చదువుకున్న వాడికీ ఇతరులకు ఎంత తేడా ఉంటుందంటే బతికి ఉన్నోడికి, చచ్చిన వాడికీ ఉన్నంత తేడా ఉంటుందని అరిస్టాటిల్‌ చెబుతారు. దీనికి సరిగ్గా సరిపోతారు డాక్టర్‌ జీఆర్‌ చింతల. కొందరు తెలివైన వాళ్లు భూమిపై ఎంత ఎత్తు ఉంటారో, భూమి లోపల కూడా అంతే ఉంటారంటుంటారు పెద్దలు. దానికి ప్రత్యక్ష తార్కాణం ఆయన. గురిపెట్టి ఊరుకుంటే చాలదు, తుపాకీ గుండు పేల్చాలన్న సామెతను నిజం చేసి చూపుతాడు. ఉన్న ఆస్తులు ఊడ్చుకుపోయినా, కనిపించని కష్టాలు ఎదురైనా చెక్కుచెదరని మనస్థత్వంతో ముందడుగు వేశారు. చదువు తప్ప మరేదీ తనను కాపాడలేదని నిర్ణయించుకున్నారు. చదువు, కష్టపడే మనస్తత్వం, చిత్తశుద్ధి, నలుగురికి మేలు చేయాలనే తపనతో నిచ్చెనమెట్ల వ్యవస్థలో పైమెట్టుకు చేరినవారు డాక్టర్‌ చింతల. డాక్టర్‌ కావాలనుకుని వ్యవసాయంలో పట్టా తీసుకుని ఎక్కడైతే చేరారో ఆ సంస్థకే ఛైర్మన్‌ అయిన ఖ్యాతి చింతల గోవిందరాజులుది. పుట్టింది గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం బ్రాహ్మణకోడూరు. ఈ ఊరుకి ఎంతో ఘన చరిత్ర ఉంది. విభిన్న మనస్తత్వాలున్న వ్యక్తులు, శక్తులకు వేదిక ఆ ఊరు. ఇక్కడ పుట్టిన ఓ వ్యక్తి పి. కోదండ రామయ్య కాఫీ బోర్డ్‌ ఛైర్మన్‌, టొబాకో బోర్డ్‌ ఎక్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేశారు. అదే ఊరికి చెందిన జీఆర్‌ చింతల నాబార్డ్‌ చైర్మన్‌ పదవిని అలంకరించడం విశేషం. ఈ ఊరికి చెందినవాళ్లు ఇంటికొకరైనా అమెరికా సహా వివిధదేశాల్లో ఉంటారంటే అతిశయోక్తి కాదు. రామినేని ఫౌండేషన్‌ పేరిట అవార్డులు ఇచ్చే కుటుంబం ఈ ఊరిదే. ఫుడ్‌ టెక్నాలజీలో పేరుగాంచిన మోడరన్‌ ఫుడ్స్‌ చైర్మన్‌గా పని చేసిన ఎం. మురళీకృష్ణ ఈ ఊరివారే. కోదండరామయ్య, మురళీమోహన్‌లు కూడా బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్ధులు కావటం విశేషం. కమ్యూనిస్టుగా ఉంటూ మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ తరగతుల (ఎంబీసీ) సిద్ధాంతకర్తగా ఎదిగి ఇటీవలే కన్నుమూసిన ఊసా సాంబశివరావు అనే ఉద్యమకారుడు ఈ ఊరి వారే కావడం గర్వకారణం.

బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి ఎదిగివచ్చిన అన్ని ముత్యాలలో మేలయిన ముత్యం జి ఆర్‌ చింతల. ఆయనది అరుదయిన వ్యక్తిత్వం. జీవితంలో ప్రతి అంశమూ ఆయనకు ఒక అవకాశమే. జీవిత వాస్తవాలను అంగీకరిస్తూ ఆ పరిధిలోనే సమాజ వృద్ధికి, తన ఎదుగుదలకు గల అవకాశాలను అన్వేషిస్తూ, పరిమితులను గుర్తిస్తూ, ఆ మార్గాన విజయాలు సాధిస్తూ సాగుతున్న ఆయన జీవన మార్గం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. నాబార్డులో దాదాపు 35 ఏళ్ళు పనిచేసి ప్రతి మలుపును అవకాశంగా మలచుకొని ఆ సంస్థ చైర్మన్‌గా ఎదిగి దేశానికి సేవలందిస్తున్నారు. ఆయన జీవన రేఖలు – క్లుప్తంగా…

గురి పెట్టి కొట్టారు… నాబార్డ్‌ ఛైర్మన్‌ అయ్యారు
నాబార్డ్‌ చైర్మన్‌గా దేశప్రజల మన్ననలు అందుకొంటున్న జి.ఆర్‌ చింతల గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం బ్రాహ్మణకోడూరు గ్రామంలో 1962 సంవత్సరం జులై 15వ తేదీన జన్మించారు. వారి తాత చింతల పుల్లయ్య పెద్ద భూస్వామి, అంతకుమించి వితరణశీలి. ఆయన చేసిన దానధర్మాలకు అంతేలేదు. ఆయనకున్న 100 ఎకరాల మాగాణి భూమిలో దానధర్మాలకు పోయిందిపోగా, సంతానానికి పది ఎకరాలు మాత్రమే మిగిల్చారు.

వారి తండ్రి చింతల బుచ్చయ్య. ఆయన విద్యార్థి థలో మంచి ప్రతిభావంతుడు. ఆయనకు 1940 థకంలోనే గుంటూరు మెడికల్‌ కాలేజీలో ఎంబిబిఎస్‌ చదివే అవకాశం వచ్చింది. కుటుంబ సమస్యల కారణంగా డాక్టర్‌ చదవలేకపోయారు. గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చేసి విద్యాశాఖలో ఉద్యోగంలో చేరారు. తరువాత అక్కినేని కృష్ణకుమారిని వివాహం చేసుకొన్నారు. వారి కుమారుడు చింతల గోవిందరాజులు. ఆయనే జి ఆర్‌ చింతల.

బ్రాహ్మణకోడూరు గ్రామంలోనే మాగాణి పొలాల మధ్య ఆడుతూ పాడుతూ పెరిగాడు చింతల. చిన్నతనంలో తాతయ్య, పెదనాన్నలు, బాబాయిలతో తరచుగా పొలం వెళ్ళేవాడు. ఏడేళ్లు వయస్సు వచ్చేవరకు అక్కడే పెరిగాడు. బ్రాహ్మణకోడూరు గ్రామానికి బకింగ్‌హామ్‌ కాలవ ద్వారా 1856 నుంచే సాగు నీటి వసతి వుండేది. ఆ గ్రామంలో100 ఏళ్లకు పూర్వం నుంచే హైస్కూల్‌ ఉండేది. నాలుగోతరగతి వరకు గోవిందరాజులు చదువు అక్కడే సాగింది. వారి తండ్రి చింతల బుచ్చయ్య ఉద్యోగరీత్యా గుంటూరుకు నివాసము మార్చారు. గుంటూరుకు చేరేవరకు గోవిందరాజులు, ఆయన సోదరుడు చదువులోనూ, లోకజ్ఞానంలోనూ బాగా వెనుకబడి ఉండేవారు. వారి తండ్రి బుచ్చయ్య ఆరు నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టి పిల్లలకు చదువుచెప్పారు. ఆయన పెద్దబాలశిక్ష, ఇంగ్లీష్‌ అక్షరాలు, ఎక్కాలు నేర్పేవారు. తన తండ్రే తన తొలి గురువని చెబుతారు చింతల. తన తండ్రి నేర్పిన తొలిపాఠాలు ఇప్పటికీ తనకు మార్గదర్శకంగా ఉంటాయంటారు. గుంటూరులోని పానయ్య బడి, కాసు సాయమ్మ హైస్కూల్‌, శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో అయన చదువు కొనసాగింది. శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో టెన్త్‌ క్లాస్‌, గుంటూరు జేకేసీ కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసాడు. క్లాసులో ఫస్ట్‌ ర్యాంకర్‌. సహవిద్యార్థులు (ప్రస్తుతం ప్రముఖ సర్జన్లు, న్యూరాలజిస్టులు, అంకాలజిస్టులుగా ఉన్నారు.) మెడిసిన్‌కు వెళ్లినా చింతల అటు వెళ్లాలనుకోలేదు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో చేరారు.

తన జీవితంలో అది ముఖ్యమైన మలుపుగా చెప్తారు చింతల. ఆ కాలేజీ జీవితం, నాటి అనుభవాలు తరచుగా గుర్తు చేసుకొంటుంటారు. బాపట్ల కాలేజీ తల్లిలాగా తనను అక్కున చేర్చుకొన్నదని, సహజీవనం నేర్పిందని, జీవితకాలం కలసిఉండే మంచి మిత్రులను కల్పించిందని అంటారు. నాటి స్నేహితులను వీలయినప్పుడల్లా పలకరిస్తుంటారు. ప్రతిభావంతులయిన అధ్యాపకుల మార్గదర్శకత్యంలో, 168 మంది సహాధ్యాయులు, స్నేహితుల ఆప్యాయత, అనురాగాలతో కోలాహలంగా, ఉత్సాహంగా నాలుగేళ్ల అగ్రికల్చర్‌ కోర్సు అట్టే గడచిపోయింది. ఆ రోజుల్లో గోవిందరాజులుకు అయన సహాధ్యాయి, మిత్రుడు కె ఉదయభాస్కరరెడ్డి అందించిన తోడ్పాటు మరువలేనిది, పాఠ్యాంశాలు, సమకాలీన పరిస్థితులను అర్ధం చేసుకొనేందుకు ఇతరత్రా కూడా ఆయన ఎంతగానో సహకరించారు. అప్పుడు ఉదయ భాస్కరరెడ్డి కళ్ళతో తాను ప్రపంచాన్ని చూచానంటారు చింతల. అంతగా ఉండేది వారి మైత్రీ బంధం. నాలుగేళ్ళ డిగ్రీ పూర్తయ్యాక బాపట్ల అగ్రికల్చరల్‌ కాలేజీలో ఆయేడాదే ప్రారంభమయిన ఎంఎస్‌సి అగ్రానమిలో చేరాడు. కాని తృప్తిగా అనిపించలా. ఏదో అసంతృప్తి. ఇంకేదో చెయ్యాలనే ఆలోచన ఉండేది. ఎందరో శాస్త్రవేత్తలను రూపొందించిన, అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న, వ్యవసాయ విద్య, పరిశోధనలలో అగ్రగామి అయిన ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వైపు ఆయన మనసు మళ్ళింది. ఇష్టమైన బాపట్ల కాలేజీని, అప్పటికే ఒక సంవత్సరం పూర్తయిన ఎంఎస్‌సి చదువును వొదిలిపెట్టి ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (IARI)లో ఎంఎస్‌సి (Seed Science & Technology) మొదటి సంత్సరంలో చేరారు. ఇది ఆయన జీవితంలో మేలి మలుపు.
(IARI)లో చేరేందుకు ఆయనపడ్డ ఆరాటం, చేసిన యోచన తరువాత కాలంలో గొప్ప సంతృప్తిని, ఆనందాన్ని ఫలితాలను చేకూర్చింది. IARI ఆయనలోని జిజ్ఞాసను పెంపొందించింది. సృజనాత్మకతను, నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను అలవర్చింది. గొప్పవ్యక్తుల పరిచయాలను కల్పించింది. దేశానికి బహుముఖ ప్రజ్ఞాశాలిని అందించింది. ఆయనకు గొప్ప భవిష్యత్ను కల్పించింది.

ఏంతో ఉత్సాహం, ఉద్వేగంతో IARI లో చింతల ఉన్నత విద్యాభ్యాసం సాగింది. IARI లో ప్రొఫెసర్‌ శ్రీమతి మాళవిక దద్లాని జిఆర్‌ చింతలను ఎంతగానో ప్రోత్సహించారు. ఇప్పటికి చింతల గొప్ప విజయాలు సాధించినపుడు ఆమె భుజంతట్టి అభినందిస్తుంటారు. డాక్టర్‌ చంథ్రేఖర్‌ (సిటిఆర్‌ఐ రాజమండ్రి) డాక్టర్‌ ఎస్‌విఎస్‌ఎస్‌ ప్రసాద్‌ (ఇన్‌కంటాక్స్‌) డాక్టర్‌ అర్జ శ్రీకాంత్‌ తదితరులు మంచి స్నేహితులు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇన్‌సర్వీస్‌ విద్యార్థి యాదగిరినాగ్‌ చింతలకు తోడుగా ఉండేవారు. డాక్టర్‌ అంచా శ్రీనివాసన్‌, అంచా అయ్యేశ్వరరావు చింతల వారి మిత్ర బృందానికి మార్గదర్శకంగా ఉండేవారు. డాక్టర్‌ వేణుగోపాల ముఖోపాధ్యాయ తనకు రోల్‌ మోడల్‌ అని జి ఆర్‌ చింతల చెప్తారు. డాక్టర్‌ వేణుగోపాలముఖోపాధ్యాయ విజ్ఞాన గని లాంటివారు. నిరంతర అధ్యయనశీలి. అయన కూడా నాబార్డ్‌లో చేరి సిజిఎంగా 2017లో రిటైర్‌ అయ్యారు.

ఐఎఆర్‌ఐలో ఎంఎస్‌సి చివరి సంవత్సరంలో ఉండగానే నాబార్డ్‌వారు క్యాంపస్‌ రిక్రూట్మెంట్‌కు వచ్చారు. క్యాంపస్‌ రిక్రూట్మెంట్‌ అనేది ఐఎఆర్‌ఐలో గతంలో ఎన్నడూ లేదు, ఆఏడాదే కొత్తగా మొదలయింది. చింతల ఆప్లికేషన్‌ని అయన క్లాసుమేట్‌ రవీందర్‌సింగ్‌ (ప్రస్తుతం హూస్టన్‌లో ఉంటున్నారు) నింపి సబ్మిట్‌ చేశారు. విద్యార్థులంతా వేడుకగా ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. నాబార్డ్‌ అధికారులు దాదాపు నాలుగొందలమంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి జిఆర్‌ చింతలతో సహా పదమూడు మందిని ఎంపిక చేసారు.

బొంబాయిలోని నాబార్డ్‌ కేంద్ర కార్యాలయంలో 1985 అక్టోబర్‌ ఒకటో తేదీన జిఆర్‌ చింతల రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ విభాగంలో ఉద్యోగంలో చేరారు. అలా చేరిన వాడు 2020 మే 27వ తేదీన ఆ సంస్థకు చైర్మను అయ్యాడు. కోవిడ్‌ మహమ్మారి సర్వత్రా వ్యాపించి ఉన్న కష్టకాలంలో కూడా దేశమంతా పర్యటిస్తూ సంస్థ, దేశాభివృద్ధికి కృషిచేస్తున్నారు. 2020లోనే ఎపిఆర్‌ఎసిఎ అధ్యకక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నాబార్డ్‌లో ఆయన సుదీర్ఘ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. సమున్నత ప్రమాణాలతో, సంతోషకరమైన జీవనం ఆయన విధానం. సామాజిక బాధ్యతలు నిర్యహిస్తూ, పనిచేసే సంస్థ అభివృద్ధికి పాటుపడుతూ అందులోనే తానుఎదుగుతూ సాగిన జిఆర్‌ చింతల జీవితం ఈనాటి యువతకు ఆదర్శం. ఏపదవిలోఉన్నా ఎలాంటి భాద్యత నిర్వర్తించాల్సి వచ్చినా దీక్షగా, మనస్ఫూర్తిగా చేయటం ఆయన నైజం. ప్రతి బాధ్యతను ఒక అవకాశంగా మార్చుకొనే నేర్పరి. వృత్తి, ఉద్యోగంపట్ల ఆయనకున్న నిబద్ధత కర్తవ్య నిర్వహణలో కనపరచే అకుంఠిత దీక్ష, సమయస్పూర్తి, నిర్ణయాలు తీసుకోవడంలో కనపరచే వొడుపు, పనిలో వేగం, నిర్దిష్టత ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేర్చాయి.

నాబార్డులో చేరినవెంటనే నేషనల్‌ కెమికల్‌ లాబొలేటరీ వంటి ప్రముఖ సంస్థలతో జరిగే చర్చల్లో పాల్గొనే అవకాశం వచ్చింది.
సిఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన డాక్టరు మషేల్కర్‌ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలతో చర్చించే అవకాశం కలిగింది. 1987లో స్వయం సహాయక గ్రూపుల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక విధానాలను రూపకల్పన చేసేందుకు నాబార్డ్‌ ఏర్పాటు చేసిన అధికారుల బృందంలో జి.ఆర్‌ చింతల పనిచేశారు. ఆ తరువాతి కాలంలో స్వయం సహాయక గ్రూపులు (సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులు) దేశ వ్యాప్తంగా విజయవంతమయ్యాయి. 2001లో దేశంలో స్వయం సహాయక గ్రూపులు పదిలక్షలు దాటిన సందర్భంగా నాబార్డ్‌కు ఐరాస అవార్డు లభించింది.

ఐదేళ్ళు నాబార్డ్‌ కేంద్ర కార్యాలయంలో పనిచేసాక జిఆర్‌ చింతల హైద్రాబాదుకు బదిలీ అయ్యారు. హైద్రాబాదులో ఉద్యోగం ఆయన జీవితంలో అనేక సానుకూల మార్పులకు అవకాశం కల్పించింది. 23 జిల్లాలలో విస్తృతంగా పర్యటించారు. రైతులను, అధికారులను తరచుగా కలిసి మాట్లాడేవారు. ఇదే కాలంలో నాబార్డులో సహోద్యోగి సుశీలతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె నాబార్డ్‌ అనుబంధ సంస్థ అయిన NAB KISAN సిఇఒ & మేనేజింగ్‌ డైరెక్టరుగా పనిచేస్తున్నారు. హైద్రాబాద్‌లోనే వారికి ఒక పాప కూడా పుట్టింది.

అదేకాలంలో బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులలో చాలామందిని మళ్ళీ కలుసుకున్నారు చింతల. వారిలో దయాకర్‌, ఎస్‌వి ఎస్‌ఎస్‌, జె సత్యన్నారాయణ, వై వి ఆర్‌, మురళి, మైనర్‌ రమణ, వలేటి గోపీచంద్‌ (రమణ, గోపీచంద్‌ కాలేజీలో ఆయనకు జూనియర్లు అయితే వారు చూపే ఆప్యాయత మరువలేనిదని, తన సోదరుడు సివివి సాగర్‌తోపాటు వారు సోదర సమానులని చింతల పేర్కొంటారు) తదితరులున్నారు. పాత స్నేహాలు చిగురించాయి. ఆ ఆప్యాయతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
దాదాపు ఎనిమిది సంవత్సరాలు హైద్రాబాదులో పనిచేసాక డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పదోన్నతి పొంది ఛండీగడ్‌కు బదిలీఅయ్యారు. అక్కడ నాబార్డ్‌ ప్రాంతీయ కార్యాలయంలో పనిచేస్తూ పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించారు. బ్యాంక్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. కాంట్రాక్టు వ్యవసాయ పద్దతులను, గ్రామీణ సహకార బ్యాంకుల పనితీరును అధ్యయనం చేశారు.

ఆ తరువాత లక్నోలోని బ్యాంకర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (BIRD)లో ఫ్యాకల్టీ సభ్యునిగా పనిచేసే అవకాశం కలిగింది. ఐదేళ్లు అక్కడ పనిచేయడం వల్ల వివిధ రంగాలలో నైపుణ్యం పెంపొందించుకొన్నారు. మంచి వక్తగా, కన్సల్టెంటుగా ఎదిగారు. తరువాతకాలంలో అదే సంస్థకు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. BIRDలో వున్నపుడు దేశంలోని అన్ని రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించారు. ఇండోనేషియా, బంగ్లాదేశ్‌, కెన్యా, పెరూ, బొలివీయా బ్రెజిల్‌, నేపాల్‌, యూకే, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ జర్మనీ, సౌత్‌ఆఫ్రికా, తదితర దేశాలలో పర్యటించారు. Swarna Jayani Swarojgar Yojana పథకానికి కన్సల్టెంట్‌గా పనిచేస్తూ వివిధ రాష్ట్రాలలో దాదాపు లక్షమంది లబ్దిదారులను ఇంటర్వ్యూ చేశారు. దీనివల్ల ప్రభుత్వ పధకాల అమలు తీరుతెన్నులు, దేశంలో పేదిరికం స్థాయి తదితర అంశాలపై విస్తృతమైన అవగాహన కలిగింది.

తరువాత జనరల్‌ మేనేజర్‌గా ప్రమోషన్‌ పొంది అండమాన్‌దీవులలో రెండేళ్లు పనిచేశారు. ఇలాంటిచోట పనిచేయడానికి చాలామంది ఇష్టపడరు. కాని జిఆర్‌ చింతల ఎలాంటి సంకోచము లేకుండా పనిచేశారు. దేశంలోని వేరే ప్రాంతాలనుంచి వ్యవసాయం, ప్రాసెసింగ్‌ రంగాలకు అవసరమయిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రప్పించారు. పోర్టుబ్లెయర్‌లో నాబార్డ్‌ కార్యాలయం, సిబ్బంది నివాసగృహాల నిర్మాణం చేపట్టారు.

అండమాన్‌లో అయన చూపిన చొరవ, ఉత్సాహం గమనించిన నాబార్డ్‌ యాజమాన్యం ఆయనకు ఢిల్లీ కార్యాలయ బాధ్యతలను అప్పగించింది. కేంద్రప్రభుత్వంతో లైజాన్‌ నిర్వహించడమే ఢిల్లీ కార్యాలయం ప్రధాన బాధ్యత. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌లతోపాటు సంబంధిత అధికారులతో సత్సంబంధాలు నెరపుతూ నాబార్డ్‌ పనులు చక్కబెట్టడం ద్వారా అటు ప్రభుత్వంలోనూ ఇటు నాబార్డ్‌లోను మంచి పేరు, గుర్తింపు పొందారు.

ఆతరువాత లక్నోలోని బ్యాంకర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (BIRD) డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆసంస్థ డైరెక్టర్లుగా పనిచేసిన వారిలో జిఆర్‌ చింతల పిన్న వయస్కులు. ఆయనకు 50 ఏళ్లకే ఆ పదవి దక్కింది. అక్కడనుంచి బెంగళూరు వెళ్లారు. కర్ణాటకలో నాబార్డ్‌ కార్యకలాపాల ఇంఛార్జిగా. రెండేళ్లలో కర్ణాటకలో నాబార్డ్‌ లావాదేవీలను ఏడువేలకోట్ల రూపాయలనుంచి 18000 కోట్ల రూపాయలకుపెంచారు.

బెంగళూరు నుంచి నాబార్డ్‌ కేంద్ర కార్యాలయానికి 24 ఏళ్ళ తరువాత మళ్ళీ వెళ్లారు. ఈసారి మైక్రో ఫైనాన్స్‌ విభాగాధిపతి. 25 ఏళ్ళ క్రితం దేశంలో రూపుదిద్దుకున్న స్వయం సహాయక గ్రూపులు ఇప్పుడు పరివర్తన థకు చేరుకొన్నాయి. ఆనాడు స్వయం సహాయక గ్రూపుల విధివిధానాల రూపకల్పనలో పనిచేసిన జిఆర్‌ చింతల ఇప్పుడా గ్రూపుల వివరాలు డిజిటైజ్‌ చేసేపని చేపట్టారు. దీనివల్ల స్వయం సహాయక గ్రూపుల పరపతి విధానం మెరుగవుతుంది. మూడేళ్లు తలమునకలుగా ఆ బాధ్యత నిర్వహించారు. ఆ కాలంలో దేశంలోని 100 జిల్లాలలో డిజిటైజేషన్‌ కార్యక్రమం సాగింది.

అక్కడనుంచి నాబార్డ్‌లో ప్రధాన విభాగమైన రీఫైనాన్సుకు ఆయన అధిపతి అయ్యారు. అదేసంస్థలో 25 ఏళ్ళు వివిధ విభాగాల్లో పనిచేసి అద్భుత ఫలితాలు సాధించిన తరువాతనే ఆయనకు ఆ విభాగంలో పనిచేసే అవకాశం లభించింది. ఆవిభాగంలో అప్పటిదాకా 10 నుంచి 15 శాతం వరకు ఏటా వృద్ధి ఉండేది. దాన్ని నూరుశాతానికి పెంచుదామని మొదటి సమావేశంలోనే జిఆర్‌ చింతల చెప్పగా సిబ్బంది నివ్వెరపోయారు. సాధ్యం కాదని అన్నారు కూడా. కాని కార్యసాధకుడైన చింతల ఎలా సాధ్యమో వారికి వివరించి, అందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి పది నెలల్లో లక్ష్యం సాధించారు. 50,000 కోట్ల రూపాయలు ఉన్న వ్యాపారం పదినెలల్లో 98,000 కోట్ల రూపాయలకు పెరిగింది. ఆయన ఆపదవిలో ఉన్నంతవరకు కొనసాగింది.
ఆ తరువాత నాబార్డ్‌ అనుబంధ సంస్థ NABFINS (Micro Finance)కు సిఇఓగా బెంగళూరు వెళ్లారు. అక్కడ బాధ్యతలు స్వీకరించిన రోజునే నాబార్డ్‌ డిఎండి పదవికి నోటిఫికేషన్‌ వచ్చింది. ఆపదవికి జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఎంపికయ్యారు. బెంగళూరు వెళ్లిన 55 రోజులకే నాబార్డ్‌ డిఎండిగా పదోన్నతి పొందారు. ఆ ఫలితాలు వెలువడ్డ ఆరు రోజులకే నాబార్డ్‌ చైర్మన్‌ పదవికి నోటిఫికేషన్‌ వెలువడింది. మూడు రోజులు, మూడు ప్యానెళ్లు జరిపిన ఇంటర్వ్యూలలో జిఆర్‌ చింతల తీవ్రమైన పోటీని ఎదుర్కొని విజేతగా నిలిచారు. నాబార్డ్‌ ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. కరోనా మహమ్మారి విశ్వవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో కూడా దేశమంతటా పర్యటిస్తూ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు.

తల్లితండ్రులు: చింతల బుచ్చయ్య, అక్కినేని కృష్ణకుమారి.
పుట్టిన స్థలం / తేదీ: 1962 జూలై 15, బ్రాహ్మణ కోడూరు, గుంటూరు జిల్లా
విద్యాబుద్ధులు: బ్రాహ్మణ కోడూరులో ప్రాధమిక విద్య, పాటిబండ్ల సీతారామయ్య హైస్కూలులో ఉన్నత విద్య, జేకేసీ కళాశాలలో ఇంటర్మీడియేట్‌. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ, ఎమ్మెస్సీ (అగ్రీ). భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ, న్యూఢిల్లీ.
గత, వర్తమాన హోదాలు: నాబార్డ్‌ ఛైర్మన్‌, 1985లో నాబార్డ్‌ చేరి అదే సంస్థకు ఛైర్మన్‌ అయిన ఖ్యాతి
ప్రస్తుత నివాసం/ చిరునామా: ముంబయి
సకుటుంబ సపరివార సమేత: భార్య సుశీల (నాబార్డ్‌ సహోద్యోగి కూడా), ఓ కుమార్తె.
ఇ-మెయిల్‌: grchintala@gmail.com
ఫోన్‌ నెంబర్‌: 9739150762