మనది వ్యవసాయక దేశం. మన తాతలు చేసింది నిజమయిన వ్యవసాయం. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికి వ్యవసాయంలో సరైన దారి చూపింది మన పూర్వీకులే అని చెప్పవచ్చు. ప్రపంచంలోని ఏదేశములో పాడి-పంటకు అనుబంధం ఉండదు. ఒక భారతదేశంలోనే పాడికి పంటకు అనుబంధం ఉంటుంది. అందుకే మన పూర్వీకులు పాడి-పంట అంటుండేవారు. అంటే పాడి లేకుండా పంట, పంట లేకుండా పాడి ఉండవు… ఉండకూడదు. ఈ రెండూకూడా విడదీయరాని… విడదీయకూడని అంశాలు. దానిని గమనించి తప్పనిసరిగా ఒక ఎకరానికి ఒక గేదె చొప్పున పోషించగలగాలి. 

దానినే వ్యవసాయం అంటారు. 

లేకుంటే … అంటే పాడి లేకుండా పంటలు పండించే దానిని వ్యవసాయం అనరు. అనకూడదు అంటున్నారు ఏలూరు జిల్లా కొత్తగూడెంకు చెందిన గద్దె సతీష్‌బాబు.

సతీష్‌బాబుది వ్యవసాయ నేపథ్యం. వారి పూర్వీకుల నుంచి వ్యవసాయమే వృత్తిగా కొనసాగుతూ వచ్చారు. వ్యవసాయం అంటే ఒక్క పంటల సాగే కాదు. పాడి పశువులను కూడా పోషిస్తూ పంటల సాగు చేస్తూ వస్తున్నారు. వారి నిర్వచనం ప్రకారం వ్యవసాయం అంటే పంటల సాగు మరియు పశుపోషణ. రెండింటిని కలిపితేనే వ్యవసాయం అని బల్లగుద్దినట్లు చెబుతారు. కానీ కొందరు ఈ నిర్వచనాన్ని మార్చి పశవులను వ్యవసాయం నుంచి వేరు చేసి విడిగా చూస్తున్నారు. అందుకే నిర్వచనం మార్చుకున్న ప్రస్తుత రైతులు తగిన ఫలితాలను పొందలేకపోతున్నారు అంటున్నారు సతీష్‌బాబు. ఉన్నత చదువులు చదివిన సతీష్‌బాబు వ్యవసాయమే సరయిన దారి అని నమ్మి తమ పూర్వీకుల నుంచి వచ్చిన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.

వీరికి మొత్తం 50 ఎకరాల సాగు భూమి ఉంది. భూమితో పాటు 50 వరకు గేదెలను పోషిస్తున్నారు. ఈ 50 ఎకరాలలో కొబ్బరి, వరి, మొక్కజొన్న పైర్లను మాత్రమే ప్రతి సంవత్సరం సాగు చేస్తుంటారు. కొబ్బరిని బోండాల గురించి సాగు చేస్తూ దూర ప్రాంతాల కొనుగోలుదారులకు కొబ్బరి బోండాలను అమ్మకం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం బిపిటి 5204 రకాన్ని సాగు చేస్తూ ఎకరానికి 20 నుంచి 23 బస్తాల దిగుబడి పొందుతూ వచ్చిన దిగుబడి మర పట్టించి బియ్యం చేసి బియ్యాన్ని మంచి ధరకు అమ్ముతుంటారు. కొంత పొలంలో మొక్కజొన్నను ప్రతి సంవత్సరం అక్టోబరు మాసంలో సాగు చేస్తుంటారు. ఎకరానికి సుమారు 40 క్వింటాళ్ళ మొక్కజొన్న దిగుబడి పొందుతూ తమ సొంతానికి అవసరమైన మ్కొజొన్నను ఉంచుకొని మిగతావి మార్కెట్‌లో అమ్ముతుంటారు. ప్రతి సంవత్సరం మొక్కజొన్న, వరి పంటలను ఒకే ఒక పంట అదే ప్రాంతంలో సాగు చేస్తుంటారు. రెండవ పంటగా ఏ విధమైన పంటలు సాగు చేయకుండా పిల్లిపెసర్లు చల్లి అవి పెరిగిన తరువాత పొలంలో గేదెలను వదులుతుంటారు. ఎలాంటి పంట మార్పిడి, అంతర పంటలు, మిశ్రమ పంట విధానాలను పాటించరు. 

తన 50 ఎకరాల పొలాన్ని 365 భాగాలుగా చేసుకుని రోజుకి ఒక భాగంలో 50 గేదెలు ఒక రోజు ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ 50 గేదెల ద్వారా వచ్చిన పేడ మరియు మూత్రాలు ఆ రోజు అదే ప్రాంతంలో పడతవి. ఆ విధంగా 365 రోజులలో 50 ఎకరాలలో గేదెల పేడ మరియు మూత్రాలు అందేలా జాగ్రత్తపడతారు. అంతకుమించి ఏ విధమైన సాగు పద్ధతులు పాటించరు. ఈ విధంగానే ప్రతీ సంవత్సరం చేస్తూ ఉంటారు. అంటే ప్రతి సంవత్సరం ఎకరానికి 365 గేదెల ద్వారా ఒక రోజులో వచ్చే పేడ మరియు మూత్రాలు అందిస్తూ వస్తున్నట్లు. భూమికి అవసరమయిన మరియు పంటకు అవసరమయిన అన్ని రకాల పోషకాలు ఈ పేడ మరియు మూత్రాలు ద్వారా అందుబాటులోకి వస్తుంటావి కాబట్టి ఆ పొలంలో పండే పంటలు ఆరోగ్యాంగా, చీడపీడలను తట్టుకునే విధంగా పెరుగుతాయి. కాబట్టి ఈ పొలంలో చీడపీడల సమస్య పెద్దగా ఉండదు. ఈ పద్ధతిలో చీడపీడలు పంటలను ఆశించవు. అంటే చీడపీడలు ఆశించకుండా భూమిని, పంటలను తయారు చేయడమే ఇక్కడ మనము చేసేది. ఇదే ఉత్తమమైన పద్ధతి. కానీ నేటి రైతులు ఇందుకు వ్యతిరేకంగా చీడపీడలు ఆశించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చీడపీడలు ఆశించిన తరువాత వివిధ రకాలుగా ఖర్చులు పెడుతూ సాగు ఖర్చు పెంచుకుంటున్నారు కాబట్టి పంటల సాగు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఈ పద్ధతిలో కలుపు సమస్య కూడా పెద్దగా ఉండదు. గేదెలు పొలం మొత్తం తిరుగుతూ ఉండడం వలన వాటి మూత్రానికి కలుపు గింజల మొలక శక్తిని కోల్పోవడంతో పాటు మొలచిన చిన్న చిన్న మొక్కలు గేదెల మూత్రం ఘాటుకి మాడి పోతాయి. నేటి రైతులు తమ వ్యవసాయంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యలు కలుపు మరియు పెట్టుబడులు తగ్గించుకోవడానికి మరియు దిగుబడుల నాణ్యత పెరగటానికి ఇదే ఉత్తమమైన మార్గం అంటున్నారు సతీష్‌ బాబు.

ప్రపంచంలో మన దేశంలోనే ఈ విధానం మన పూర్వీకులు వ్యవసాయంలో పాటించారు. కానీ పాశ్చాత్య పోకడలకు అలవాటయిన మనము వ్యవసాయంలో కూడా పాశ్చాత్య పోకడలను అనుకరించి రసాయనాలను ఉపయోగించడం, పశుపోషణకు దూరం జరగడము జరిగింది. కాబట్టి దాని ప్రభావాన్ని మన రైతులు రుచి చూశారు…. చూస్తున్నారు…. ప్రపంచంలోని మిగతా దేశాలు కూడా తమ తమ వ్యవసాయ పద్ధతులలో ఉన్న తప్పులను ఇప్పుడిప్పుడే గుర్తిస్తూ అందుకు పరిష్కారం మన తాతలు చేసిన పాత వ్యవసాయ పద్ధతులు అంటే వ్యవసాయం చేయాలంటే పశువులను తప్పనిసరిగా పోషించాలి. పశువులను పోషిస్తూ పంటల సాగు చేసిన వారిని రైతు అంటారు. అదే మన తాతముత్తాతల నిర్వచనాన్ని ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాయి. 

వ్యవసాయంలో డ్రోన్‌ లాంటి ఆధునిక టెక్నాలజీ వచ్చిందని సంబర పడుతున్నాము. అసలు డ్రోన్‌ అవసరము లేని టెక్నాలజీని అశ్రద్ధ చేసి డ్రోన్‌ టెక్నాలజీ వచ్చింది సంబరపడటాన్ని ఏమంటారంటే? గాయం చేసి ఆయిట్‌మెంట్‌ రాయడం అంటారు. అసలు గాయం చేయకుండా ఉంటే సరిపోతుంది కదా! గాయం చేయటం ఎందుకు? ఆయిట్‌మెంట్‌ రాయడం ఎందుకు? మన పూర్వీకులు చేసిన వ్యవసాయం అదే. అసలు డ్రోన్‌ అవసరము లేని సాగు పద్ధతులు మన సొంతం అయినప్పుడు దానిని ప్రక్కదోవ పట్టించి మరలా డ్రోన్‌ టెక్నాలజీ వచ్చిందని సంబరపడిపోవటాన్ని ఏమనాలో ఆలోచించండి అని సతీష్‌బాబు అంటున్నారు.

ప్రపంచంలో పశువులను వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగించేది మన దేశంలోనే కావచ్చు. చాలా దేశాలలో పశువులను మాంసం కొరకు పెంచుతుంటారు. ఒకప్పుడు అంటే బుద్ధునికి పూర్వం మన దేశంలో కూడా పశువులను వ్యవసాయంలో ఉపయోగించుకోవడంతో పాటు మాంసం కోసం తినటానిక్కూడా పశువులను పోషించేవారు. జంతు బలుల పేరుతో ప్రతి కార్యక్రమంలో బలులు అంటే ఆవులను, గేదెలను బలి ఇస్తూ ఆ బలి ఇచ్చిన జంతువులను ఆహారంగా తీసుకునేవారు. కానీ వ్యవసాయంలో ఉపయోగించే, ఉపయోగపడే పశువులను జంతు బలుల పేరిట బలి ఇవ్వడం సరయినది కాదని, ఈ పద్ధతి ఇదే విధంగా కొనసాగితే మన వ్యవసాయానికి ఏ పశువు అందుబాటులో లేక వ్యవసాయం కుంటుపడుతుందని గ్రహించిన బుద్ధుడు జంతుబలులను నిర్మూలించటానికి ముమ్మర ప్రయత్నాలు చేశారు. తరువాత అశోకుని కాలంలో జంతుబలులను నిషేధించడం కూడా జరిగింది. అప్పటి నుండి (జంతువులను) పశువులను ఆహారంగా ఉపయోగించడం తగ్గించి వ్యవసాయంలో ఉపయోగించడం పెరుగుతూ వచ్చింది. కాబట్టే మన పూర్వీకులు ఆరోగ్యకరమైన వివిధ రకాల పంటలు పండించారు. మన దేశ వాతావరణం వివిధ రకాల పంటల సాగుకి అనుకూలం మరియు మన రైతులు మంచి నైపుణ్యం చూపించగలిగారు కాబట్టి అప్పట్లో ప్రపంచంలో ఎక్కడా పండని సుగంధ ద్రవ్యాలను మన రైతులు పండించారు. ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం వచ్చిన ఈస్ట్‌ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో మన దేశంలో అడుగుపెట్టి చివరకు దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగారు. అంటే ఇక్కడ మనకు అవసరమైన విషయం మనల్ని బ్రిటీష్‌ వారు పరిపాలించటం కాదు. మన రైతుల గొప్పతనం. మన దేశ గొప్పతనం. ఏ దేశం మీద, ఏ ప్రాంతం మీద ఆధారపడకుండా ఏ ప్రాంతానికాప్రాంతంలో అందుబాటులో ఉండే వనరులతో అద్భుతమైన పంటలు మన రైతులు పండించారు. పంటలు పండించటానికి ఊరు కూడా దాట వలసిన పనిలేదు అనేవిధంగా పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితి నుంచి పంటల సాగులో అవసరమైన ప్రతిదానికి షాపులకు వెళ్లాలి. ఊర్లు దాటాలి… జిల్లాలు… రాష్ట్రాలు దాటాలి. చివరకు దేశాలు కూడా దాటాలి అనేలా పరిస్థితులకు దిగజారాయి. వరి పండించే రైతు తన ఇంటికి అవసరమైన బియ్యాన్ని షాపులో కొనుగోలు చేస్తున్నాడు. మారుమూల పల్లెటూర్లలో కూడా పాలు కావాలంటే ప్యాకెట్లలో పాలు కొనుక్కోవలసిందే. విత్తనం కావాలంటే విత్తనాల షాపులకి, చీడపీడల నివారణకు ఏవైనా కావాలంటే పురుగు మందుల దుకాణానికి పరిగెత్తవలసిన దౌర్భాగ్యంలో ప్రస్తుత రైతులు ఉన్నారు. పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే చివరకు మిగిలేది శూన్యం. ప్రపంచ దేశాలు మన పురాతన సాగు పద్ధతులను గుర్తించినవి కాని మన రైతులే గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికైనా మేల్కొని మన పురాతన సాగు పద్ధతులను తిరిగి ప్రారంభిస్తేనే వ్యవసాయం, రైతు నిలబడగలడు అని చెబుతున్నారు సతీష్‌. మనం కూడా ఒకసారి సతీష్‌ మాటల గురించి ఆలోచిద్దాం.

అసలైన వ్యవసాయానికి సూత్రాలు

వ్యాపారాలకి, రాజకీయాలకి, ఉద్యోగాలకి, సంసారానికి… కొన్ని సూత్రాలు ఉన్నట్లే వ్యవసాయానికి కూడా కొనిన సూత్రాలు ఉన్నాయి. రైతు తప్పనిసరిగా పంటల సాగుతో పాటు పశుపోషణ చేపట్టాలి. పశువ్యర్థాలను పంటలకు, పంట వ్యర్థాలను పశువులకు అందించాలి. పంటలకు చీడపీడలు ఆశించకుండా జాగ్రత్త వహిచాలే కానీ చీడపీడలు వచ్చిన తరువాత నివారించడానికి ప్రయత్నాలు చెయ్యకూడదు. రైతు తప్పనిసరిగా పంటల సాగుకి దగ్గరలో నివాసం ఏర్పాటు చేసుకుని ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి రోజు పంటలను గమనిస్తూ ఉండాలి. సాధ్యమయినంత వరకు వ్యవసాయంలో అవసరమైన అన్ని పనులు కుటుంబ సభ్యుల సహకారంతో చేయగలగాలి. కూలీల మీద ఎక్కువగా ఆధారపడకుండా ప్రణాళిక వేసుకోవాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు, చుట్టప్రక్కల వ్యాపారం, ఉద్యోగం చేసే వారితో పోల్చుకుంటూ తప్పటడుగులు వేయకుండా తనకు ఏది అవసరమో అదే చెయ్యాలి. అంటే అవసరాలకి ప్రాముఖ్యత ఇవ్వాలి కాని అనుకరణలకు ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. వ్యవసాయాన్ని సిగ్గుపడుతూ కాకుండా గర్వంగా అంటే మేము సమాజానికి ఆహారం అందిస్తున్నాము అనే తృప్తితో, రైతు లేకపోతే ప్రజలు లేరు, అందరికీ రైతు అవసరం తప్పనిసరి అని తెలియచేసేలా వ్యవసాయం చేయాలి లాంటి కొన్ని సూత్రాలను గద్దె సతీష్‌ తోటి రైతులకు తెలియచేశారు. 

గద్దె సతీష్‌ బాబు Cell: 9912511244

కొత్తగూడెం, ఏలూరు జిల్లా