ప్రారంభించిన మంత్రి టీజీ భరత్‌ ఆహారశుద్ధి రంగంలో ఐదేళ్లలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించామని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. ఈ రంగంలో యూనిట్ల ఏర్పాటుకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మంగళగిరిలోని ఆటోనగర్‌ (పీవీఎస్‌ ల్యాండ్‌మార్క్‌)లో ఆహారశుద్ధి సొసైటీ, ఆంధ్రప్రదేశ్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ (ఏపీటీపీసీ) కార్యాలయాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జా బాబూరావు, ఆహారశుద్ధి శాఖ ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆహారశుద్ధి సొసైటీ ఎండీ శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.