచీలో భారత్‌ ఇతర దక్షిణాసియా దేశాల కన్నా వెనకబడి ఉందని అంతర్జాతీయ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు గోదాములు ఆహార ధాన్యాలతో నిండి, ఎగుమతులు పెరుగుతున్నాయి. 9 శాతం నిరుద్యోగంతో ఉపాధి లేని పెరుగుదల ఒక సమస్యగా నిలిచింది. రైతులకు ప్రయోజనం చేకూర్చని వ్యవసాయోత్పత్తుల పెరుగుదల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నది. ఆదాయ పంపిణీలో తీవ్రమౌతున్న అసమానతలు విధాన లోపాలను ఎత్తి చూపుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో వృద్ధినీ, ఎగుమతుల్లో పెరుగుదలను రైతులకు ప్రయోజనకరంగా మార్చటం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సమస్య!


డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
(రిటైర్డ్‌ & కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌), ఫోన్‌: 83098 59517, 70328 11608