‘రైతునేస్తం’ వ్యవసాయ మాస పత్రికతో రైతు సేవలోకి అడుగుపెట్టి వ్యవసాయ మాస పత్రికలలో మార్పుకు శ్రీకారం చుట్టడంలో వేంకటేశ్వరరావు ముందువరుసలో ఉన్నారు. అప్పటి వరకు ఉన్న వ్యవసాయ మాసపత్రికలు శాస్త్రవేత్తల, అధికారుల సమాచారానికి చాలా ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ ఉండేవారు. అలాంటి సందర్భంలో ‘రైతునేస్తం’ పేరుతో కొత్తగా వ్యవసాయ మాస పత్రికను మొదలుపెట్టి రైతుల క్షేత్రస్థాయి అనుభవాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ అందుకు సంబంధించిన వ్యాసాలకు తగిన ప్రాముఖ్యతను ఇవ్వడం ప్రారంభించారు పాఠకులు ఈ మార్పును స్వాగతించి రైతునేస్తం పత్రికను ఆదరించడం జరిగింది. మిగతా వ్యవసాయ మాసపత్రికలు కూడా ఈ మార్పును గమనించి ఆయా మాసపత్రికలలో రైతుల క్షేత్ర స్థాయి అనుభవాలకు ప్రాముఖ్యతను పెంచడం జరిగింది. 2005వ సంవత్సరం నుండి రైతునేస్తం పత్రికను కొనసాగిస్తూ వస్తూ సేంద్రియ సాగు యొక్క ప్రాముఖ్యతను ఊహించి 2016వ సంవత్సరములో ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ స్థాపించి సేంద్రియ సాగుపై శిక్షణా తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. వ్యవసాయ రంగానికి వేంకటేశ్వరరావు అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరంలో ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ‘రైతునేస్తం ఫౌండేషన్‌’లో శిక్షణ పొందిన అనేకమంది రైతులు తమ రసాయన సేద్యాన్ని సేంద్రియంలోకి మార్చారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సేంద్రియ సేద్యానికి రైతునేస్తం వేంకటేశ్వరరావు అందించిన సేవలు ఎనలేనివి. ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ యడ్లపల్లి వేంకటేశ్వరరావు సేంద్రియ సాగుకు అందించిన సేవలకు గుర్తింపుగా మహాన్యూస్‌ ఛానల్‌ వారు ‘మహాన్యూస్‌ ఆర్గానిక్‌ అవార్డు’తో సత్కరించారు.


మహాన్యూస్‌ ఛానల్‌ వారు ఈ సంవత్సరం నుంచి ‘మహాన్యూస్‌ ఆర్గానిక్‌ అవార్డు’లను ప్రారంభించారు. మొదటి అవార్డుల కార్యక్రమం జనవరి 9వ తేదీన హైదరాబాదు నగరంలోని దసపల్లా హోటల్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్‌ రెడ్డి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, మహాన్యూస్‌ ఎండి మారెళ్ళ వంశీకృష్ణ పాల్గొన్నారు. సేంద్రియ సాగు అభివృద్ధికి వేంకటేశ్వరరావు చేస్తున్న కృషిని అభినందిస్తూ మహాన్యూస్‌ ఆర్గానిక్‌ అవార్డుతో ప్రముఖులు సత్కరించడం జరిగింది. సేంద్రియ సాగుకు తాము చేస్తున్న సేవలు గుర్తించి సత్కరించినందుకు మహాన్యూస్‌ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ అవార్డు నా బాధ్యతను ఇంకా పెంచింది. సేంద్రియసాగు అభివృద్ధికి ఇంకా వేగంగా ముందుకు నడుస్తానని వేంకటేశ్వరరావు ఈ సందర్భంగా వాగ్దానం చేశారు.