భూసారం ఎంతగా పెరిగితే అందులో మనం పండించే పంటలు అంతగా దిగుబడిని అందిస్తాయి. నేటి కాలంలో వాడే ఎన్నో రకాల రసాయన మందుల వలన భూమి సారవంతత తగ్గుతుంది. దానితో పంట తక్కువ దిగుబడి వస్తుంది. వీటిని వీలైనంత తక్కువ వాడుతూ రసాయన ఎరువులు ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్టనూ ఉపయోగిస్తున్నారు. చాలామంది శాస్త్రవేత్తలు కూడా వీటి వినియోగాన్ని పెంచాలంటూ సూచిస్తున్నారు. ఈ పచ్చిరొట్టలు వేయడం వల్ల పంటలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

పచ్చరొట్ట ఎరువులను భూమికి రెండు విధాలుగా అందించవచ్చు.

1. పచ్చిరొట్ట ఎరువులు; 

2. పచ్చిఆకు ఎరువులు

పచ్చిరొట్ట ఎరువులు: జనుము, జీలుగు, పెసర, అలసంద వంటి పంటలను పూత వరకు పెంచి ఆ తర్వాత నెలలో కలిపి దున్నడాన్ని పచ్చిరొట్ట ఎరువులు అంటారు.పచ్చి ఆకు ఎరువులు: కానుగ, గ్లైరిసిడియా, అవిశ, సీమతంగేడు, వెంపలి వంటి మొక్కల ఆకులను కోసుకొచ్చి పొలంలో తొక్కి వేయడాన్ని పచ్చి ఆకు ఎరువులు అంటారు.

కట్టె జనుము: ఇది అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. పచ్చిరొట్టగా పశువుల మేతగా ఉపయోగించవచ్చు. ఎకరానికి 12 నుండి 15 కిలోల విత్తనాలు చల్లుకోవాలి. దీనివల్ల 5 నుండి 6 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది.

పిల్లిపెసర: దీనిని తేలిక మరియు బరువైన నేలల్లో సాగు చేయవచ్చు. చౌడు భూముల్లో ఇవి సాగుకు పనికిరావు. ఎకరానికి 6 నుండి 8 కిలోల విత్తనం అవసరమవుతుంది. దీనివల్ల మూడు నుండి నాలుగు టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. నీలి వెంపలి: ఇవి చాలా ప్రదేశాల్లో కలుపు మొక్కలుగా కనబడతాయి. ఇవి అన్ని రకాల నేలల్లో వేసుకోవచ్చు. వీటిని పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవచ్చు. ఇవి ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలను అందుకుంటాయి.
పచ్చిరొట్టపైరుకు ఉండవలసిన లక్షణాలు:  

* తక్కువ రోజుల్లో బాగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను ఇచ్చేలా ఉండాలి.*    అన్ని రకాల నేలల్లో పెరిగే గుణాన్ని కలిగి ఉండాలి.

*    పచ్చిరొట్ట పీచు శాతం తక్కువగా ఉండి ఎక్కువ ఆకు కలిగి రసభరితంగా ఉండాలి.

*    నేలలో కలియదున్నినప్పుడు త్వరగా కుళ్ళి భూమిలో కలిసేటట్లు ఉండాలి.

*    త్వరగా పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అరికట్టాలి.

*    పచ్చిరొట్ట వేర్లు చాలా లోతుకు పోయేలా ఉండాలి.

*    పప్పు జాతి మొక్కల వేర్లలో బుడిపెలు ఉండి వాతావరణంలో నత్రజని స్థిరీకరణ చేసే విధంగా ఉండాలి.

*    ఏ రకమైన నేలలో అయినా పెరిగే గుణాన్ని కలిగి ఉండాలి.

*    తక్కువ వనరులు వినియోగించుకుంటూ సాధారణ యాజమాన్యంలో త్వరగా పెరిగి అధికంగా పచ్చిరొట్ట పైర్లు అందించేలా ఉండాలి.
పచ్చిరొట్ట ఎరువుల వాడకంలో సూచనలు

*    పచ్చిరొట్ట ఎరువులను పూత థలలో ఉన్నప్పుడు కలిపి దున్నాలి.

*    నేలలో కలిపి దున్నే నాటికి పైర్లలో 40 నుండి 80 శాతం తేమ ఉండటమే కాకుండా, నేలలో కూడా సరిపడ నీరు ఉన్నట్లయితే అవి త్వరగా మురుగుతాయి. ఇక పైరు మొత్తం మురిగిన తర్వాత పాత నీటిని తీసివేయాలి. వేరే నీటిని అందివ్వాలి.

*    పచ్చిరొట్ట పంటలు సాగు చేసే నేలలో నత్రజని తక్కువగా ఉండడం వల్ల నత్రజని వేసినట్లయితే అవి ఏపుగా పెరిగి రొట్ట దిగుబడి ఎక్కువగా ఉంటుంది, వేరు బుడిపెలు కూడా పెరుగుతాయి. 
పచ్చిరొట్ట ఎరువుల వాడకం

ఒక ఎకరానికి 24 కిలోల జనుము, 12 నుండి 14 కిలోల జీలుగ, 14 నుండి 16 కిలోల పెసర మరియు, 6 నుండి 8 కిలోల అలసంద వంటి పచ్చిరొట్ట పంటలను పెంచుకోవచ్చు. 
పచ్చిరొట్ట పైర్ల సాగులో ఇబ్బందులు

 పచ్చిరొట్ట ఎరువులు వేసిన తర్వాత నేలలో వేసి కలియదున్నడానికి సుమారు 45 రోజుల వ్యవధి పడుతుంది. ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను ఇవ్వాలంటే తేమ అవసరమవుతుంది.
పచ్చిరొట్ట ఎరువుల లాభాలు

*    నేల భౌతిక స్థితి మెరుగుబడి, భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది.

*    నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవుల వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యలవల్ల నేల సారం పెరుగుతుంది.

*    నేలలో లభ్యం కాని రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగపడతాయి.

*    జీలుగు, జనుము, పిల్లిపెసర వంటి పైర్లు వేసినప్పుడు వీటి వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల భూమిలోపలి పొరల్లో నిక్షిప్తమైన అనేక పోషకాలను తెచ్చి పంటకు అందిస్తాయి.

*    పప్పుజాతి పంటల వల్ల రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. భాస్వరం, గంధకం వంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుంది.

*    పచ్చి రొట్ట పైర్లు ఎరువులగానే కాకుండా పశువులకు మేతకుగాను ఉపయోగపడుతుంది.       

ముదిగిరి చందన, ఇ. అనూష,

 పిహెచ్‌డి స్కాలర్స్‌, పి.జె.టి.ఎస్‌.వి.యూ.,

రాజేంద్రనగర్‌, తెలంగాణ.

ఇ-మెయిల్‌: chandanamudigiri@gmail.com