మన ప్రధాన వృత్తి వ్యవసాయం. ఒకప్పుడు 90 శాతానికి పైగా, ప్రస్తుతం 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంత ఎక్కువమంది ఆధారపడుతున్న వ్యవసాయరంగం పరిస్థితి బాగానే ఉంది. కాని ఆ వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి బాగా లేదు అని చెప్పవచ్చు. స్వేదం చిందించి సేద్యం చేసి పంటలు పండించి మన ఆకలి తీర్చే రైతులలో 90 శాతానికి పైగా రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టే మనం ప్రతినిత్యం అన్నదాతల ఆత్మహత్యల గురించి వింటున్నాము. ఈ పరిస్థితులు మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలో రైతు వర్గం చాలా పెద్ద వర్గం కాబట్టి అంత పెద్ద వర్గాన్ని ఆదుకునే సత్తా ప్రభుత్వానికి కాని వేరే సంస్థలకు కాని లేదు అనే విషయం అక్షర సత్యం. కాబట్టి రైతులే ఎవరికి వారు తమ పంటల సాగును లాభాల బాట పట్టించటానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. లాభసాటి పంటల సాగుకు సంబంధించిన ఆలోచనలు రైతులందరూ చేయలేకపోయినా కాని కొంతమంది అభ్యుదయ రైతులు తమ మెదడుకు పదను పెడతూ అనునిత్యం లాభసాటి వ్యవసాయం గురించి ఆలోచిస్తూ తమకు వచ్చిన ఆలోచనలను అమలు పరుస్తూ ముందుకు నడుస్తూ వచ్చిన ఫలితాలను తోటి రైతులకు తెలియ చేస్తుంటారు. ఈ కోవకే చెందుతాడు యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలం వంచెగూడెం గ్రామంలో సమీకృత వ్యవసాయం చేస్తున్న ఫణికుమార్‌.

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా, మాచర్ల ప్రాంతానికి చెందిన ఫణికుమార్‌ది వ్యవసాయ నేపథ్యం. చిన్నతనం నుండి పంటల సాగులో తన కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటాడు. వ్యవసాయంలో తన వంతు పాత్రను పోషించేవాడు. ఉన్నత చదువులు చదివిన ఫణికుమార్‌ తన చదువు పూర్తి కాగానే హైదరాబాదు నగరం రావడం, వివిధ కార్యక్రమాలు చేపట్టడం లాంటివి చేసి తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలం, వంచెగూడెం గ్రామంలో వంద ఎకరాలకు పైగా భూమిని కౌలుకు తీసుకొని సమీకృత వ్యవసాయం చేస్తున్నాడు. 125 ఎకరాలకు పైగా భూమిలో సూపర్‌ నేపియర్‌ పశుగ్రాసాన్ని సాగు చేస్తూ నాణ్యమయిన పశుగ్రాసాన్ని గోశాలలకు అమ్మకం చేస్తున్నాడు. సూపర్‌ నేపియర్‌ సాగుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని గత సంచిక (రైతునేస్తం మార్చి నెల సంచిక)లో విపులంగా వివరించడం జరిగింది. ఫణికుమార్‌ సాగు చేస్తున్న సమీకృత వ్యవసాయంలో భాగంగా నారిసువర్ణ జాతి గొర్రెల పెంపకం, సోనాలి రకం కోళ్ళ పెంపకం మరియు బయోటాయిలెట్‌లలో ఉపయోగించే బాక్టీరియాల గురించిన సమాచారాన్ని ఈ సంచికలో వివరిస్తున్నాము.

నారి సువర్ణ జాతి గొర్రెల పెంపకం

అనునిత్యం అన్ని రంగాలలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలో జరిగే మార్పులు కొద్దిగా నిదానంగా జరుగుతాయి అనే విషయం అందరికి తెలిసిందే. గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలో కూడా మార్పులు రావడములో కొంచెం వేగం పెరిగిందని చెప్పవచ్చు. రైతులకు లాభాలు ఆర్జించి పెట్టే వ్యవసాయ అనుబంధరంగాలలో గొర్రెల పెంపకం మొదటి వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. గొర్రెల పెంపకం అనేది చాలా వరకు కులవృత్తిగా కొనసాగుతూ వస్తుంది. ఇటీవలకాలంలో మిగతా వర్గాల వారు కూడా గొర్రెల పెంపకంలో అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు.

ప్రభుత్వం కూడా గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. కాని గొర్రెలలో వచ్చే వివిధ రకాల ఆనారోగ్య సమస్యలు మరియు ఇతర సమస్యల వలన గొర్రెలు పెంపకం చేసే రైతులందరూ లాభాలను ఆర్జించలేక పోతున్నారు. ఈ సమస్యలకు సరైన పరిష్కారం కొరకు అందుకు సంబంధించిన ప్రభుత్వ సంస్థలు పరిశోధనలు చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఆ బాటలో నడిచిన మహారాష్ట్రకు చెందిన నింబాకర్‌ యూనివర్సిటీ వారు 30 సంవత్సరాల నుంచి పరిశోధనలు చేసి నారి సువర్ణ రకం గొర్రె జాతిని అభివృద్ధి చేశారు. నారి సువర్ణ జాతి గొర్రెలు అన్ని రకాల వాతావరణాలకు మరియు కరువును తట్టుకోగలవు అని శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకున్న ఫణికుమార్‌ 8 ఆడగొర్రెలను, 4 మగ గొర్రెలను కొనుగోలు చేసుకుని పోషిస్తున్నాడు. వీటికి సంబంధించిన లాభనష్టాలు తెలుసుకోవాలంటే 2024 డిసెంబర్‌ వరకు వేచి ఉండవలసిందే అని ఫణికుమార్‌ అంటున్నాడు. వీటికి పశుగ్రాసంగా సూపర్‌ నేపియర్‌, థరథగడ్డి, జనుము, మొక్కజొన్న, జొన్న లాంటి మేతలను అందిస్తూ దాణాను కూడా అందిస్తున్నాడు. తమ పొలంలో పగలు మొత్తం తిరుగుతూ అందుబాటులో ఉన్న పచ్చిగడ్డిని తింటూ తిరుగుతుంటాయి కాబట్టి శారీరకంగా దృఢంగా ఉంటున్నాయి. ఈ జాతిని అభివృద్ధి పరచి మన స్థానిక జాతులతో సంపర్కం చేసి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉండే జాతి గొర్రెలను భారీ మొత్తంలో పెంపకం చేయాలనే లక్ష్యంతో ఫణికుమార్‌ ముందుకు సాగుతున్నాడు.

సొనాలి జాతి నాటు కోళ్ళ పెంపకం

కొంచెం అటూఇటుగా వ్యవసాయ అనుబంధరంగం అయిన కోళ్ళ రంగంలో కూడా అనేక మార్పులు సంభవించాయి. ఇంకా సంభవిస్తూనే ఉన్నాయి. మనం పూర్వం నుంచి పెంపకం చేస్తూ వస్తున్న నాటు కోళ్ళను వివిధ రకాలుగా అభివృద్ధి చేసి ఎక్కువ గ్రుడ్లను అందివ్వడంతో పాటు త్వరగా బరువు పెరిగే జాతులను అభివృద్ధి చేశారు. అభివృద్ధి పరచిన వివిధ రకాల నాటుకోళ్ళ జాతులలో సోనాలి రకంకు ఉన్న విశిష్టత వలన ఫణికుమార్‌ గారు సొనాలి రకం నాటుకోళ్ళను కూడా పెంపకం చేస్తున్నాడు.

ఇందుకు గాను ఒకరోజు వయస్సు ఉన్న పిల్లలను కొనుగోలు చేసుకుని పోషిస్తూ వస్తున్నాడు. మొదట బ్యాచ్‌లో 3000 పిల్లలను కొనుగోలు చేసుకొని 2023 నవంబరు నుంచి బహిరంగంగా తిరుగుతూ పెరుగుతున్నాయి. పొలంలో అందుబాటులో ఉండే చీడపీడలను, పురుగులను, గడ్డిని తినడముతో పాటు అన్ని రకాల గడ్డి మొక్కలను, గడ్డి ముక్కలతో పాటు దాణాను అందిస్తూన్నారు. జనవరి నుండి అమ్మకం మొదలు పెట్టాడు. బరువుతో సంబంధం లేకుండా కోడి 350/-ల చొప్పున ఇప్పటి వరకు 2500 కోళ్లను అమ్మకం చేశారు. వారు కొనుగోలు చేసేటప్పుడు పుంజులు, పెట్టలు రెండు కలిపి కొనుగోలు చేశారు. జాతిని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ విధంగా మగవి, ఆడవి కలిపి కొనుగోలు చేయడం జరిగింది. సొనాలి జాతి కోడి పెట్టలు సంవత్సరానికి 200 వరకు గ్రుడ్లను పెడతాయి. మొదటగా పెట్టిన గ్రుడ్లు చిన్నవిగా ఉంటాయి. కాబట్టి వాటిని అమ్మకం చేస్తూ వస్తున్నాడు. పెద్ద సైజు గ్రుడ్లు పెట్టిన తరువాత వాటిని సహజ సిద్ధంగా పొదిగించటానికి సిద్ధం అవుతున్నాడు. వీరికున్న నాలుగు నెలల సొనాలి జాతి కోళ్ళ పెంపకం అనుభవంలో రోగాల వలన ఒక్క కోడి కూడా మరణించలేదు. కోళ్లకు అవసరమైన టీకాలను సమయానుకూలంగా అందిస్తూ వచ్చారు. వీటిని పొలంలో సహజసిద్ధంగా పెంపకం చేస్తున్నారు కాబట్టి రోగాలు ఆశించే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఫణికుమార్‌ వివరిస్తున్నాడు.

బయోటాయిలెట్స్‌లో ఉపయోగించే బాక్టీరియా తయారీ

గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే గ్రామాలలో చాలావరకు ఇళ్ళలో టాయిలెట్స్‌ ఉండేవి కావు. కాబట్టి బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన జరిగేది. ఆ సమయం పందులు స్వచ్ఛభారత్‌ కార్యకర్తల పాత్రను పోషించేవి. ఆ తరువాత ఇళ్ళలో టాయిలెట్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. టాంక్‌ నిండగానే ఖాళీ చేయవలసి వస్తుంది. అదేవిధంగా రైళ్ళలో కూడా మలవిసర్జన చేసినపుడు అన్ని ప్రాంతాలు అశుద్ధంగా ఉండేవి.

ఈ సమస్యల పరిష్కారానికి మలమునే ఆహారంగా తినగలిగే బాక్టీరియాను డిఆర్‌డిఓ వాళ్లు అభివృద్ధి పరచి మదర్‌ కల్చర్‌ను లైసెన్స్‌ ఉన్న సంస్థలకు సరఫరా చేస్తుండడము తెలుసుకున్న ఫణికుమార్‌ ఇందుకు సంబంధించిన లైసెన్స్‌ను పొంది బ్యాక్టీరియాను అభివృద్ధి పరచే యూనిట్‌ను ఆలేరు సమీపంలో ప్రారంభించారు. డిఆర్‌డిఓ వారు అందించు మదర్‌ కల్చర్‌కు ఆవుపేడను ఆహారంగా అందిస్తూ బయోటాయలెట్స్‌లో ఉపయోగించే బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వేలకు మరియు కొంతమందికి సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో అందరూ బయో టాయలెట్స్‌ను నిర్మించుకోవలసిన అవసరం పడుతుంది కాబట్టి ఇలాంటి యూనిట్లు అనేకం ప్రారంభించవలసిన అవసరం ఉందని ఫణికుమార్‌ అంటున్నాడు.

వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను ఆదరించడముతో పాటు సాగులో పెట్టుబడులు తగ్గించుకుంటూ, కొత్త పంటల సాగువైపు అడుగులు వేస్తూ, సొంత మార్కెటింగ్‌ చేసుకొంటే పంటల సాగు లాభసాటి కాగలదని ఫణికుమార్‌ ప్రత్యక్షంగా నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9866469096 కి ఫోను చేసి తెలుసుకోగలరు.    

గొర్రెలలో మగవాటిని, ఆడవాటిని విడివిడిగా ఉంచాలి

గొర్రెల పెంపకంలో రైతులు ఎదుర్కొనే సమస్యలలో రోగాల వలన గొర్రెలు చనిపోవడం అనేది అతిపెద్ద సమస్య. గొర్రెల పెంపకందారులందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మనుషులతో సహా ఏ జీవి అయినా ఆరోగ్యంగా ఎదగాలంటే రోగనిరోధక శక్తి అతిముఖ్యం. ఈ విషయం కరోనా తరువాత అందరికీ తెలిసి వచ్చింది. రోగనిరోధక శక్తి బాగా ఉన్న వారిని కరోనా ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు. రోగనిరోధక శక్తి సక్రమంగా లేని వారిని మాత్రం కరోనా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందనే విషయం అందరికి తెలిసిందే. ఈ విషయాన్ని కక్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే రోగనిరోధక శక్తి యొక్క ప్రాముఖ్యత అర్థం అవుతుంది. గొర్రెల విషయానికొస్తే రోగాల వలన గొర్రెలు చనిపోవడము అనేది మనం ప్రతినిత్యం వింటున్న సమస్య. రోగనిరోధక శక్తి సక్రమంగా లేకపోవటము వలన చిన్న చిన్న రోగాలను తట్టుకోలేని గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. రోగనిరోధక శక్తి పెరగాలంటే డెలివరి అయిన తరువాత ఆడ గొర్రెలకు కొన్ని నెలలు విశ్రాంతిని ఇవ్వాలి. ఆ విశ్రాంతి సమయంలో ఆడగొర్రెలలోని అన్ని అవయవాలు తిరిగి శక్తిని పుంజుకుంటాయి. కాని ప్రస్తుతం గొర్రెల మందలు పరిశీలించినట్లయితే డెలివరి అయిన వెంటనే గొర్రెలను మందలలో తోలుతుంటారు. ఆ మందలో మగ గొర్రెలు కూడా ఉంటాయి కాబట్టి వాటికి ఉన్న పశుప్రవృత్తి వలన మగ, ఆడ గొర్రెల మధ్య సంపర్కం జరిగి ఆడ గొర్రెలకు అవసరమయిన విశ్రాంతి లేకుండానే మరలా గర్భం దాల్చుతుంటాయి. ఆవిధంగా గర్భం దాల్చడం వలన జన్మించిన గొర్రె పిల్లలలో రోగనిరోధక శక్తి సక్రమంగా ఉండదు కాబట్టి అలాంటి గొర్రెపిల్లలు త్వరగా రోగాల బారిన పడటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆడ గొర్రెలను, మగగొర్రెలను విడివిడిగా పోషించడమే ఈ సమస్యకు సరైన పరిష్కారం అంటున్నాడు ఫణికుమార్‌. అందుకనే వీరు మగ గొర్రెలను, ఆడ గొర్రెలను విడివిడిగా పెంచుతున్నారు.