నాగార్జున సాగర్‌, కృష్ణాడెల్టా కాలువలకు ఖరీఫ్‌ పంట సాగుకు అవసరమైన నీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సమృద్ధిగా నీళ్లు వస్తున్నందున నారుమళ్లు వేసుకోవాలని మంత్రి రైతులకు సూచించారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ ఇప్పటికే నిండింది. మరో రెండు మూడు రోజులలో నాగార్జున సాగర్‌ కూడా నిండుతుంది. చివరి ఆయకట్టుకు నీళ్లు అందేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, సాగర్‌ కాలువల కింద ఉన్న జలాశయాలు, చెరువులు అన్నింటినీ నీటితో నింపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.